మన దేశం బాగుపడాలంటే ముందుగా ప్రజలు మారాలి. డబ్బులకు కక్కుర్తిపడి ఓట్లు వేసినంత కాలం.. మన దేశం అభివృద్ధి చెందుతుందనే గ్యారెంటీ లేనే లేదు. స్వార్థపూరితంగా వ్యవహరిస్తూ.. పార్టీలను మార్చే రాజకీయ నాయకులకు తగిన గుణపాఠం చెప్పాలి. ఏ పార్టీ నాయకులైనా.. ఎంత పెద్ద నేతలైనా.. తమ అక్రమ ఆస్తుల్ని కాపాడుకోవడానికో.. రాజకీయ పబ్బం గడిపేందుకో పార్టీలను మార్చుకుంటూ వెళితే ఊపేక్షించకూడదు. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి.. పట్నం మహేందర్రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి చేరాడు. బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో.. ఒక్కసారిగా జంప్ జిలానీ అయిపోయాడు. ఇంతకీ సారు ఎందుకు మారాడంటే.. అతని భార్య వికారాబాద్ జడ్పీ ఛైర్మన్ సునీతా మహేందర్రెడ్డికి చేవెళ్ల టికెట్ ను ఇప్పించేందుకట. రేవంత్రెడ్డి కూడా టికెట్ను ఇప్పించలేడనే విషయాన్ని పట్నం మహేందర్రెడ్డి, సునీతా మహేందర్రెడ్డిలు అర్థం చేసుకోవాలి. ఒకవేళ కాంగ్రెస్ చేవేళ్ల టికెట్ ఇవ్వకపోతే వీళ్లేం చేస్తారు? ఇక్కడే ఐదేళ్లు ఉండి.. తర్వాత మరో పార్టీలోకి జంప్ అవుతారా?
కేటీఆర్కు ఫార్మూలా ‘రేస్’ ఉచ్చు
* ఫార్ములా రేస్ నిర్వహణ అంతా ఆయనదే
* మంత్రి హోదాలో కేటీఆర్ చెప్తేనే నిధులు విడుదల
* ఫైనాన్స్ డిపార్ట్మెంట్కు చెప్పలేదు
* హెచ్ఎండీఏ నుంచి చెల్లించాలని ఆదేశించారు
* ఫార్ములా రేస్ చెల్లింపులపై ఐఏఎస్ అరవింద్ కుమార్ రిప్లై
ఫార్ములా ఈ రేసింగ్ వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్ చిక్కుల్లో పడుతున్నారు. ఆయన చుట్టూ రేసింగ్ ఉచ్చు బిగుస్తున్నది. ఎలాంటి అనుమతులు లేకుండా.. ఆర్థిక శాఖకు కనీస సమాచారం లేకుండా ఫార్ములా ఈ నిర్వహణ కంపెనీకి రూ. 55 కోట్లు చెల్లించామని, అప్పుడు మంత్రి హోదాలో కేటీఆర్ ఆదేశిస్తేనే హెచ్ఎండీఏ నుంచి చెల్లింపులు పూర్తి చేశామని ఐఏఎస్ అధికారి అరవింద్కుమార్ ప్రభుత్వానికి రిప్లై ఇచ్చారు. ఫార్ములా ఈ రేసింగ్ను రద్దు చేసిన ప్రభుత్వం.. దానికి ముందస్తు చెల్లింపులపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఆర్థిక శాఖ అనుమతి లేకుండా రూ. 55 కోట్లను థర్డ్ పార్టీకి విడుదల చేసిన సీనియర్ ఐఏఎస్ అధికారి, హెచ్ఎండీఏ అప్పటి కమిషనర్ అర్వింద్ కుమార్ కు య ప్రభుత్వం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. దీనిపై ఆయన తాజాగా వివరణ ఇచ్చారు. అప్పుడు మంత్రిగా ఉన్న కేటీఆర్ మౌఖిక ఆదేశాలతోనే తాను ఈ రేసింగ్కు నిధుల విడుదల చేశామని రిప్లైలో స్పష్టం చేశారు. దీంతో ఈ గోల్మాల్ విషయంలో అర్వింద్కుమార్తో పాటు మాజీ మంత్రి కేటీఆర్పై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.
