బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కుంభకోణాలు మొదలయ్యాయని, వేల కోట్ల కుంభకోణానికి పాల్పడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. పౌరసరఫరాల శాఖలో రూ. 1000 కోట్ల భారీ స్కామ్ జరిగిందని, సన్న బియ్యం, ధాన్యం కొనుగోలు కోసం పిలిచిన గ్లోబల్ టెండర్లలో అవకతవకలు జరిగాయని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 50 రోజుల్లోనే ఈ కుంభకోణానికి పాల్పడిందని ఆరోపించారు. తెలంగాణ భవన్ లో ఆదివారం కేటీఆర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు వివరాలు వెల్లడించారు.
క్వింటాల్ కు రూ.150 నుంచి రూ.223 రూపాయలు అదనంగా చెల్లించాలని రాష్ట్రంలో ఉన్న రైస్ మిల్లర్లను బెదిరిస్తున్నాయని, లిప్ట్ చేయకపోయినా చేసినట్టు తాము చూపిస్తామని చెప్తున్నారని అన్నారు. అదనంగా క్వింటాల్ కు రూ.200 చొప్పున తీసుకున్నా.. దాదాపు 35 లక్షల మెట్రిక్ టన్నులకు రూ.700 కోట్ల వరకు అవినీతికి పాల్పడ్డారని కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో కుంభకోణాల కుంభమేళా జరుగుతుందని, ప్రభుత్వంతో సంబంధం లేని ప్రైవేట్ సంస్థలు ప్రభుత్వం తరపున డబ్బుల వసూళ్లు ఎలా చేస్తాయని ప్రశ్నించారు. మిల్లర్లతో కుమ్మక్కై భారీ స్కామ్ చేశారని.. ఆ నాలుగు సంస్థలు కుమ్మక్కై మిల్లర్లను బెదిరిస్తున్నాయని కేటీఆర్ అన్నారు.
అనధికారికంగా వసూళ్లు
రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఛైర్మన్ గా పని చేసిన రవీందర్ సింగ్ 15 రోజుల క్రితం ఈ ఆరోపణలను తొలిసారిగా చేశారని కేటీఆర్ అన్నారు. అయినప్పటికీ ఇప్పటి వరకూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నుంచి, సీఎం రేవంత్ నుంచి ఎలాంటి వివరణ రాలేదని అన్నారు. ముందుగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సేకరించి మిల్లర్ల దగ్గర ఉంచిన 35 లక్షల మెట్రిక్ ధాన్యాన్ని విక్రయించేందుకు మూడు నెలల కింద రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో పౌరసరఫరాల శాఖ గ్లోబల్ టెండర్ల కహానీకి తెరలేపిందని, అధికారంలోకి వచ్చి 50 రోజులు కాకముందే ఈ దోపిడీకి తెరలేపి.. జనవరి 25న కమిటీ వేసిందని, అదే రోజు మార్గదర్శకాలు జారీ చేసి టెండర్లను పిలిచారన్నారు. క్వింటాలుకు రూ.2100 కు కొనుగోలు చేయానికి రైస్ మిల్లర్లు సుముఖత వ్యక్తం చేసినప్పటికీ దాన్ని రిజెక్ట్ చేసి.. గ్లోబల్ టెండర్లు పిలిచారని, కేంద్రీయ బండార్, ఎల్జీ ఇండస్ట్రీస్, హిందూస్తాన్ కంపెనీ, నాక్హాఫ్ అనే నాలుగు సంస్థలు ఈ టెండర్లను దక్కించుకున్నాయని, గురుకులాల్లో కాంట్రాక్ట్ దక్కించుకున్న తర్వాత సరిగ్గా పనిచేయలేదని కేంద్రీయ బండార్ అనే సంస్థను 2023లో బీఆర్ఎస్ ప్రభుత్వం బ్లాక్ లిస్ట్ చేసిందని.
కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కేంద్రీయ బండార్ సంస్థ కోసం రూల్స్ను రిలాక్స్ చేశారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. మిల్లర్లు క్వింటాలుకు 210 చెల్లించి కొనుగోలు చేస్తామని సుముఖత వ్యక్తం చేసినప్పటికీ.. ఆ నాలుగు కంపెనీలకే టెండర్లు కట్టబెట్టారని, క్వింటాలుకు దాదాపు 200 తగ్గించి.. 1885-2007 రూపాయలకు కొనుగోలు చేసేలా ఒప్పందం చేశారని, ఈ టెండర్ మార్గదర్శకాల ప్రకారం 90 రోజుల్లో 35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని లిఫ్ట్ చేసి.. ప్రభుత్వానికి రూ.7500 కోట్లు చెల్లించాలని నిబంధన పెట్టిందన్నారు. టెండర్ గైడ్లైన్స్ ప్రకారం ఈ నాలుగు కంపెనీలు ధాన్యాన్ని లిఫ్ట్ చేయాలని, అంతేతప్ప ఏ లావాదేవీల్లో పాల్గొనవద్దని, కానీ వీళ్లు మిల్లర్లతో నేరుగా ఆర్థికపరమైన లావాదేవీలు చేస్తూ మనీలాండరింగ్కు పాల్పడ్డారని మండిపడ్డారు.
క్వింటాలుకు రూ. 2007 కొనుగోలు చేయాలని కోట్ చేసినప్పటికీ మిల్లర్లు ఇంకో రూ.236 అదనంగా ఇవ్వాల్సిందేనని జలసౌధలో అనధికారికంగా ఒక ఒప్పందం కుదర్చుకున్నారని, సీఎం పేషీకి ఖర్చయ్యిందని, ఢిల్లీకి పోవాలి.. ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి క్వింటాలుకు 150 నుంచి 236 రూపాయలు అదనంగా చెల్లించి తీరాలని రైస్ మిల్లర్లను ఒత్తిడి చేశాయని, దీనికి సహకరించకపోతే విజిలెన్స్, జీఎస్టీ దాడులు జరుగుతాయని బెదిరిస్తున్నారని, 35లక్షల మెట్రిక్ టన్నులకు 200 చొప్పున చూసుకున్నా 700 కోట్ల అదనపు డబ్బు మనీలాండరింగ్ ద్వారా మిల్లర్ల దగ్గర వసూలు చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు.
ప్రతిపక్ష హోదాలో ఆవిర్భావ వేడుకలు
ఇక, జూన్ 2వ తేదీతో తెలంగాణ ఏర్పడి పదేళ్లు అవుతున్నందున తెలంగాణ భవన్ లో ఘనంగా వేడుకలు నిర్వహిస్తామని వెల్లడించార. కేసీఆర్ పాలన సాక్షిగా వెయ్యేళ్లైనా చెక్కు చెదరని పునాదిని బీఆర్ఎస్ ప్రభుత్వం వేసిందని, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజే అధికార పగ్గాలు చేపట్టిన గులాబీ పార్టీ, మొదటిసారి ప్రతిపక్ష హోదాలో రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నిర్వహించనుందని కేటీఆర్ చెప్పారు.