రియల్ బ్రోకర్లకు అధికారులు, పోలీసుల మద్దతు..
సీఎం రేవంత్ స్పందించి చర్యలు తీసుకోవాలి.
మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ డిమాండ్
ఏకశిలా నగర్ ఘటనపై వివరణ
పేదలు కష్టపడి కొనుక్కున్న స్థలాలను కొందరు రియల్ ఎస్టేట్ బ్రోకర్లు, గూండాలు దౌర్జన్యాలు చేస్తున్నారని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ మండిపడ్డారు. ఏకశిలా నగర్ ఘటనపై ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడారు. ఏకశిలా నగర్ లో 1985లో కొన్న 2076 మంది పేదల భూములు కబ్జా పెట్టి ఇబ్బంది పెడుతున్నారని, వీరు 2006 నుంచి కొట్లాడుతున్నారని తెలిపారు. గూండాలకు పోలీసులు, అధికారులు మద్దతిస్తున్నారని ఆరోపించారు. అన్యాయానికి అండగా ఉన్న పోలీసులు, రెవెన్యూ అధికారులు సిగ్గుపడాలని, సిఎం స్పందించి ఈ భూములపై సమగ్ర విచారణ జరిపించి పేదలకు న్యాయం చేయాలన్నారు.
పోచారం మున్సిపాలిటీ పరిధిలో కొర్రెముల గ్రామంలో 1985 లో 149 ఎకరాలు భూమిని లేఅవుట్ చేసి 2076 మందికి అమ్మారు. కొన్నవారిలో మెజారిటీ వారు చిన్న ప్రభుత్వ ఉద్యోగులు. వారంతా బ్యాంకు లోన్ పెట్టి కొన్నారు. ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి.. 2006లో దొంగ డాక్యుమెంట్ సృష్టించి గ్రామ పంచాయతీలో ఉన్న చిన్న ఉద్యోగులను పట్టుకొని వ్యవసాయ భూమిగా కన్వర్ట్ చేసుకున్నారు. ప్లాట్లు కొన్నవారు కోర్టుకెళితే.. కోర్టు వీడు దొంగ అని.. ప్లాట్లు కొన్నవారికి అనుకూలంగా తీర్పునిచ్చింది. 2011లో మరోసారి ఇలాంటి ప్రయత్నమే జరిగింది. మరోసారి కూడా ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారికి మొట్టికాయలు పడ్డాయి.
అయినా వదిలిపెట్టకుండా కొద్దిమంది అధికారుల అండదండలతో.. డిపిఓ ను మేనేజ్ చేసి వ్యవసాయ భూమిగా మార్చే యత్నం చేశారు. మళ్లీ కోర్టుకు వెళ్తే కోర్టు మళ్లీ కొట్టి వేసింది.. ధరణి వొచ్చిన తర్వాత కలెక్టర్ అమాయ్కుమార్ ని పట్టుకొని 9 ఎకరాల భూమిని రాయించుకున్నారు. దానితో పాటు పక్కన ఉన్న ప్లాట్లను కూడా దౌర్జన్యంగా కొన్నారు. 2076 ప్లాట్లలో 206 తీసుకున్నారు. ఏకశిలా నగర్ లో 700 ఇల్లు ఉన్నాయి. మిగిలిన వారు ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ కి వెళ్తే అనుమతి ఇవ్వడం లేదు. మున్సిపాలిటీ ఎల్ఆర్ఎస్ ఇవ్వడం లేదు. రియల్ ఎస్టేట్ బ్రోకర్ స్థానిక నాయకులను పట్టుకొని వంద మంది గుండాలను, 10 కుక్కలను పెట్టి మరి ఈ ఏకశిలా నగర్ వాసులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఆడవాళ్లను ఇష్టమొచ్చినట్లు తిడుతున్నారు, గుండాలు ఎంత బెదిరించినా సంయమనం పాటించి పోలీస్ స్టేషన్ కి వెళ్లి బాధితులు కేసులు పెడుతున్నారు.