ఆర్థిక శాఖ అనుమతి లేకుండా ప్రభుత్వ ఖజానా నుంచి ఏజెన్సీకి డబ్బులు విడుదల చేయడం నేరంగా ప్రభుత్వం భావిస్తున్నది. ఈ క్రమంలోనే క్యాబినెట్ ఆమోదం లేకుండా అగ్రిమెంట్లు కుదుర్చుకున్న అధికారుల నుంచి గానీ మంత్రుల నుంచి గానీ డబ్బులు రికవరీ చేసిన సందర్భాలేమైనా ఉన్నాయా అని ప్రభుత్వం ఆరా తీస్తోంది. ఈ మొత్తం వ్యవహారంపై రాష్ట్ర అడ్వకేట్ జనరల్ నుంచి న్యాయ సలహా కోరినట్లు సమాచారం. లీగల్ అడ్వైజ్ రాగానే.. అర్వింద్ కుమార్తోపాటు కేటీఆర్పై క్రిమినల్ కేసులకు తెలంగాణ సర్కార్ సిద్ధమవుతోంది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో మంత్రిగా కేటీఆర్ చెప్పినా అర్వింద్కుమార్ నిధులు విడుదల చేయడం చట్ట విరుద్ధమే అవుతుందని లీగల్ ఒపీనియన్ కూడా తీసుకున్నట్లు సమాచారం.
ఇదీ రిప్లై
ఈ రేస్కు సంబంధించి నాలుగు సీజన్ల కోసం 2023 అక్టోబరు 22న ఏస్ నెక్ట్స్ జెన్, ఫార్ములా-ఈ కంపెనీ, ప్రభుత్వానికి మధ్య ఒప్పందం జరిగింది. ప్రభుత్వం తరపున హెచ్ఎండీఏ రూ.20 కోట్లు పెట్టి ట్రాక్ వేసిందని, హైదరాబాద్ రేసింగ్ లిమిటెడ్ రూ.35 కోట్లు ఖర్చు చేసింది. అయితే తర్వాత త్రైపాక్షిక ఒప్పందాన్ని మార్చుకున్నారు. స్పాన్సర్ షిప్ ఇస్తామని చెప్పిన గ్రీన్ కో కంపెనీ వైదొలిగింది. దీంతో ఖర్చు అంతా తెలంగాణ ప్రభుత్వంపై పడింది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక ఫార్ములా-ఈ కంపెనీకి అప్పటి పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ రూ.55 కోట్లు చెల్లించారు. మరో రూ.55 కోట్లను కట్టాలంటూ కంపెనీ ప్రభుత్వానికి నోటీసు ఇచ్చింది. లేకపోతే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇదేదో గోల్ మాల్ వ్యవహారంలా ఉందని.. ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.
ఈ సందర్భంగా అరవింద్ కుమార్ తాజాగా ఇచ్చిన రిప్లై ప్రభుత్వానికి చేరింది. నిరుడు అక్టోబర్ 25న ఎంఏయూడీ, ఏస్ నెక్స్ట్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్ మధ్య ఒప్పందం చేసుకున్నామని, సీజన్ 9, 10 లకు ప్రమోటర్లుగా ఉండేందుకు ఏస్ నెక్ట్స్ జెన్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, ఈ సీజన్ 9 ను ఫిబ్రవరి 10, 11 లో నిర్వహించాలని, సీజన్ 10 ను ఈ ఫిబ్రవరి 10 న నిర్వహించేందుకు ఎఫ్ఎఫ్ఓ క్యాలెండర్ విడుదల చేశామని అరవింద్ కుమార్ వెల్లడించారు. సీజన్ 10 లో ప్రమోటర్ గా హెచ్ఎండీఏ వ్యవహరించిందని, అప్పటి మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాలతో ముందుగా రూ. 53 కోట్లు విడుదల చేశామని, మొదటి విడుతలో రూ. 45 కోట్లు, టాక్స్ ల రూపంలో రూ. 8 కోట్లను చెల్లించామని వివరించారు. అయితే, ఇవన్నీ అప్పటి మంత్రి కేటీఆర్ అనుమతితోనే చెల్లింపులు జరిగాయని, రాష్ట్ర బడ్జెట్ నుండి నిధులు తీయలేదు కాబట్టే ఆర్థిక శాఖకు చెప్పలేదని, ఈవెంట్ కోసం తక్కువ టైం ఉంది కాబట్టి నిధులు మొత్తం హెచ్ఎండీఏ నుంచే చెల్లించాలని కేటీఆర్ చెప్పారని అరవింద్ కుమార్ వివరణ ఇచ్చారు. రూ. 53 కోట్లు చెల్లించిన తర్వాతనే హైదరాబాదును ఈవెంట్ సిటీ క్యాలెండర్ లో ఎఫ్ఈఓ పెట్టిందని, రేస్ నిర్వహణకు సంబంధించిన పూర్తి అధారిటీ కేటీఆర్ మాత్రమేనని అరవింద్కుమార్ స్పష్టం చేశారు.
