- కేంద్ర పద్దులో తెలంగాణకు సున్నా
- ఎనిమిది మంది ఎంపీలు..
- ఇద్దరు కేంద్రమంత్రులు..
- అయినా.. రాష్ట్రంపై కరుణ చూపని కేంద్రం
కేంద్ర బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి మళ్లీ నిరాశే మిగిలింది. గంపెడాశలతో ఎదురుచూసిన రాష్ట్రానికి మరోసారి మొండిచేయి చూపించింది. ఇప్పటికే పీఎం సహా కేంద్రమంత్రులను కలిసి విజ్ఞాపన పత్రాలు ఇచ్చిన.. 1.65 లక్షల కోట్లతో ప్రతిపాదనలు పంపి.. ఆశగా చూసిన రేవంత్ రెడ్డి సర్కార్కు నిర్మలమ్మ పద్దులో స్థానం లేకుండా పోయింది. గ్రాంట్లు, విభజన హామీలు, విన్నపాలన్నింటినీ ఈ బడ్జెట్లో కేంద్రం మరోసారి పక్కనపెట్టింది. కేంద్ర బడ్జెట్లో ప్రత్యేక పద్దు కూడా ఏం లేకపోవడంతో.. ఇక రెగ్యులర్గా వచ్చే గ్రాంట్లు, రిటర్న్ పన్నులే దిక్కయ్యాయి. అధికారంలో ఉన్న బీజేపీకి రాష్ట్రం నుంచి 8 మంది ఎంపీలు.. అందులో ముఖ్యంగా ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నా ఒక్క రూపాయి కూడా తేలేకపోయారనే విమర్శలు పెరిగిపోయాయి.
చూడలే.. పట్టించుకోలే
ఈసారి కేంద్ర బడ్జెట్పై రాష్ట్రం భారీ ఆశలు పెట్టుకున్నది. బడ్జెట్కు రెండు నెలల ముందు నుంచీ వినతి పత్రాలు పట్టుకుని సీఎం రేవంత్, రాష్ట్ర మంత్రులు ఢిల్లీ చుట్టూ ప్రదిక్షణలు చేశారు. రేవంత్ సర్కారు చేపట్టిన కొన్ని కీలక ప్రాజెక్టులకు నిధుల కోసం కేంద్రం చుట్టూ తిరిగారు. ప్రధాన ప్రాజెక్టులు అంటూ కొన్నింటిని చూపించి, వాటికి నిధుల కోసం రూ. 1.65 లక్షల కోట్లతో ప్రతిపాదనలు పంపించారు. కానీ, తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదనలకు కేంద్ర బడ్జెట్లో నిధులు దక్కలేదు. పలు ప్రాజెక్టులు, పథకాలకు నిధులివ్వాలని సీఎం రేవంత్రెడ్డి స్వయంగా దిల్లీ వెళ్లి ప్రధాని మోదీకి వినతిపత్రం ఇచ్చినప్పటికీ బడ్జెట్లో కేంద్రం తెలంగాణకు మొండిచేయి చూపింది. కేటాయింపులపై రాష్ట్ర ఆర్థికశాఖ కేంద్రానికి విడిగా వివరాలను పంపింది. అయినా ప్రధాన ప్రాజెక్టులకు నిధులేవీ ఇవ్వలేదు.
