Saturday, April 26, 2025

అపరేషన్‌ బార్డర్‌

రాష్ట్రాల సరిహద్దులో మావోల వేట

ఛత్తీస్‌గఢ్‌- తెలంగాణ సరిహద్దుల్లో అతిపెద్ద యాంటీ-నక్సల్‌ ఆపరేషన్‌ చేపట్టాయి భద్రతా బలగాలు. బీజాపుర్‌ అడవుల్లో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు నక్కినట్లు సమాచారం అందడంతో భద్రతా బలగాలు కూంబింగ్‌ చేపట్టాయి. దాదాపు 1000 మంది మావోయిస్టులను సుమారు 20వేల మంది భద్రతా సిబ్బంది చుట్టుముట్టినట్లు సమాచారం. ఈ ఆపరేషన్​ దాదాపు నాలుగు రోజుల పాటు కొనసాగనుందని అధికారులు చెబుతున్నారు. ఇందులో ఇప్పటికే ముగ్గురు నక్సలైట్లు మరణించినట్లు వెల్లడించారు. అంతకుముందు ఉదయం ధర్మతాళ్లగూడెం అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు మావోయిస్టులు మృతిచెందారు. ఘటనాస్థలంలో భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
బీజాపుర్‌ జిల్లా ఊసూరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని కర్రెగుట్టల కేంద్రంగా అగ్రనేతలు, మావోయిస్టులు పెద్ద సంఖ్యలో ఉన్నారనే సమాచారం రావడంతో కేంద్ర పారామిలటరీ బలగాల నేతృత్వంలో ఈ ఆపరేషన్‌ చేపట్టారు. కర్రెగుట్టలలో దాదాపు 1000 మంది మావోయిస్టులు దాగి ఉన్నట్లు తెలుస్తోంది. అగ్రనేత హిడ్మా నేతృత్వంలో వీరంతా అక్కడకు చేరినట్లు సమాచారం. వీరిలో కమాండర్‌ స్థాయి నేతలు, మావోయిస్టు అగ్ర నాయకులు ఉన్నట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం అందడంతో ఈ ప్రాంతంలో కూంబింగ్‌ ఆపరేషన్‌ చేపట్టారు. ఫలితంగా భీమవరంపాడు, పూజారీ కాంకేర్‌, పామేడు అటవీ ప్రాంతాల్లో కాల్పుల మోత మోగుతోంది. అటు కూంబింగ్‌ నేపథ్యంలో కర్రెగుట్ట దండకారణ్యంలోని పలు గ్రామాలకు రాకపోకలను నిలిపివేశారు. అయితే, గాలింపు చర్యల్లో డీఆర్‌జీ బస్తర్ ఫైటర్ కోబ్రా, సీఆర్పీఎఫ్‌, ఎస్టీఎఫ్‌ సైనికులతో పాటు తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర పోలీసులు పాల్గొన్నారు. మందుపాతరలు అమర్చామని, ప్రజలెవరూ అటవీ ప్రాంతంలోకి రావొద్దని ఇప్పటికే మావోయిస్టులు లేఖల ద్వారా హెచ్చరించారు. దీంతో గాలింపు అత్యంత అప్రమత్తంగా చేపట్టాయి భద్రతా బలగాలు. బుధవారం నాటికి 3 వేల మంది బలగాలతో కూంబింగ్‌ చేపట్టగా, గురువారం ఉదయం అదనంగా మరో 2 వేల మందిని రప్పించారు. ఫలితంగా సుమారు 5 వేల మంది భద్రతా సిబ్బంది కర్రెగుట్టల అటవీప్రాంతాన్ని చుట్టుముట్టినట్లు తెలుస్తోంది. కానీ, భద్రతా బలగాల సంఖ్య 20వేల వరకు ఉంటుందని పలు ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. బస్తర్‌, అబూజ్‌బడ్‌ దండకారణ్యంపై అగ్ర నేత హిడ్మాకు పూర్తి అవగాహన ఉంది. అతడి టార్గెట్‌గానే ఈ ఆపరేషన్‌ చేపట్టినట్లు తెలుస్తోంది. హిడ్మాతో పాటు మావోయిస్టు బెటాలియన్‌ చీఫ్‌ దేవాను లక్ష్యంగా చేసుకున్నట్లు సమాచారం.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com