కేటీఆర్కు ఉచ్చు
ఫార్ములా రేసింగ్పై ఇప్పటికే సీరియస్గా ఉన్న ప్రభుత్వానికి అరవింద్కుమార్ వివరణ అనుకూలంగా మారుతున్నట్లుగా తయారైంది. దీనిలో మాజీ మంత్రి కేటీఆర్ఇరుకున పడుతున్నట్లు స్పష్టమవుతుంది. ఆర్థిక శాఖ అనుమతి లేకుండా.. కేబినెట్కు చెప్పకుండా నిధులు చెల్లించడంపై కేటీఆర్పై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నది.
జగన్.. భజన్.. యాత్ర 2 మూవీ రివ్యూ
2019 ఎన్నికల ముందు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ రాజకీయ జీవిత కథ ఆధారంగా రూపొందించిన యాత్ర సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన యాత్ర బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. మళయాళ సూపర్ స్టార్ యాత్ర సినిమాలో వైఎస్ఆర్గా కనిపించి మెప్పించారు. ముఖ్యంగా వైఎస్ఆర్ను అభిమానించే ప్రతి ఒక్కరికి యాత్ర సినిమా గుండెలకు హత్తుకునేలా చేసింది. ఈ సినిమాకు కొనసాగింపుగా యాత్ర 2ను అనౌన్స్ చేశాడు దర్శకుడు మహీ వి.రాఘవ్. మొదటి పార్ట్లో వైఎస్ఆర్ గురించి చూపించగా, యాత్ర 2లో ఆయన తనయుడు వైసీపీ అధినేత , సీఎం జగన్ గురించి తెర మీద చూపించడానికి ప్రయత్నాలు చేశాడు. వైఎఎస్ఆర్ పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి కనిపించగా…జగన్ పాత్రలో తమిళ హీరో జీవా నటించారు. గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన యాత్ర– 2 కొంతమేరకు పాజిటివ్ టాక్ వచ్చినట్టున్నా.. సినిమాలో కీలక అంశాలు మిస్ అయ్యాయి. కేవలం జగన్ కోసమే ఈ సినిమా అన్నట్టు తేలిపోయింది.
సినిమాలో కొన్ని సన్నివేశాలు మాత్రమే ఎమోషనల్గా సాగాయి. ముఖ్యంగా ఇచ్చిన మాట కోసం జైలుకు వెళ్లిన సందర్భం, ప్రజల కష్టల తెలుసుకోవడానికి జగన్ చేసిన పాదయాత్ర వంటి సన్నివేశాలు తెర మీద ఆకట్టుకున్నాయి. చంద్రబాబు, సోనియా గాంధీలను తప్పుగా చూపిస్తారనే ప్రచారం జరిగినప్పటికీ అలాంటి వాటికి చోటు లేకుండా కేవలం జగన్ ఇమేజ్ను మాత్రమే దర్శకుడు వాడుకున్నట్టు కనిపించింది. జగన్ రాజకీయ జీవితంలో ఎదురైన కఠిన పరిస్థితులను ఎదుర్కొని తాను అనుకున్న లక్ష్యం ఎలా సాధించాడు అనే విషయాలను తెర మీద దర్శకుడు చాలా బలంగా చూపించాడు. యాత్ర– 2లో మమ్ముట్టి కనిపించేది కొద్దిసేపే అయిన్నప్పటికి ఆయన తన పాత్రకు న్యాయం చేశారు.
కసరత్తు కరువైన కథ
ఈ కథ గురించి మహీ.విరాఘవ ఎక్కువ కసరత్తు చేసేందేమీ లేదనే చెప్పుకోవాలి. ఎందుకంటే జగన్ మీడియాను ముందేసుకుని పరిశీలిస్తే సరిపోతుందనిపించేలా కథనం సాగింది. ఎంత బయోపిక్ అయినా సినిమా వన్ సైడ్ ఉండకూడదు. ఒక వైపే నిలబడి మాట్లాడకూడదు. నిజాల్ని కొంతమేరకైనా చెప్పితే బాగుంటుంది. అదే సమయంలో బయోపిక్లో చూపించేవారు చేసిన తప్పుల్ని కూడా చూపించగలిగితే తప్పు ఏమిటో తెలుస్తుంది. కానీ, ‘యాత్ర 2’లో కనిపించలేదు. కేవలం జగన్కు ఈ సినిమా వచ్చే ఎన్నికల్లో ఉపయోగపడడానికి తయారు చేసిన సొంత వీడియోలా మారింది. ఒక దశలో వాళ్లకు కావాల్సిందే వాళ్లు రాసుకున్నట్టుంది.