దీనికితోడు గత మూడేళ్లుగా కేంద్రం నుంచి గ్రాంట్ల పద్దు కింద పూర్తిస్థాయిలో నిధులు రావడం లేదు. దీనికితోడు నిధుల కేటాయింపులో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఇటీవల ప్రధాని మోదీకి సీఎం రేవంత్రెడ్డి సుదీర్ఘంగా వివరించారు. కేంద్ర పథకాల ద్వారా అన్ని రాష్ట్రాలకు జనాభా నిష్పత్తిలో నిధులు కేటాయించాలని కోరారు. దాదాపు పదేళ్లుగా విభజన హామీల అమలు కోసం ఎదురుచూస్తున్న తెలంగాణకు ఈసారి కేంద్ర బడ్జెట్లోనూ నిరాశే మిగిలింది. అటు భారీగా యువతకు అవకాశాలు ఉండే కాజీపేట రైల్వేకోచ్ల కర్మాగారం, బయ్యారం ఉక్కు కర్మాగారం వంటి పెద్ద ప్రాజెక్టులను విభజన చట్టంలోని 13వ షెడ్యూలులోని పదో అంశంగా చేర్చారు. వాటికి కేంద్రం కరుణిస్తుందని ఆది నుంచి యువత ఎదురుచూస్తోంది. కానీ, ఈసారీ మంజూరు కాలేదు. కోచ్ల కర్మాగారానికి అవసరమైన భూమి అందుబాటులో ఉంది. కాజీపేటలో రైల్వే జంక్షన్ ఉంది. ఇలా ఎన్నో సానుకూలతలున్నా కేంద్ర ప్రభుత్వం నుంచి స్పందన లేదు.
అన్నీ పక్కకే
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్ తెలంగాణ దమ్మిడీ విదిల్చలేదు. రాష్ట్రానికి రూ. 1.65 లక్షల కోట్ల పనులకు ప్రతిపాదనలు పంపితే ఒక్క రూపాయి కూడా విదిల్చకపోవడం గమనార్హం. మూడు ఏఐ సిటీలను ఏర్పాటు చేస్తున్నట్టు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అందులో హైదరాబాద్ పేరు లేదు. అటు బయ్యారం స్టీల్ ప్లాంట్, హైదరాబాద్– -నాగ్ పూర్ కారిడార్, మెగా లెదర్ పార్కు అంశాలు కూడా లేవు. మెట్రో రెండో దశ విస్తరణకు నిధులు కేటాయించాలని ము ఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాన మంత్రికి పలుమార్లు విజ్ఞప్తి చేశారు. ఈ అంశాన్ని కూడా కేంద్రం ఆటకెక్కించింది. ముచ్చర్లలో ఏర్పాటు చేయబోయే ఫ్యూచర్ సిటీకి నిధులు ఇవ్వలేదు. దీంతో పాటు ఎన్నో ఏండ్లుగా పెండింగ్ లో ఉంటున్న పాలమూరు– -రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించడంతోపాటు నిధులు ఇవ్వాలని కోరినా కేంద్రం పట్టించుకోలేదు. ఐటీఐఆర్ను కూడా నిర్లక్ష్యం చేశారు. నదుల అనుసంధానాన్ని కీలకమైన అంశంగా భావిస్తున్న కేంద్ర ప్రభుత్వం మూసీ– -గోదావరి లింకేజీకి నిధుల అంశాన్ని బడ్జెట్ లో ప్రస్తావించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఉక్కు లేదు.. జాతీయ హోదా అసలు లేదు
ఇటు, విశాఖ ఉక్కు కర్మాగారంతో పోల్చితే తక్కువ దూరంలో బొగ్గు గనులు ఉండి, అనుకూలంగా ఉండే బయ్యారంలో ఉక్కు కర్మాగారాన్ని కేంద్రం మంజూరు చేయడం లేదు. ఏజెన్సీ పరిసర ప్రాంతంలో కర్మాగారం ఏర్పాటు చేయడం ద్వారా ఆరు జిల్లాలకు లబ్దిచేకూరేది. తెలంగాణలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు కోసం చివరికి లోక్సభ ఎన్నికలకు ముందు గత డిసెంబరులో దానికి సంబంధించిన బిల్లును ఆమోదించింది. విశ్వవిద్యాలయం స్థాపించడానికి రూ.900 కోట్లు మంజూరు కావాల్సి ఉండగా, నిధుల కేటాయింపులు జరగలేదు. విభజన చట్టంలో తెలంగాణకు ఒక సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామని హామీ ఇచ్చారు. అయితే, గత బీఆర్ఎస్ ప్రభుత్వం పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని కోరింది. తాజాగా సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలు ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని కేంద్ర పెద్దలను కలిశారు. విభజన చట్టం ప్రకారం హైదరాబాద్- వరంగల్, హైదరాబాద్–-నాగ్పుర్ పారిశ్రామిక కారిడార్లను మంజూరు చేసి నిధులివ్వాలంటూ గత పది సంవత్సరాలుగా రాష్ట్రం కోరుతోంది. ఈసారీ కూడా వాటిని పట్టించుకోలేదు.
