కాళేశ్వరం విచారణ కమిషన్ ముందు బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ హాజరు కావాల్సిన తేదీ మారింది. గతంలో ఆయన ఈ నెల 5న విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. తాజాగా కేసీఆర్ విజ్ఞప్తి మేరకు విచారణ తేదీని ఈనెల 11కు మార్చారు. ఈ మేరకు కాళేశ్వరం అక్రమాలపై విచారణ జరుపుతున్న పీసీ ఘోష్ కమిషన్ ప్రకటన విడుదల చేసింది. జూన్ 5న విచారణకు కేసీఆర్ రావాలని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నోటీసుల్లో పేర్కొంది. అలాగే జూన్ 6న ఎమ్మెల్యే హరీశ్రావు, జూన్ 9న ఎంపీ ఈటల రాజేందర్కు విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. ఈ ముగ్గురు కమిషన్ కార్యాలయంలో విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. ప్రాజెక్టు, ఆనకట్టల నిర్మాణంపై అప్పటి ప్రభుత్వ పెద్దలను సైతం కమిషన్ విచారించనుంది.
సీఎంగా, కొంతకాలం ఇరిగేషన్ మంత్రిగా ఉన్న కేసీఆర్, కొంతకాలం ఇరిగేషన్, ఆర్థిక మంత్రిగా ఉన్న హరీశ్రావు, కొంతకాలం ఆర్థిక మంత్రిగా ఈటల రాజేందర్ పని చేశారు. ఎంపీ ఈటల రాజేందర్ అనంతరం పరిణామాల దృష్ట్యా బీజేపీలో చేరిన కూడా కమిషన్ విచారణకు పిలిచింది. సహజ న్యాయసూత్రం ప్రకారం ముగ్గురి వాదనలను వినాలని కమిషన్ నిర్ణయించింది. ముగ్గురి వాగ్మూలాలను పీసీ ఘోష్ కమిషన్ రికార్డ్ చేసుకోనుంది.
2024 మార్చి నుంచి 3 బ్యారేజీలపై విచారణ
మేడిగడ్డ బ్యారేజీ కుంగిన నేపథ్యంలో అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డ బ్యారేజీలపై విచారణ జరిపేందుకు న్యాయ విచారణ కమిషన్ను రాష్ట్ర ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో 2024 మార్చిలో ఏర్పాటైన ఈ కమిషన్ నిర్మాణం, డిజైన్, నిర్వహణ, పే అండ్ ఎకౌంట్స్, క్వాలిటీ కంట్రోల్, ఆర్థిక శాఖల ఉన్నతాధికారులు, నీటిపారుదల, నిర్మాణ సంస్థల ప్రతినిధులు, ఇలా ఎందరినో విచారించింది. ఇప్పుడు తాజాగా కేసీఆర్, హరీశ్రావు, ఈటల రాజేందర్లకు నోటీసులు పంపింది. వారు విచారణకు వస్తారేమో ఆ తేదీ వరకు ఆగాల్సిందే.
అలాగే కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగమైన కొండ పోచమ్మసాగర్ రిజర్వాయర్ నిర్మాణంలో అక్రమాలు జరిగాయంటూ వచ్చిన ఫిర్యాదుపై విజిలెన్స్ అండ్ ఎన్పోర్స్మెంట్ విచారణ ప్రక్రియను ప్రారంభించింది. విచారణలో భాగంగా ఈనెల 26 నుంచి వచ్చే నెల నాలుగో తేదీ వరకు విచారణకు రావాలని ఏకంగా 63 మంది ఇంజినీర్లను పిలిచింది. ఈ విచారణ ఎనిమిది రోజుల పాటు జరగనుండగా, రిజర్వాయర్ నిర్మాణ సమయంలో పని చేసిన ఏఈఈలు మొదలుకొని ఇంజినీర్ ఇన్ చీఫ్ల వరకు హాజరు కావాల్సి ఉంది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ రామచంద్రాపురం యూనిట్ ఎస్పీ, నీటిపారుదల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్కు రెండు రోజుల క్రితం లేఖ రాశారు.