జగన్ వదిలిన బాణమే ఈ బయోపిక్
అంతేకాదు.. సినిమా మొత్తం తీసి, మళ్లీ జగన్కి చూపించి, ఆయనకు ఇబ్బంది కలిగించే సన్నివేశాల్నీ, పాత్రల్నీ, సంభాషణల్నీ మళ్లీ ఎడిట్ చేసి, చివరికి జగన్ నుంచి వదిలిన సినిమాలా కనిపించింది యాత్ర–2. వైఎస్ఆర్ నేతృత్వంలో రెండోసారి అధికారంలోకి రావడం, అంతకుముందు ప్రచారం నుంచి ఈ సినిమాను మొదలుపెట్టారు. సీఎంగా రెండోసారి ప్రమాణస్వీకారం తర్వాత ఆయనకు ఎందుకో సంతోషం లేదనే కోణంలో ఈ సినిమా ముందుగానే అనిపించింది. ఆ తర్వాత జగన్ను సోనియాకు పరిచయం చేయడం, అదే సమయంలో ఏఐసీసీ నేతలు పెద్దగా జగన్ను పట్టించుకోకపోవడాన్ని కూడా ఒక కథగా చూపించారు. ఇదే సమయంలో జగన్కూడా అప్పుడే ఏదో పెద్ద నేతగా ఫీల్కావడం, సోనియా తనను పట్టించుకోలేదు.. తన తండ్రి పార్టీ కోసం చాలా కష్టపడుతున్నాడు.. ఇవన్నీ ఎందుకు.. మనమే ఓ పార్టీ పెడుతాం అనే లెవల్లో కథను నడిపించినట్టే ఉంది. ఆ తర్వాత హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్సార్ మరణించడం.. ఆ తర్వాత నుంచి సన్నివేశాలన్నీ కేవలం జగన్ కోసమే అన్నట్టు సినిమా సాగింది.
జగన్ పార్టీకి రాజీనామా చేయడం, ఉప ఎన్నికల్లో గెలవడం నుంచి కథ కొంత ముందుకు వచ్చింది. ఆ తర్వాత సొంతంగా పార్టీ పెట్టడం, తండ్రి తరహాలోనే రాజకీయాల్లో దూకుడు చేద్దామా అంటూ అక్కడి ప్రజలను రచ్చబండ కాడ అడుగడం ఆ తర్వాత నుంచి జగన్ ఎదుర్కొన్న కష్టాలను చూపించారు. ఇక్కడే అక్రమాస్తుల కేసును అలా చూపించి.. ఇలా కట్ చేశారు. కానీ, జైలులో ఉన్న కడప రెడ్డికి బయట నుంచి ఎవరు ఏం చేశారు.. పార్టీని ఎలా నడిపించారు.. జగనన్న వదిలిన బాణం ఏమైంది అనేది ఎక్కడా కనిపించలేదు.. వినిపించలేదు కూడా.
2014 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం రైతు రుణమాఫీ అనే హమీ ఇవ్వకపోవడం వల్లే జగన్ ఓడిపోయాడు అని చెప్పడం కొంత నవ్వు తెప్పించే అంశంగానే అనిపించింది. ఎందుకంటే అప్పటికే అక్కడ నెలకొన్న రాజకీయ పరిస్థితులను చూపించడంలో దర్శకుడు ఫెయిల్ అయినట్టు కొట్టచ్చింది. అంతే మొత్తంగా ప్రజల కోసం జగన్ ఇచ్చిన మాట కోసం మాట తప్పడు.. మడమ తిప్పడు అనే కోణంలో మాత్రమే ఈ బయోపిక్ ముగిసింది. జగన్ జైలులో ఉన్నప్పుడు కేవలం విజయమ్మ మీదనే కథను నడిపించారు. కానీ, అప్పుడు “ జగనన్న వదిలిన బాణాన్ని”అంటూ పార్టీని భుజాలపై వేసుకున్న షర్మిల కనీసం కనిపించలేదు.
రెండు అంశాలు మిస్సింగ్
అంతేకాకుండా 2019 ఎన్నికలకు ముందు జరిగిన మరో కీలక పరిణామం కోడి,కత్తీ కేసు. కోడి, కత్తి శ్రీనివాస్ను ఈ బయోపిక్లో అసలే చూపించలేదు. అంతేకాదు.. జగన్ బాబాయ్వివేకా హత్య కూడా దాచి పెట్టారు. నిజానికి, ఈ రెండు అంశాలు ఏపీలో రాజకీయాలను టర్న్ చేశాయి. మరి ఎందుకు వీటిని వదిలేశారు అనేది దర్శకుడు నిరూపించుకోవాల్సిందే. మరో సన్నివేశంలో ఏవో చిన్న పార్టీల మద్దతు అంటూ 2014 ఎన్నికలకు చూపించిన దర్శకుడు.. పవన్ కళ్యాణ్పార్టీ వ్యవహారాన్ని చూపించేందుకు జంకినట్టే కనిపించిం ది. జగన్కి సైతం.. జనసేన అనే పేరు పలకడం, పవన్ కల్యాణ్ అనడం నచ్చవు. అందుకే వాటి జోలికి పోలేదు.
