రేవంత్… ఇక కాసుకో.. కేటీఆర్.. నువ్వు ఇక నోరు మూసుకో.. అంటూ నిత్యం విమర్శలు చేసుకునే వైరి వర్గాలు యాధృఛ్చికంగా ఒకే వేదికను పంచుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఒకే వేదికపై కనిపించడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. రాష్ట్రంలో ప్రతి రోజూ, ప్రతి నిమిషం కాంగ్రెస్, బీఆర్ఎస్ బద్ధ శత్రువులుగా వ్యవహరిస్తుంటాయి. పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన(డీలిమిటేషన్)పై దక్షిణాది రాష్ట్రాల సమావేశం ప్రారంభమైంది. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అధ్యక్షతన చెన్నైలో దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రతిపక్షాల నేతలు సమావేశం అయ్యారు. కేంద్రానికి వ్యతిరేకంగా చేపట్టాల్సిన చర్యలపైనా పార్టీలన్నీ సమాలోచనలు చేస్తున్నాయి. కాగా, సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఒకే వేదికపై కనిపించడం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలు, కేసీఆర్ తీరును రేవంత్ రెడ్డి.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలు, పథకాలను కేటీఆర్ విమర్శించుకుంటూనే ఉంటారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ రూ.లక్ష కోట్లు తిన్నారని అధికార పార్టీ ఆరోపణలు చేస్తుంటే.. మూసీ పేరుతో ఢిల్లీకి మూటలు పంపేందుకు ప్రాజెక్టు చేపట్టారంటూ బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తుంటారు. రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వమే మేలు చేసిందని.. రైతు బంధు, రుణమాఫీ చేసిందని రేవంత్ రెడ్డి చెప్తుంటే.. సగానికి పైగా లబ్ధిదారులకు కాంగ్రెస్ ఇచ్చే పథకాలు అందడం లేదని కేటీఆర్ మండిపడుతుంటారు. ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో కేటీఆర్ అవినీతికి పాల్పడ్డారని అధికార పార్టీ నేతలు అంటుంటే.. రేవంత్ రెడ్డే ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయారంటూ ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి, కేటీఆర్ ఒకే అంశంపై ఏకాభిప్రాయానికి రావడం ఇప్పుడు పెద్దఎత్తున చర్చకు దారి తీసింది. వారిద్దరూ దక్షిణాది రాష్ట్రాల సమావేశానికి హాజరుకావడంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే తెలంగాణ రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నా.. రాష్ట్రానికి ప్రమాదం పొంచి ఉందని తెలిస్తే అంతా ఒక్కటిగా చేతులు కలుపుతారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అందుకు తెలంగాణ ఉద్యమమే ఉదాహరణ అంటున్నారు. పార్టీలు, కులాలు, మతాలకు అతీతంగా అంతా కలిసి రోడ్లపైకి వచ్చి మరీ తెలంగాణ సాధించుకున్నారని.. ఇప్పుడు డీలిమిటేషన్ అంశంలోనూ అదే స్ఫూర్తి కనిపిస్తోందంటూ చెప్తున్నారు.
కాగా, స్టాలిన్ నేడు ప్రతిపాదించే జేఏసీలో కాంగ్రెస్తోపాటు బీఆర్ఎస్ కూడా భాగస్వామిగా మారితే, ఈ అంశంపై ఇరు పార్టీలూ కలిసి పోరాట కార్యాచరణలో భాగస్వాములు కావాల్సి ఉంటుంది. అదే జరిగితే రాష్ట్రంలో బద్ధశత్రువుల్లా వ్యవహరిస్తున్న అధికార, ప్రతిపక్షాలైన కాంగ్రెస్, బీఆర్ఎస్.. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన అంశంపై తెలంగాణ రాష్ట్ర ప్రయోజనం కోసం కలిసి పోరాటం చేయాల్సి వస్తుంది.