రాష్ట్ర ప్రభుత్వం పాలనా సంస్కరణలకు సిద్ధమైంది. ఒకరు ఇద్దరు కాదు. పదులు వందలు కూడా కాదు. వేలు.. ఏకంగా 6వేల 729 అధికారులు, కిందిస్థాయి ఉద్యోగులపై తెలంగాణ సర్కారు వేటు వేసింది. ఈ లిస్ట్లో మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, యాదగిరిగుట్ట ఆలయ వైస్ చైర్మన్ జి.కిషన్రావు, కన్సల్టెంట్ ఇంజినీరు బీఎల్ఎన్ రెడ్డి తదితర బడా ఆఫీసర్లు ఉన్నారు. వీరితో పాటు 10 మంది ట్రాన్స్కో, జెన్కో డైరెక్టర్లునూ రిమూవ్ చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. మార్చి నెలాఖరుకల్లా అందరినీ తొలగించాలని ఆదేశించారు. అయితే.. వేటు పడిన వారంతా కాంట్రాక్ట్ ఉద్యోగులే కావడం ఆసక్తికరం.
ఎందుకు వేటు వేశారంటే..
రేవంత్రెడ్డి సీఎం అయ్యాక ప్రభుత్వం పాలనా పరంగా తీసుకున్న అతిపెద్ద సంచలన నిర్ణయం ఇదేనని చెప్పాలి. రిటైర్మెంట్ అయ్యాక కూడా కాంట్రాక్టు పద్ధతిలో కొనసాగుతున్న వారందరికీ చెక్ పెట్టాలని సర్కారు డిసైడయ్యింది. అలా పదవీ విరమణ తర్వాత కాంట్రాక్టు పద్దతిలో ఉద్యోగం చేస్తున్న 6,729 మందిని ఐడెంటిఫై చేసింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఒక్కసారిగా ఆ వేలాది మంది కాంట్రాక్ట్ ఎంప్లాయిస్పై వేటు వేసింది ప్రభుత్వం. ఖాళీ అయిన ఆ స్థానాల్లో వెంటనే సర్వీస్లో ఉన్న ఉద్యోగులను నియమించాలని ఆదేశించింది రేవంత్ సర్కార్.
కీలక విభాగాల్లో.. కీలక పదవుల్లో..
మునిసిపల్ శాఖలో 177 మంది అధికారులు కాంట్రాక్ట్ పద్దతిలో కొనసాగుతున్నారు. వీరంతా ఇక ఇంటికే. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ హైదరాబాద్ వాటర్వర్క్స్, మెట్రోరైల్, రెరా, మెప్మా, కుడా, వైటీడీఏ.. ఇలా పలు శాఖల్లో పనిచేస్తున్న రిటైర్డ్ ఐఏఎస్లు, ఆర్డీవోలు, డీఎఫ్ఓలు, ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులు ఉన్నారు. ఆ లెక్క 6వేల 729 గా తేలింది. సర్వీస్లో ఉన్నవారిని తీసుకోకుండా.. ఇలా రిటైర్ అయిన వారిని భారీ వేతనాలు చెల్లించి కాంట్రాక్ట్ ఉద్యోగులుగా నియమించడం ఏంటని సీఎం రేవంత్ రెడ్డి మొదటినుంచీ తప్పుపడుతూనే ఉన్నారు. ఇన్నాళ్లకు ఆయా ఆఫీసర్లపై వేటు పడింది.
15 ఏళ్లు పదవిలో.. మెట్రో ఎండీ తొలగింపు..
మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డిని తొలగించడం మొత్తం జాబితాలోకే సంచలన నిర్ణయం. మెట్రో ప్రాజెక్టు మొదలైనప్పటి నుంచీ ఆయన ఎండీగా కొనసాగుతున్నారు. వైఎస్సార్ హయాంలోనే ఆయన నియమితులయ్యారు. ప్రభుత్వాలు మారినా.. దాదాపు 15 ఏళ్లుగా మెట్రో బాస్గా చెలామణి అయ్యారు. ఏ అధికారి కూడా ఇంత సుదీర్ఘ కాలం ఎండీగా ఉండటం సమంజసం కాదని.. అందులోనూ కాంట్రాక్ట్ బేస్డ్ మీద పని చేయడం మంచిది కాదని.. ప్రభుత్వం భావించినట్టుంది. ప్రస్తుతం మెట్రోను హైదరాబాద్ నలువైపులా విస్తరించే ప్రాజెక్ట్ చేపట్టింది సర్కారు. అందుకే, సర్వీస్లో ఉన్న అధికారినే మెట్రో ఎండీగా నియమించబోతోంది. ఇక ఎన్వీఎస్ రెడ్డికి మెట్రోతో ఉన్న అనుబంధం ముగిసిపోయినట్టే.
లక్షల్లో వేతనాలు.. ఖజానాకు తూట్లు?
అటు, యాదగిరిగుట్ట ఆలయ వైస్ చైర్మన్ జి.కిషన్రావును సైతం తొలగించారు. కేసీఆర్కు కిషన్రావు అత్యంత సన్నిహితుడనే పేరుంది. యాదగురిగుట్ట పునర్నిర్మాణం ఆయన ఆధ్వర్యంలోనే జరిగింది. ప్రభుత్వం మారాక కూడా ఏడాదికి పైగా కిషన్రావును కొనసాగించారు. కాంట్రాక్ట్ అధికారులు వద్దు అనే పాలసీలో భాగంగా ఆయనపైనా వేటు పడింది. ఇలా.. అనేక కీలక విభాగాల్లో.. లక్షల వేతనాలతో కాంట్రాక్ట్ పద్దతిలో నియామకాలు జరపడం ఖజానాకు పెను భారంగా మారింది. రెగ్యులర్ ఎంప్లాయిస్ ఉండగా.. ఈ అదనపు ఆఫీసర్లు ఎందుకంటూ పాలనలో ప్రక్షాళన మొదలుపెట్టారు సీఎం రేవంత్రెడ్డి. మొదటి వేటులోనే ఏకంగా 6,729 మందిని తీసేయడం మాత్రం బిగ్ బ్రేకింగే.