ఏదేని కారణంతో రిజిస్ట్రేషన్ను క్యాన్సిల్ చేసుకుంటే లావాదేవీ కోసం చెల్లించిన ఫీజు వెనక్కి రావడం లేదు. ఎవరిని అడగాలో తెలియక భూ యజమానులు నానా అవస్థలు పడుతున్నారు. ధరణి పోర్టల్ ఉన్నప్పుడు ఈ ఇబ్బందులు ఉండగా, ఇప్పుడు భూ భారతి వచ్చాక కూడా అదే పరిస్థితి కొనసాగుతోంది. సాగు భూముల రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు, గిఫ్ట్ డీడ్, వారసత్వ బదిలీ (ఓనర్షిప్ ట్రాన్స్ఫర్), జీపీఏ తదితర లావాదేవీలు గత నెల వరకు ధరణి పోర్టల్ వేదికగా జరిగేవి. స్లాట్ నమోదు చేసుకున్నాక భూమి కొనవద్దనుకునో, ఆ భూమిపై ఏదైనా వివాదం ఉందని చెప్పో, అప్పుడు కాక మరో సమయంలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలనో నిర్ణయించుకున్న కొనుగోలుదారు స్లాట్ను క్యాన్సిల్ చేసుకునేవారు.
కాళ్లరిగేలా తిరుగుతున్న యజమానులు
లావాదేవీ కోసం చెల్లించిన ఫీజు వెనక్కు రాలేదు. ఇందుకు ఖర్చు చేసిన మొత్తం రూ.కోట్లలో ఉంది. వేల మంది రైతన్నలు తిరుగు చెల్లింపుల కోసం ఎదురుచూస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఆర్వోఆర్-2020 రద్దయింది. దాంతోపాటు గత ప్రభుత్వం తీసుకువచ్చినటువంటి ధరణి పోర్టల్ కూడా రద్దయింది. ఆ స్థానంలో ఆర్వోఆర్-2025 (భూ భారతి చట్టం) అమల్లోకి వచ్చింది. ధరణి పోర్టల్ స్థానంలో భూ- భారతి పోర్టల్ను తెచ్చారు. అయినప్పటికీ క్యాన్సిల్ చేసుకున్న లావాదేవీలకు సంబంధించి సొమ్ము మాత్రం పాత పద్ధతిలోనే నిలిచిపోతోంది. తిరుగు చెల్లింపులు(రీఫండ్) రావడం లేదు. భూ యజమానులు మండల తహసీల్దార్లు, కలెక్టర్ల చుట్టూ తిరుగుతున్నారు.
2020 నవంబరుకు ముందు స్టాంపులు- రిజిస్ట్రేషన్ల శాఖ (కార్డ్ సాఫ్ట్వేర్) ద్వారానే వ్యవసాయ భూములకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు ఎక్కువగా జరిగేవి. ఆ సమయంలో లావాదేవీలనేవి రద్దు చేసుకుంటే చెల్లించిన సొమ్మును ఖజానా విభాగం ద్వారా తిరిగి చెల్లించేవారు. ఆ తర్వాత వాటిని ధరణి పోర్టల్కు తాజాగా భూ- భారతి వెబ్సైట్కు బదలాయించినప్పటి నుంచే క్యాన్సిల్ అయిన లావాదేవీలకు సంబంధించిన సొమ్ము చెల్లించకపోవడమనే సమస్య కొనసాగుతూ వస్తోంది. కొన్ని జిల్లాల్లో మాత్రం కొంత మొత్తాన్ని జిల్లా కలెక్టర్లు ప్రత్యేక అకౌంట్ల ద్వారా తిరిగి చెల్లించారు. హైదరాబాద్, రంగారెడ్డితోపాటు పలు జిల్లాల్లో కొద్ది కాలం పాటు ఇది జరిగింది. భూ భారతి చట్టం అమల్లోకి వచ్చాక తిరుగు చెల్లింపులు చేసేందుకు మొదట్లో ప్రయత్నాలు జరిగినప్పటికీ దీనిపై దృష్టి సారించే ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యం జరిగిందన్న వాదనలున్నాయి. ఇప్పటికైనా తిరుగు చెల్లింపులను (రీఫండ్) చేయాలని బాధితులు కోరుతున్నారు.