బాలకృష్ణ హోస్ట్గా వ్యవహరిస్తున్న టాక్ షో అన్స్టాపబుల్కు తమ సినిమా ప్రమోషన్స్లో భాగంగా ప్రముఖ నటులు విచ్చేసి సందడి చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ ప్రమోషన్స్లో భాగంగా వెంకటేశ్, అనిల్ రావిపూడి, నిర్మాత సురేశ్ బాబు పాల్గొని సందడి చేశారు. తాజా ఎపిసోడ్ విషయంపై ఓ కీలక అప్ డేట్ వచ్చింది.
ఇటు నందమూరి, అటు మెగా అభిమానులు ఉత్సాహంగా ఎదురుచూసే ఎపిసోడ్ కాబోతుంది. వాస్తవానికి ఒకప్పుడు సినీ ఫీల్డ్లో మెగా వర్సెస్ నందమూరి అన్నట్లుగా అభిమానుల్లో ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు మారాయి. రాజకీయంగా పవన్ కల్యాణ్ అధినేతగా ఉన్న జనసేన పార్టీ .. తెలుగుదేశంతో మిత్రపక్షంగా ఉండటంతో ఆయా పార్టీల శ్రేణులు, మెగా, నందమూరి అభిమానులు సైతం కలిసి మెలసి ఉంటున్నారు.
ఈ తరుణంలో జనవరి 10న సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘గేమ్ ఛేంజర్’ మూవీ ప్రమోషన్లో భాగంగా రామ్ చరణ్ అన్ స్టాపబుల్ షోకు విచ్చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ‘ఆహా’ ఓటీటీ సంస్థ ఎక్స్ వేదికగా అధికారిక ప్రకటన చేసింది. ‘ఒరేయ్ చిట్టి .. బాబు వస్తున్నాడు .. రీసౌండ్ ఇండియా అంతా వినిపించేలా చేయండి’ అంటూ ఆహా ఎక్స్ అకౌంట్ నుంచి పోస్టు వచ్చింది. దీంతో నందమూరి, మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేవని చెప్పాలి. షోకు వచ్చే వారితో బాలకృష్ణ చాలా చనువుగా మాట్లాడుతూ ఎవరికీ తెలియని వారి వ్యక్తిగత విషయాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో మెగా కుటుంబం నుంచి ఎలాంటి విషయాలు బాలకృష్ణ రాబడతారోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.