తెలంగాణ సూపర్ గేమ్ ఛేంజర్గా హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్డు ప్రాజెక్ట్ను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు 340 కిలోమీటర్ల పొడవుతో.. 6 లేన్ల యాక్సెస్-కంట్రోల్డ్ ఎక్స్ప్రెస్వేగా దీనిని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) నుంచి సుమారు 40 కి.మీ. దూరంలో ఉత్తర, దక్షిణ రెండు భాగాలుగా ఈ ప్రాజెక్టును చేపట్టారు. ఇప్పటికే ఉత్తర భాగం పనులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక ఔటర్ రింగు రోడ్డు, రీజినల్ రింగు రోడ్డును కలుపుతూ రేడియల్రోడ్లు కూడా నిర్మించనున్నారు.
మెుత్తం 12 రేడియల్ రోడ్లు నిర్మించనున్నట్లు హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ వెల్లడించారు. ప్రస్తుతం ఇన్నర్ రింగ్ రోడ్డు నుంచి ఓఆర్ఆర్ వరకు 16 రేడియల్ రోడ్లు ఉన్నాయని చెప్పారు. భవిష్యత్తులో రీజినల్ రింగు రోడ్డు వరకు ఔటర్ నుంచి నుంచి 12 రేడియల్ రోడ్లకు ప్రణాళిక రూపొందిస్తున్ననట్లు స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన డీపీఆర్ సిద్ధమైనట్లు తెలిపారు. క్రమబద్ధమైన నగరీకరణ కోసం త్వరలో తెలంగాణ పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ కొత్త చట్టం తీసుకురాబోతోందని సర్ఫరాజ్ అహ్మద్ వెల్లడించారు.
ఈ కొత్త ప్రణాళిక కోసం ఛత్తీస్గఢ్లోని నయా రాయ్పూర్, గుజరాత్, ఏపీలోని అమరావతి సీఆర్డీఏ మోడళ్లను అధికారులు పరిశీలిస్తున్నారని చెప్పారు. ఎల్ఏడీపీలో భాగంగా, రైతులు, అసైనీలు, ఇతర ప్రభుత్వ, ప్రైవేటు భూముల్లో పక్కాగా లేఅవుట్లు అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. ఇందులో 60 శాతం భూమిని యజమానులకు కేటాయించి, మిగతా 40 శాతంలో అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తారన్నారు. ప్రస్తుతం ఉన్న ల్యాండ్ పూలింగ్ చట్టంలో స్కూళ్లు, విశ్వవిద్యాలయాలు, హాస్పిటల్స్, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల వంటి వాటికి ప్రత్యేక భూ కేటాయింపులు లేవని అన్నారు. 10 శాతం ప్రజా అవసరాలకు ఇచ్చిన భూమిలోనే వీటిని సర్దుబాటు చేస్తున్నారన్నారు.
కొత్త చట్టంలో ఈ సమస్య పరిష్కారం కానుందని వెల్లడించారు. నగర అభివృద్ధి కోసం వచ్చే ఏడాదికి మెగా మాస్టర్ప్లాన్ రూపుదిద్దుకోనుందని స్పష్టం చేశారు. ల్యాండ్ యూజ్ ధ్రువీకరణ పత్రాలను ఆన్లైన్లో జారీ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. భవన నిర్మాణాలు, లేఅవుట్ల అనుమతుల కోసం తెచ్చిన ‘బిల్డ్ నౌ’లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. ఇక ఉత్తర తెలంగాణ ప్రజలకు సాఫీగా ప్రయాణాలు సాగించేందుకు సికింద్రాబాద్ ప్యారడైజ్ నుంచి శామీర్పేట్, డెయిరీ ఫాం వరకు నిర్మిస్తున్న ఎలివేటెడ్ కారిడార్ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయని అన్నారు.