జగన్ ని ఎదగనివ్వకుండా చేసేందుకు సోనియా గాంధీ స్థాయిలో అనుకోవడాన్ని చూపించడం కొంత ఎక్కువే. అంతేకాదు.. అక్రమ ఆస్తుల కేసులో జగన్ని ఇరికించమని చంద్రబాబు నుంచే సోనియాకు సలహాలు వెళ్లినట్టు సినిమాలో చూపించడం పూర్తిగా అపొహ. మరీ కొంత నవ్వు తెప్పించే అంశమేమిటంటే.. రాజకీయాల్లో ఏం చేయాలో తెలియకుండా తిరుగుతున్న జగన్.. రాజశేఖర్ రెడ్డి ప్రమాదం జరిగిన స్థలానికి వెళ్లడం, అక్కడో కేంద్ర విచారణ సంస్థలకు దొరకని ఓ సగం కాలిన పాకెట్ డైరీ దొరకడం, అందులో ఇచ్చిన మాట నిలబెట్టుకో అనే వాక్యాన్ని చూపించడం, సమాధి దగ్గర రాత్రంతా ఏడుస్తూ నిద్రలోకి జారుకున్న జగన్కు తండ్రి కళలలో కనిపించడం కొంత అతిశయోక్తిగానే అనిపించింది.
ఇక, చివరకు నటీనటుల ఎంపికలో కూడా దర్శకుడు కొంత వెనకబడ్డాడు. చంద్రబాబు పాత్ర అసలే సూట్ కాలేదు. చంద్రబాబు టీం కూడా సెట్ కాలేదు. ఇటు జగన్ బాడీ లాంగ్వేజ్ ని జీవా దింపేశాడు. సోనియమ్మ గెటప్ బాగుంది. శుభలేఖ సుధాకర్ ఇచ్చిన ఎలివేషన్లు కూడా ఫర్వాలేదు. కానీ, జగన్ టీం కూడా కరెక్ట్ అనిపించలేదు. కేవలం నందిగాం సురేశ్ మాత్రమే కరెక్ట్గా సెట్ అయ్యాడు.
హైదరాబాద్ లో కొత్తగా డ్రోన్ పోర్ట్
* హైదరాబాద్ లో కొత్తగా డ్రోన్ పోర్ట్
* డ్రోన్ పైలెట్లకు అధునాతన శిక్షణ
* ఇస్రో అధ్వర్యంలోని ఎన్.ఎస్.ఆర్.సీ.తో ఏవియేషన్ అకాడమీ ఒప్పందం
* ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఇస్రో ఛైర్మన్ సోమనాథ్, ఎన్.ఎస్.ఆర్.సీ. బృందం భేటీ
ఇస్రోకు చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్సీ)తో తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమీ డ్రోన్ పైలెట్లకు అధునాతన శిక్షణపై అవగాహన ఒప్పందం చేసుకుంది. బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ సమక్షంలో తెలంగాణ ఏవియేషన్ అకాడమీ సీఈవో ఎస్.ఎన్.రెడ్డి, ఎన్.ఆర్.ఎస్సీ డైరెక్టర్ ప్రకాష్ చౌహన్ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఆర్ అండ్ బీ ముఖ్య కార్యదర్శి శ్రీనివాసరాజుతో పాటు ఎన్.ఆర్.ఎస్.సీ డిప్యూటీ డైరెక్టర్ మురళీ కృష్ణతో పాటు అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఈ ఒప్పందంలో భాగంగా డ్రోన్ పైలెటింగ్, డ్రోన్ డేటా మేనేజ్ మెంట్, డేటా అనాలసిస్ పై ట్రైనింగ్ నిర్వహిస్తారు. ఎన్.ఆర్.ఎస్సీ శాస్త్రవేత్తలకు, అకాడమీలో శిక్షణ పొందుతున్న డ్రోన్ పైలెట్లకు డేటా అనాలసిస్, డేటా ప్రాసెసింగ్, మ్యాపింగ్ పై 15 రోజుల శిక్షణ కోర్సులు నిర్వహిస్తారు.
అన్ని రంగాల్లో డ్రోన్ల వినియోగం పెరిగిపోయిందని, పొలాల్లో ఎరువులు, పురుగు మందులను చల్లేందుకు రైతులు డ్రోన్లను వినియోగిస్తున్నారని, కొన్ని చోట్ల స్వయం సహాయక సంఘాలు డోన్లను ఉపాధి మార్గంగా ఎంచుకున్నారని అధికారులు వివరించారు. ఉన్నత స్థాయి నుంచి తహసీల్దార్ల స్థాయి వరకు ప్రభుత్వ అధికారులకు కూడా డ్రోన్లపై అవగాహన కల్పించేందుకు శిక్షణను ఇవ్వాలని సీఎం సూచించారు.
