Saturday, October 5, 2024

రాష్ట్రం లో స‌రికొత్త‌గా స్పోర్ట్స్ పాల‌సీ

యువ‌త‌ను ప్ర‌పంచ‌స్థాయి క్రీడాకారులుగా తీర్చ‌దిద్ద‌డ‌మే ల‌క్ష్యం
గచ్చిబౌలి స్టేడియం ప్రాంగణంలో స్పోర్ట్స్‌ యూనివర్సిటీ
యూనివర్సిటీలో దాదాపు 13 కోర్సులు
కొత్త స్పోర్ట్ పాలసీ ముసాయిదాపై సీఎం రేవంత్ స‌మీక్ష‌

అద్భుతమైన క్రీడాకారులుగా తీర్చిదిద్దడంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణకు గుర్తింపు తెచ్చేలా కొత్త స్పోర్ట్స్ పాలసీని రూపొందించాల‌ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. 2036 ఒలింపిక్స్ ను దృష్టిలో పెట్టుకొని కొత్త పాలసీలో లక్ష్యాలను నిర్దేశించుకోవాలని చెప్పారు. అధికారులు తయారు చేసిన కొత్త స్పోర్ట్ పాలసీ ముసాయిదాపై ముఖ్యమంత్రి శుక్రవారం సచివాలయంలో అధికారులతో సమావేశమయ్యారు. ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు కె.కేశవరావు, జితేందర్ రెడ్డి, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ శివసేనారెడ్డి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, క్రీడలు, యువజన అభ్యున్నతి శాఖ ముఖ్య కార్యదర్శి వాణి ప్రసాద్, సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి, సీఎం కార్యదర్శి షానవాజ్ ఖాసీం ఈ సమావేశంలో పాల్గొన్నారు.

క్రీడాకారులను ప్రోత్సహించేందుకు వివిధ దేశాలు, ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలపై చర్చించారు. వివిధ ఆటల్లో ప్రతిభ ఉన్న యువతను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పోటీపడే క్రీడాకారులుగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణ‌యించింద‌ని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ లక్ష్యాన్ని నెరవేర్చేందుకు అనుసరించాల్సిన అత్యుత్తమ విధానాలను క్రీడా పాలసీలో పొందుపరచాలని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా నెలకొల్పనున్న స్పోర్ట్స్ యూనివర్సిటీని యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి సూచించారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ తరహాలోనే స్పోర్ట్స్ యూనివర్సిటీని పీపీపీ మోడల్‌లో నిర్వహించాలన్నారు. ప్రత్యేకంగా బోర్డు ఏర్పాటు చేసి చైర్మన్ ను నియమించాలని, యూనివర్సిటీకి స్వయం ప్రతిపత్తి ఉండేలా బాధ్యతలు అప్పగించాలని సూచించారు.

స్పోర్ట్స్ యూనివర్సిటీలో దాదాపు 13 కోర్సులు నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. క్రికెట్, హాకీ, ఫుట్బాల్, బాస్కెట్ బాల్, స్విమ్మింగ్, టెన్నిస్, బ్యాడ్మింటన్, షూటింగ్, బాక్సింగ్, రెజ్లింగ్, టేబుల్ టెన్నిస్, అథ్లెటిక్స్, జిమ్నాస్టిక్స్, అక్వాటిక్స్ లాంటి 14 క్రీడలను స్పోర్ట్స్ హబ్ లో పొందుపరిచారు. గచ్చిబౌలి స్పోర్ట్స్ స్టేడియం ప్రాంగణంలో స్పోర్ట్స్ యూనివర్సిటీని ప్రారంభించాలని చెప్పారు. దాదాపు 7‌‌0 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ప్రాంగణంలో ఇప్పటికే వివిధ క్రీడలకు రెడీమేడ్ సదుపాయాలున్నాయని, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా వాటిని అధునాతనంగా అప్ గ్రేడ్ చేసుకోవాలని సూచించారు. హైదరాబాద్ లో ఇప్పటికే అందుబాటులో ఉన్న ప్రముఖ క్రీడా మైదానాలు, స్టేడియాలు అన్నింటినీ స్పోర్ట్ హబ్ పరిధిలోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఎల్బీ స్టేడియం, హకీంపేట స్పోర్ట్స్ స్కూల్, కోట్ల విజయ భాస్కరరెడ్డి ఇండోర్ స్డేడియం, సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం, యూనివర్సిటీ సైక్లింగ్ వెలోడ్రమ్ లాంటివన్నింటినీ గుర్తించి.. ఒకే గొడుగు కిందకి తీసుకురావాలని చెప్పారు.

రాష్ట్రవ్యాప్తంగా వివిధ క్రీడల్లో ప్రతిభావంతులను గుర్తించటం నుంచి వారికి చదువులకు ఆటంకం లేకుండా.. అటు జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయి పోటీలకు అవసరమైన ప్రావీణ్యం నేర్పించే క్రమంలో ఎదురయ్యే ఆటుపోట్లన్నీ పరిష్కరించేలా కొత్త పాలసీ ఉండాలని ముఖ్యమంత్రి అధికారులకు దిశా నిర్దేశం చేశారు. మన ప్రాంతంలో ఉన్న భౌగోళిక పరిస్థితులతో పాటు.. మన ప్రాంత యువతకు ఆసక్తి ఉన్న క్రీడలకే ప్రాధాన్యమివ్వాలని అప్రమత్తం చేశారు. దేశ విదేశాల్లో ఉన్న కోచ్ లను రప్పించాలని, అక్కడున్న యూనివర్సిటీల సహకారం తీసుకునేలా ఎంవోయూలు చేసుకోవాలని చెప్పారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన క్రీడాకారులకు ఇచ్చే ప్రోత్సాహకాలకు స్పష్టమైన విధానాన్ని అనుసరించాలని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ఏ స్థాయి పోటీల్లో విజయం సాధించిన వారికి ఎంత ప్రోత్సాహకం అందించాలి, ఎవరికి ఉద్యోగం ఇవ్వాలి.. అనే మార్గదర్శకాలను ఖరారు చేయాలని అధికారులను ఆదేశించారు. ముసాయిదాకు సంబంధించి పవర్ పాయింట్ ప్రజంటేషన్లను పరిశీలించిన ముఖ్యమంత్రి పలు మార్పులు చేర్పులను సూచించారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular