డీఎస్పీతో పాటు పోలీసులందరిపై వేటు
సూర్యాపేట జిల్లాలో కాంగ్రెస్ మాజీ సర్పంచ్ హత్య కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. సూర్యాపేట డీఎస్పీ రవి, సీఐ శ్రీనివాస్ నాయక్ పై పోలీస్ శాఖ బదిలీ వేటు వేసింది. ఎస్ఐకి మెమో జారీ చేసింది. మాజీ సర్పంచ్ చక్రయ్య గౌడ్ పై దాడి జరిగే అవకాశం ఉందని ముందుగానే కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయినా దాడులు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టకుండా నిర్లక్ష్యం వహించారన్న విమర్శలు ఉన్నాయి. దీంతో సీఐని ఎస్పీ ఆఫీస్ కు అటాచ్ చేయగా.. డీఎస్పీని డీజీపీ ఆఫీస్ కు అటాచ్ చేశారు. ఈ మేరకు మల్టీజోన్–2 ఐజీ సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు.
సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం మిర్యాల గ్రామంలో ఈ నెల 17న కాంగ్రెస్ నేత చక్రయ్య గౌడ్ కలకలం రేపింది. గ్రామంలో రాజకీయ ఆధిపత్యం, వర్గ విభేదాలే చక్రయ్య గౌడ్ హత్యకు కారణంగా పోలీసులు గుర్తించారు. నిందితలను ఇటీవల పట్టుకున్న పోలీసులు మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. సొంత కూతురు, అల్లుడే ప్రధాన నిందితులుగా గుర్తించారు. మొత్తం 13 మందిని ఈ కేసులో అరెస్ట్ చేశారు.
నిందితులకు పోలీసుల సహకారం..?
అయితే.. ఈ హత్య విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే మందుల సామేలు సీరియస్ గా తీసుకున్నారు. అసెంబ్లీలోనూ ఈ విషయాన్ని ప్రస్తావించారు. కానీ పోలీసులు మాత్రం నిందితులకు సహాకరించారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రధాన నిందితులు కోర్టులో లొంగిపోవడానికి పోలీసులు సహకరించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇందుకోసం లక్షల రూపాయలు చేతులు మారాయని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించి.. ఆందోళనలకు సైతం దిగారు. ఈ నేపథ్యంలోనే పలువురు పోలీసు అధికారులపై వేటు పడిందని తెలుస్తోంది.