దేశంలోనే వినూత్నంగా తెలంగాణ ఈ శిక్షణ కోర్సు నిర్వహిస్తోందని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ తెలిపారు. అవసరమైన సహాయ సహకారాలు అందించినందుకు సీఎంను అభినందించారు. శాటిలైట్, రిమోట్ సెన్సింగ్, అంతరిక్ష వ్యవహారాల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఎన్.ఆర్.ఎస్సీ డ్రోన్ టెక్నాలజీని మరింత సాంకేతికంగా వినియోగించుకునేందుకు ఈ శిక్షణలో భాగస్వామ్యం పంచుకుంటుందని అన్నారు. దేశంలో 12 సార్లు బెస్ట్ ఏవియేషన్ అవార్డును అందుకున్న తెలంగాణ ఏవియేషన్ అకాడమీ సేవలను ఆయన ప్రశంసించారు.
ప్రస్తుతం ఎయిర్ పోర్ట్ లోనే డ్రోన్ పైలెట్లకు శిక్షణనిస్తున్నామని, అక్కడున్న రద్దీ దృష్ట్యా హైదరాబాద్ పరిసరాల్లో ప్రత్యేకంగా డ్రోన్ పైలెట్ల శిక్షణకు స్థలం కేటాయించాలని ఏవియేషన్ అకాడమీ అధికారులు సీఎంకు విజ్ఞప్తి చేశారు. స్పందించిన ముఖ్యమంత్రి డ్రోన్ పోర్టు ఏర్పాటుకు ఎంత స్థలం అవసరం.. ఏమేం నిర్మాణాలు చేపడుతారని ఆరా తీశారు. పైలెట్ల శిక్షణతో పాటు డ్రోన్ల తయారీ కంపెనీలు తమ ట్రయల్స్ నిర్వహించుకునేందుకు డ్రోన్ పోర్టు ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. డ్రోన్ పోర్టుకు అవసరమైన 20 ఎకరాల స్థలాన్ని ఫార్మా సిటీ వైపున ఉన్న స్థలాలను అన్వేషించాలని అధికారులను ఆదేశించారు. ఏవియేషన్ నిబంధనల ప్రకారం అభ్యంతరం లేని జోన్లో ఈ స్థలం కేటాయించాలని సూచించారు. హైదరాబాద్ పరిసరాల్లో డ్రోన్ పోర్ట్ ఏర్పాటు చేసేందుకుయాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి అన్నారు.
వరంగల్ ఎయిర్ పోర్ట్ పునరుద్ధరణకు తగిన చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. పాడైన పాత రన్-వేలను కొత్తగా నిర్మించటంతో పాటు అక్కడి నుంచి కమర్షియల్ ఆపరేషన్స్ నిర్వహించేందుకు సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని సూచించారు. అడ్డంకులేమైనా ఉంటే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కొత్తగూడెం, భద్రాచలం పరిసర ప్రాంతంలోనూ ఎయిర్ పోర్టు ఏర్పాటుకు అనువుగా ఉంటుందని, అక్కడున్నఅవకాశాలను పరిశీలించి ఎయిర్ పోర్టు అథారిటీతో సంప్రదింపులు జరపాలని అధికారులకు సూచించారు.
సిద్ధు ‘టిల్లు స్క్వేర్’ బర్త్డే గ్లింప్స్
స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ అనతికాలంలోనే ప్రేక్షకులకు ఇష్టమైన నటుడిగా మారిపోయారు. సిద్ధు పలు చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించినప్పటికీ.. ముఖ్యంగా ఆయన నటించిన ‘డీజే టిల్లు’ చిత్రం కల్ట్ స్టేటస్ సాధించింది. ఆ సినిమాలో సిద్ధు పలికిన “అట్లుంటది మనతోని”, “నువ్వు అడుగుతున్నావా రాధిక” వంటి మాటలు.. సోషల్ మీడియాలో మీమ్స్గా మారడమే కాకుండా, నిజ జీవితంలో యువత రోజువారీ సంభాషణలుగానూ మారిపోయాయి. అంతలా ‘డీజే టిల్లు’ చిత్రం, అందులోని సిద్ధు పాత్ర ప్రేక్షకులపై ప్రభావం చూపాయి.
