తమిళనాడు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి తమిళనాడు వెళ్లే వారికి కొత్త చిక్కులు మొదలయ్యాయి. ఇతర రాష్ట్రాలకు సంబందించిన కొన్ని బస్సులను తమ రాష్ట్రంలోకి అనుమతించడం లేదు తమిళనాడు. ఆంధ్రప్రదేశ్ తో పాటుగా తెలంగాణ నుంచి తమిళనాడు వైపు వెళ్లే బస్సులకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొన్ని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్ని తమిళనాడులోకి అనుమతించకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమిళనాడు ప్రభుత్వం ఈశాన్య రాష్ట్రాల పర్మిట్లపై నడిచే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై ప్రత్యేక దృష్టి సారించింది. అందుకే ఆ బస్సుల్ని తమిళనాడులోకి అనుమతించడం లేదు.
తమిళనాడు తీసుకున్న నిర్ణయంతో ఆ బస్సుల్లో వచ్చిన ప్రయాణికుల్ని ట్రావెల్స్ యాజమాన్యాలు చెన్నై సమీపంలోని ఏపీ బార్డర్ తడ నుంచి చెన్నైకి పికప్ వ్యాన్లలో తీసుకెళుతున్నారు. తమిళనాడు రాజధాని చెన్నై నుంచి తడ మీదుగా హైదరాబాదు, విశాఖపట్నం, విజయవాడ ప్రాంతాలకు ప్రతి రోజు సుమారు 75కు పైగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ బస్సులకు ఆలిండియా పర్మిట్ ద్వారా కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సుల పేరుతో ఏ రూట్ లో అయినా ప్రయాణించే అవకాశం ఉంటుంది.
ఐతే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు పరిధలోని ట్రావెల్స్ బస్సులు ఆయా రాష్ట్రాల పర్మిట్లు తీసుకోవడం లేదు. ఈశాన్య రాష్ట్రాలైన నాగాల్యాండ్, హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల పర్మిట్లతో ఈ బస్సుల్ని నడుపుతున్నారు. ఈశాన్య రాష్ట్రాలలో బస్సుల పర్మిట్ పన్నులు చాలా తక్కువగా ఉండటంతో ప్రైవేట్ ట్రావెల్స్ యజమాన్యాలు తెలివిగా అక్కడ పర్మిట్ తీసుకుంటున్నాయి. ఇప్పుడు దీనిపైనే తమిళనాడు ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.
ఆంధ్రప్రదేశ్ లో ప్రైవేట్ ట్రావెల్ బస్సుకు మూడు నెలలకు ఒక్క సీట్కు సుమారుగా 3,500 వరకు పర్మిట్ కోసం చెల్లించాల్సి ఉంటుంది. అదే తమిళనాడులో అయితే సుమారుగా 3,200 చెల్లించాల్సి వస్తోంది. కానీ ఈశాన్య రాష్ట్రాల్లో ఒక సీట్ కు పర్మిట్ కోసం కేవలం 400 చెల్లిస్తే సరిపోతుంది. అందుతే ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు తెలివిగా ఈశాన్య రాష్ట్రాల పర్మిట్ తీసుకుంటున్నారు. ఇదే ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వ ఆగ్రహానికి కారణమైంది.