ఈ నిధులేవి..?
వెనుకబడిన ప్రాంత అభివృద్ధి కోసం కేంద్రం నుంచి నిధులు రావాలి. పదేళ్లుగా అవి విడుదల కాలేదు. 2019–-20 నుండి 2023–-24 సంవత్సరాల మధ్య రావాల్సిన గ్రాంట్లు రూ.1,800 కోట్లు ఇంకా పెండింగులోనే ఉన్నాయి. తెలంగాణలో ఏర్పాటు చేసే పరిశ్రమలకు ప్రత్యేక రాయితీలు ఇస్తామని విభజన చట్టంలో చెప్పారు. కొత్త పరిశ్రమలకు ఐదేళ్ల తర్వాత యంత్రాల కొనుగోలుపై పన్ను మినహాయింపులు వర్తిస్తాయని విభజనలో పేర్కొన్నారు. దీని రాష్ట్రానికి పది వేల కోట్లకు పైగా నిధులు రావాలి. కానీ ఇప్పటి వరకు ఎలాంటి నిధులు విడుదల కాలేదు. తెలంగాణ ఉద్యానవన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసింది. దీనికి కేంద్రం నిధులివ్వలేదు. విభజన చట్టం ప్రకారం జిల్లాకు ఒకటి చొప్పున నవోదయ పాఠశాల ఏర్పాటు చేయాలి, కానీ ఏర్పాటు కాలేదు. ఐఐఎం, ఐఐటీహెచ్ వంటి ఉన్నత విద్యాసంస్థలను మంజూరు చేయాలని రాష్ట్రం కోరినా కేంద్రం ఆసక్తి చూపలేదు.
సీసీఐ ఊసే లేదు..
మూతపడిన ఆదిలాబాద్ సిమెంటు పరిశ్రమను పునః ప్రారంభించడానికి అన్ని అవకాశాలున్నాయని ఇటీవల రాష్ట్రం నుంచి విజ్ఞప్తి చేశారు. కానీ, కేంద్ర ప్రభుత్వం మాత్రం కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతుంది. ప్రస్తుతం సిమెంటు రంగానికి మంచి డిమాండ్ ఉండగా పరిశ్రమ ప్రారంభానికి అన్ని సౌకర్యాలు ఉన్నాయి. జాతీయ రహదారి 44కు సమీపంలో పరిశ్రమ భూములు, సిమెంటును తరలించడానికి ఆదిలాబాద్ నుంచి రైలు, మహారాష్ట్రతోపాటు ఇతర ఉత్తరాది రాష్ర్టాలకు రోడ్డు మార్గం ఉంది. 772 ఎకరాల భూములు, 170 ఎకరాల్లో టౌన్షిప్, 48 మిలియన్ టన్నుల లైమ్స్టోన్ నిల్వలు అందుబాటులో ఉన్నాయి. పరిశ్రమకు అవసరమైన విద్యుత్తోపాటు నీటి వనరులు ఉన్నాయి. సిమెంటు తయారీకి అపారమైన వనరులు ఉన్నా కేంద్ర ప్రభుత్వం మొండివైఖరి వీడనాడడం లేదు. ఈ బడ్జెట్లో ఎలాంటి కేటాయింపులు లేవు.