– ఓర్పుతో ఉండండా
– అభిమానులకు ఎన్టీఆర్ విజ్ఞప్తి
– త్వరలో సమావేశం ఏర్పాటు చేస్తా
అభిమానుల శ్రేయస్సు దృశ్యా ఎన్టీఆర్ బహిర్గత వేడుకలకు రావడం లేదు. నేరుగా అభిమానులను కలవడం లేదు. ఇటీవల ‘దేవర’ చిత్రంతో విజయాన్ని అందుకున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. అయితే, ఈ చిత్రం ప్రమోషన్స్లో ఎన్టీఆర్ అభిమానులను నేరుగా కలవలేదు. ‘దేవర’ చిత్రం విడుదల సమయంలో ప్రీ రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించాలని అభిమానులు భావించారు. కానీ, అభిమానుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని ఆ కార్యక్రమాన్ని చివరి నిమిషంలో రద్దు చేశారు.
కొంతమంది అభిమానులు ఆయనను కలుసుకోవడానికి పాదయాత్రతో హైదరాబాద్కు వస్తున్న విషయం ఎన్టీఆర్కు తెలిసింది. దీంతో ఆయన త్వరలోనే అభిమానులను కలుస్తానని, ఇందుకోసం తగిన ఏర్పాట్లు చేస్తున్నామని ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు. “నాపై మీరు చూపిస్తున్న ఆత్మీయత, ప్రేమ, గౌరవానికి నా కృతజ్ఞతలు. నన్ను కలుసుకోవాలని మీరు చూపిస్తున్న ఆసక్తిని, అభిమానాన్ని నేను అర్థం చేసుకున్నాను. దీనికి సంబంధించి త్వరలోనే మీతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తాను. ఈ సమావేశానికి సంబంధించిన అనుమతులు, పోలీస్ డిపార్ట్మెంట్ అధికారులతో సమన్వయం చేసుకుని, శాంతి భద్రతలకు ఎటువంటి సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇంత పెద్ద సమావేశం నిర్వహించాలంటే కొంత సమయం పడుతుంది. కావున అభిమానులందరూ ఓపికగా ఉండాలని కోరుతున్నాను. అంతేకాదు, నన్ను కలుసుకోవడానికి పాదయాత్రలు చేయకండి. మీ ఆనందంతో పాటు మీ సంక్షేమం కూడా నాకు చాలా ముఖ్యం” అని ఎన్టీఆర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.