పరువు నష్టం కేసులో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. జార్ఖండ్లోని చైబాసాలోని ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు రాహుల్ గాంధీపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. జూన్ 26న కోర్టు ఎదుట వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని సైతం కోర్టు ఆదేశించింది. వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు కోరుతూ రాహుల్ గాంధీ తరఫు లాయర్ చేసిన విజ్ఞప్తిని ఎంపీ ఎమ్మెల్యే కోర్టు తిరస్కరించింది. బీజేపీ నేత ప్రతాప్ కటియార్ ఈ పరువునష్టం దావా వేశారు. 2018లో జరిగిన కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశంలో అప్పటి బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలతో పరువునష్టం దావే వేశారు ప్రతాప్ కటియార్. హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు సైతం బీజేపీ అధ్యక్షుడు కావొచ్చని తన ప్రసంగంలో రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలై ఝార్ఖండ్ బీజేపీ నేతలతో పాటు దేశ వ్యాప్తంగా బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు పరువు నష్టం కలిగించేలా ఉన్నాయని.. బీజేపీ నేతలు, కార్యకర్తలు అందర్నీ అవమానించారని ఆరోపిస్తూ, ప్రతాప్ కటియార్ జూలై 9, 2018న చైబాసాలోని చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో రాహుల్ గాంధీపై పరువునష్టం దావా కేసు దాఖలు చేశారు. ఈ కేసు విచారణలో భాగంగా రాహుల్ గాంధీపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన కోర్టు వచ్చే నెలలో కాంగ్రెస్ ఎంపీ వ్యక్తిగతం విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. జార్ఖండ్ హైకోర్టు ఆదేశాలతో, రాహుల్ గాంధీపై పరువు నష్టం కేసును ఫిబ్రవరి 2020లో రాంచీలోని ఎంపీ-ఎమ్మెల్యే కోర్టుకు బదిలీ చేశారు. తర్వాత, కేసును చైబాసాలోని ఎంపీ-ఎమ్మెల్యే కోర్టుకు వెళ్లింది. అక్కడ మేజిస్ట్రేట్ ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్కు సమన్లు జారీ చేశారు. కోర్టు పదే పదే సమన్లు జారీ చేసినప్పటికీ, రాహుల్ గాంధీ విచారణకు హాజరుకాని కారణంగా బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఆ తర్వాత, వారెంట్పై స్టే కోరుతూ రాహుల్ గాంధీ జార్ఖండ్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ను మార్చి 20, 2024న విచారణకు రాగా కోర్టు కొట్టివేసింది. తరువాత, వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు కోసం రాహుల్ గాంధీ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ను చైబాసా కోర్టు కూడా తోసిపుచ్చింది. తాజాగా ప్రత్యేక కోర్టు నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.