అన్ని భాషలకు సమాన ప్రోత్సాహం
రాజకీయ దురుద్దేశంతో ప్రజలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
ప్రధాని మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అన్ని భాషలకు సమాన ప్రోత్సాహం కల్పిస్తోందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. రాజకీయ దురుద్దేశ్యంతో ప్రజలను రెచ్చగొట్టే చర్యలకు పాల్పడితే మీ పప్పులు ఉడకబోవని విమర్శించారు. బేగంపేట రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులను పరిశీలించిన అనంతరం కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఎబీసీడీ తెలియకుండా కేంద్రంపై యుద్ధం చేయాలంటే ఎలా? దక్షిణ భారతదేశంలో గతంలో లాగా ప్రజలను రెచ్చగొడితే ప్రజలు ఊరుకోబోరని ప్రజలు చైతన్యం అయ్యారని అన్నారు. డీలిమిటేషన్ ప్రకారం సీట్లు తగ్గుతాయని ఎలా? భావిస్తారని ప్రశ్నించారు. తమిళనాడు ఎన్నికల్లో భాగంగానే ప్రజలను రెచ్చగొట్టే చర్యలకు డీఎంకే స్టాలిన్ పాల్పడుతున్నారని మండిపడ్డారు. తమిళ భాషలో తీసిన సినిమాలు హిందీలో ఉత్తర భారతదేశంలో ప్రదర్శిస్తూ వందల వేల కోట్లు సంపాదిస్తున్నారని అన్నారు.
అత్యధికంగా తెలుగు, తమిళ సినిమాలను ఉత్తరాదిలోనూ ఆదరిస్తున్నారని తెలిపారు. జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ లాంటి అనేక మంది ప్రజలు తెలంగాణ అభివృద్ధిలో పాలు పంచుకుంటున్నారన్నారు. స్టాలిన్ ఐదేళ్లుగా సీఎంగా ఏం చేశారో? చెప్పాలని నిలదీశారు. ఏం చేయలేదు కాబట్టే భాష పేరుతో, డీలిమిటేషన్ పేరుతో తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నారని ఆరోపించారు. గతంలో విధానం ఉన్నట్టే డీలిమిటేషన్ విధానం ఉంటుందన్నారు. ఇంతవరకు జనాభా గణనే పూర్తి కాలేదని, నియమ నిబంధనలు రూపొందించలేదని అన్నారు. తమిళనాడులో త్రిభాషా పాలసీ కొత్తది కాదన్నారు.
గత అనేక సంవత్సరాలుగా కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా ఇదే విధానం కొనసాగుతుందని, ఇప్పుడు కూడా ఇదే కొనసాగుతుందన్నారు. దక్షిణ భారతదేశంలో తెలంగాణ, తమిళనాడులో ఏ ఒక్క వ్యక్తిపైన బలవంతంగా హిందీ నేర్చుకోవాలని బలవంత పెట్టలేదన్నారు. చైనా, జపాన్ దేశాలు కూడా వారి వారి భాషల్లోనే మాట్లాడుతున్నాయన్నారు. సీఎం స్టాలిన్ భాషపై పూర్తి అవాస్తవాలను మాట్లాడుతున్నారని అన్నారు. ఐదు సంవత్సరాలుగా తమిళ భాష కోసం ఏం చేశారో? చెప్పాలని నిలదీశారు. ప్రధాని మోదీ నూతన ఎడ్యుకేషన్ పాలసీ వచ్చాక మాతృభాషలోనే హయ్యర్ విద్యకు అవకాశం కల్పించామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.