అవినీతికి పాల్పడే అధికారులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏసీబీ (అవినీతి నిరోధక శాఖ) నుంచి తప్పించుకోలేరని తెలంగాణ ఏసీబీ డీజీ సీవీ ఆనంద్ హెచ్చరించారు. సోమవారం రాత్రి రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కు చెందిన జాయింట్ కలెక్టర్ ఎంవీభూపాల్ రెడ్డి, సీనియర్ అసిస్టెంట్ మదన్ మోహన్ రెడ్డి రూ.8 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కిన విషయాన్ని షేర్ చేస్తూ ఎక్స్ ఖాతాలో సీవీ ఆనంద్ ట్వీట్ చేశారు.
14 గుంటల భూమిని ధరణి పోర్టల్లో నిషేధిత భూముల జాబితా నుండి తొలగించుటకుగాను సీనియర్ అసిస్టెంట్ లంచం తీసుకుంటుండగా పట్టుబడ్డారు. తదుపరి ఆ మొత్తాన్ని జాయింట్ కలెక్టర్కు అందచేశారు. ఫిర్యాదుదారుని నుండి నగర శివార్లలో డబ్బు తీసుకోవటం.. ఆపై ఓఆర్ఆర్ దగ్గర జాయింట్ కలెక్టర్కు అందేలా జాగ్రత్త తీసుకున్నప్పటికీ, ఏసీబీ టీమ్ రాత్రంతా ఎంతో చాకచక్యంగా అప్పటికప్పుడు ప్రణాళికలు మార్పు చేసుకుంటూ ఇద్దరిని ట్రాప్ చేశారని సీవీ ఆనంద్ ట్వీట్లో పేర్కొన్నారు.