ఐకానిక్ క్యారెక్టర్ ‘టిల్లు’తో ప్రేక్షకులను మరోసారి అలరించాలని నిర్ణయించుకున్న సిద్ధు జొన్నలగడ్డ.. ‘డీజే టిల్లు’ చిత్రానికి కొనసాగింపుగా ‘టిల్లు స్క్వేర్’ చేస్తున్నారు. ఈ సినిమా ప్రకటన వచ్చినప్పటి నుంచి.. టిల్లుని, అతని చేష్టలను తిరిగి వెండితెరపై చూడటం కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చిత్ర బృందం ఈ సినిమా నుంచి ఇప్పటికే “టికెట్టే కొనకుండా”, “రాధిక” పాటలను విడుదల చేయగా.. రెండు పాటలూ విశేషంగా ఆకట్టుకొని, చార్ట్బస్టర్లుగా నిలిచాయి.
ఫిబ్రవరి 7న సిద్ధు జొన్నలగడ్డ పుట్టినరోజు సందర్భంగా, చిత్ర బృందం ఈ సినిమా నుండి స్పెషల్ బర్త్డే గ్లింప్స్ను విడుదల చేసింది. రాత్రి సమయంలో కారు నడుపుతూ తన పక్కనే ఉన్న లిల్లీ(అనుపమ పరమేశ్వరన్) నుండి టిల్లు ముద్దును పొందడం మనం గ్లింప్స్ లో చూడవచ్చు. అతని గత పుట్టినరోజు గురించి లిల్లీ అడుగగా.. రాధికతో జరిగినప్పటి సంఘటనలను టిల్లు గుర్తు చేసుకోవడం ఆకట్టుకుంది.
అయితే రాధికతో జరిగిన విషయాల గురించి టిల్లు పూర్తిగా చెప్పకుండా తనదైన హాస్య పద్ధతిలో సింపుల్ గా ముగించాడు. అలాగే ఆ విషయం అతనికి బాధ కలిగిస్తుంది కాబట్టి.. దాని గురించి ఇక ప్రశ్నలు అడగవద్దని లిల్లీని కోరతాడు. మొత్తానికి వీరి మధ్య సంభాషణ ఎంతో వినోదభరితంగా సాగింది. టిల్లుగా సిద్ధు జొన్నలగడ్డ తనకు మాత్రమే సాధ్యమైన రీతిలో మరోసారి డైలాగులతో మ్యాజిక్ చేశాడు.
ఈ గ్లింప్స్ లో అనుపమ పరమేశ్వరన్ గతంలో కంటే చాలా అందంగా, మరింత గ్లామరస్గా కనిపిస్తుంది. మొత్తానికి ఈ గ్లింప్స్ మునుపటి చిత్రం ‘డీజే టిల్లు’లో జరిగిన విషయాలను గుర్తు చేయడమే కాకుండా, ‘టిల్లు స్క్వేర్’ ఎలా ఉండబోతుందనే ఆసక్తిని కూడా కలిగిస్తోంది. ఈ సినిమా ట్రైలర్ ప్రేమికుల దినోత్సవం కానుకగా ఫిబ్రవరి 14న విడుదల కానుంది.
ప్రముఖ స్వరకర్త ఎస్ థమన్ ఈ చిత్రానికి నేపథ్య సంగీతం సమకూరుస్తున్నారు. మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. ఈ చిత్రానికి రామ్ మిరియాల, అచ్చు రాజమణి సంగీతం అందిస్తుండగా, సాయి ప్రకాష్ ఉమ్మడిసింగు సినిమాటోగ్రఫీ బాధ్యతలు చూస్తున్నారు. నవీన్ నూలి ఈ చిత్రానికి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం 2024, మార్చి 29న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది.
ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు: హీరోయిన్ వర్ష
యంగ్ ట్యాలెంటెడ్ సందీప్ కిషన్ మ్యాజికల్ ఫాంటసీ అడ్వెంచర్ మూవీ ‘ఊరు పేరు భైరవకోన’. విఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. కావ్య థాపర్, వర్ష బొల్లమ్మ కథానాయికలుగా నటించారు. హాస్య మూవీస్ బ్యానర్పై రాజేష్ దండా లావిష్ స్కేల్ లో నిర్మించారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్పై అనిల్ సుంకర సగర్వంగా సమర్పిస్తున్నారు. బాలాజీ గుత్తా ఈ చిత్రానికి సహ నిర్మాత. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులలో హ్యుజ్ బజ్ను క్రియేట్ చేశాయి. ఈ చిత్రం ఫిబ్రవరి16న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపధ్యంలో హీరోయిన్ వర్ష బొల్లమ్మ ‘ఊరు పేరు భైరవకోన’ విశేషాలని విలేకరుల సమావేశంలో పంచుకున్నారు.
‘ఊరు పేరు భైరవకోన’ ప్రాజెక్ట్ లోకి ఎలా వచ్చారు ?