పోచారం పోలీస్ స్టేషన్ ఎస్ఐ, సీఐ వాళ్లకే సపోర్ట్ చేస్తున్నారు. ఇటీవల నా దగ్గరికి బాధితులందరూ వొచ్చి వారిని పెడుతున్న ఇబ్బందులను మొరపెట్టుకున్నారు. నేను వెంటనే సిపికి ఫిర్యదు చేశాను. కలెక్టర్కి ఫోన్ చేసి రోజు ఏదో ఒక కబ్జా మీద ఫోన్ చేయాల్సి వొస్తుంది. మీరేం చేస్తున్నట్టు అని అడిగాను. రాత్రిపూట వాళ్ల గుండాలు ఎంపీ వొచ్చి ఏం పీకుతాడని చెప్పి మహిళలను బెదిరించారు. టెంట్ వెయ్యొద్దు కుర్చీలు వేయొద్దు మీటింగ్ పెట్టొద్దు అని హుకుం జారీ చేశారంట. రాత్రి పోలీసు వాళ్లకు ఫోన్ చేస్తే నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించారు. పొద్దున్నే వొచ్చి స్థానికులతో మాట్లాడి అన్ని వివరాలు తెలుసుకున్నా. పోలీసు ధర్మాన్ని కాపాడటంలో విఫలమైనప్పుడు.. రెవెన్యూ అధికారులు విఫలమైనప్పుడు.. ప్రజల వోట్లతో గడిచిన బిడ్డగా.. ధర్మాన్ని కాపాడటానికి.. వాళ్లకు అండగా ఉండడానికి బ్రోకర్కు పనిష్మెంట్ ఇచ్చాను. నేను దీనిని తప్పుగా భావించడం లేదు. ప్రజల పక్షాన నిజమైన నిలబడ్డా. పోలీసు, రెవెన్యూ అధికారులు ప్రజల ఆస్తులను, ప్రజలను కాపాడటంలో విఫలమైనప్పుడు ప్రజలే తిరగబడతారు. కోర్టులు, న్యాయం వీరి పక్కన ఉన్నా కూడా న్యాయం కాపాడాల్సిన రెవెన్యూ అధికారులు పోలీసులు అధర్మానికి కొమ్ము కాయడం సిగ్గుచేటు. నా 25 ఏళ్ల జీవితంలో ఎవరిపైనా చేయెత్తలేదు. బూతులు తిట్టలేదు అని ఈటల రాజేందర్ అన్నారు.
ముఖ్యమంత్రి విచారణ చేపట్టాలి
సీఎం రేవంత్ రెడ్డికి ప్రజల మీద ప్రేమ ఉంటే వెంటనే ఎంక్వయిరీ చేసి ఎవరి స్థలాలనువారికి ఇప్పించాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. దీనిలో ఇన్వాల్వ్ అయిన వారి మీద చర్యలు తీసుకోవాలని, వారికి అండగా ఉన్న నాయకులను హెచ్చరించాలన్నారు. ఏకశిలా నగర్ మాత్రమే కాదు బాలాజీ నగర్ జవహర్ నగర్ అరుంధతి నగర్.. ఆరు నెలలుగా పేదలు కన్నీళ్లకు పరిష్కారం చూపాలన్నారు. దీనిపై మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేస్తానని, ఈ సమస్య పొంగులేటి శ్రీనివాసరెడ్డికి, నవీన్ మిట్టల్ కు, మేడ్చల్ కలెక్టర్ కి, రాచకొండ సిపికి పంపిస్తానని తెలిపారు. 40 సంవత్సరాలుగా కోర్టు తీర్పు ఉన్నా కూడా ఆ భూములను అనుభవించకుండా బాధపడుతున్న వారి పక్షాన నేను నిలబడతానన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రజల ఆస్తులను కాపాడాలని డిమాండ్ చేశారు.