తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ పూర్తయిన నేపథ్యంలో శాఖల కేటాయింపుపై ఉత్కంఠ నెలకొంది. కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వాకిటి శ్రీహరి, వివేక్లకు శాఖలు కేటాయించాల్సి ఉంది. ఈ విషయమై సీఎం రేవంత్రెడ్డి మరికాసేపట్లో ఢిల్లీకి వెళ్లి ఏఐసీసీ అధిష్ఠానంతో చర్చించనున్నారు. ఆర్థిక, పౌర సరఫరాల శాఖలతో సహా పాత మంత్రుల శాఖల్లోనూ మార్పులు జరిగే అవకాశం ఉంది. తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ పూర్తయింది. మంత్రులుగా ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్లు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం శాఖల కేటాయింపుపై తీవ్ర చర్చ జరుగుతోంది. కొత్త మంత్రులకు శాఖలు కేటాయించాల్సి ఉంది. ఈ విషయమై ఏఐసీసీ అధిష్ఠానంతో చర్చించేందుకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మరికాసేపట్లో ఢిల్లీ చేరుకోనున్నారు. మంత్రుల శాఖల పునర్వ్యవస్థీకరణపై అధిష్ఠానంతో సమగ్రంగా చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.
భట్టికి హోం..?
అయితే పాత మంత్రుల శాఖల్లో పెద్ద మొత్తంలో మార్పులు, చేర్పులు జరిగే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఆర్థిక శాఖ, పౌర సరఫరాల శాఖ మంత్రుల మార్పుపై సీఎం ఏఐసీసీ అధిష్ఠానంతో చర్చించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆర్థిక శాఖను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పౌర సరఫరాల శాఖను ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. భట్టి ఆర్థిక శాఖతో పాటు విద్యుత్, ఉత్తమ్ సివిల్ సప్లయ్ శాఖతో పాటు భారీ నీటి పారుదల శాఖలను పర్యవేక్షిస్తున్నారు. ఈ శాఖల మార్పులతో పాటుగా.. సీఎం రేవంత్ రెడ్డి వద్దే ఉన్నహోం, మున్సిపల్, విద్యా శాఖ, ఇతర కీలక శాఖల కేటాయింపులపైనా ఢిల్లీలో చర్చించే అవకాశముంది. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం.. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు కీలకమైన హోం శాఖ ఇచ్చే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. అలాగే శ్రీధర్బాబుకు ఐటీతో పాటు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఇతర కీలక శాఖలు కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వంలో ఐటీ శాఖ ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రస్తుతం హోం, మున్సిపల్ సీఎం వద్దే ఉన్నాయి. కొత్తగా మంత్రివర్గంలోకి వచ్చిన వారికి కూడా ప్రాధాన్యతతో కూడిన శాఖలు దక్కే అవకాశం ఉంది. సీఎం రేవంత్రెడ్డి ఢిల్లీ పర్యటన తర్వాత శాఖల కేటాయింపుపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ కేబినెట్ మంత్రుల మార్పులు ప్రభుత్వ పనితీరుపై ఎలాంటి ప్రభావం చూపుతాయో వేచి చూడాలి మరి.