దర్శకుడు విఐ ఆనంద్ గారు ఈ కథ చెప్పారు. నాకు చాలా కొత్తగా, అద్భుతంగా అనిపించింది. అసలు ఇలాంటి కథ ఎలా అలోచించగలిగారో అనిపించింది. ఇలాంటి పాత్ర గతంలో ఎప్పుడూ చేయలేదు. చేయగలనా? లేదా? అని ఆలోచించుకోవడానికి కొంత సమయం అడిగాను. తర్వాత ఆనంద్ గారు కంప్లీట్ నేరేషన్ ఇచ్చారు. అది విగానే చాలా ఆనందంగా అనిపించింది. చేయగలననే నమ్మకం కుదిరింది.
‘ఊరు పేరు భైరవకోన’ లో మీ పాత్ర గురించి ?
ఇందులో భూమి అనే పాత్రలో కనిపిస్తాను. భూమి ట్రైబల్ గర్ల్. తన వూర్లో తనొక్కరే చదువుకున్న అమ్మాయి. చూడటానికి అందంగా అమాయకంగా కనిపిస్తుంది. తప్పుని నిలదీసే ధైర్యం వున్న అమ్మాయి. ఆ పాత్ర బలం సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకులకు అర్ధమౌతుంది. స్వాతిముత్యం, మిడిల్ క్లాస్ మేలోడీస్ చిత్రాల్లో గర్ల్ నెక్స్ట్ డోర్ పాత్రల్లో కనిపించాను. ఇందులో మాత్రం గర్ల్ నెక్స్ట్ ఫారెస్ట్ పాత్ర అనాలి(నవ్వుతూ). ట్రైలర్ లో చూస్తే నాకు ఒక యాక్షన్ సీన్ వుంటుంది. భూమి పాత్రలో చాలా స్ట్రెంత్, పవర్ వుంది.
ట్రైబల్ పాత్ర చేశారు కదా.. ఎలాంటి సవాళ్ళు ఎదుర్కున్నారు ?
నేను హిల్ స్టేషన్(కూర్గ్) నుంచి వచ్చాను. ప్రక్రుతి జీవితంలో ఒక భాగం. నిజ జీవితంలో కూడా మేము చెట్లు, నదులు, కొండలు, జంతువులని ఆరాధిస్తాం. ఆ రకంగా భూమి పాత్ర నేను రిలేట్ చేసుకునే విధంగా వుంది.
సందీప్ కిషన్ తో వర్క్ చేయడం ఎలా అనిపించింది ?
సందీప్ కిషన్ గారు అందరిని చాలా గౌరవంతో చూస్తారు. ప్రతి ఒక్కరితో ఎంతో ఆప్యాయంగా మాట్లాడతారు. ఆయన దయగల మనిషి. మంచి హ్యూమన్ బీయింగ్. గ్రేట్ కో స్టార్.
విఐ అనంద్ సినిమాలు చూశారా? ఈ పాత్రకు మిమ్మల్నే ఎంపిక చేయడానికి కారణం ఏమిటని అడిగారా ?
‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ సినిమా చూశాను. చాలా నచ్చింది. అందులో అన్ని ఎలిమెంట్స్ ని చాలా అద్భుతంగా చూపించారు. ఆయనతో వర్క్ చేయడం చాలా ఎక్సయిటింగా అనిపించింది. ఈ కథ రాసినప్పుడే భూమి పాత్రకు నాపేరుని రాసుకున్నారని తెలిసి చాలా ఆనందంగా అనిపించింది.
‘ఊరు పేరు భైరవకోన’ ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని ఇస్తుంది ?
‘ఊరు పేరు భైరవకోన’ అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్. ప్రేక్షకుడు ఎడ్జ్ అఫ్ ది సీట్ థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ ని ఇస్తుంది. అద్భుతమైన సూపర్ నేచురల్ ఎలిమెంట్స్ వున్నాయి. ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తారు. అలాగే ఇందులో చాలా మంచి సందేశం కూడా వుంది.
ఏకే ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్ నిర్మాతల గురించి ?
-ఏకే ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్ చాలా ప్యాషనేట్ ప్రొడ్యూసర్స్. సినిమాని చాలా గ్రాండ్ నిర్మించారు. రాజేష్ గారు చాలా కూల్ గా వుంటారు. సినిమాకి కావాల్సిన ప్రతిది ఎక్కడా రాజీపడకుండా సమకూర్చారు.
పాత్రల ఎంపికలో చాలా పర్టిక్యులర్ గా వుంటారు కదా?
-నిడివి తక్కువ వునప్పటికీ సినిమాలో ప్రాధాన్యత వున్న పాత్రలని చేయడానికే ఆసక్తిని చూపిస్తాను. ఇప్పటివరకూ నేను చేసిన పాత్రలన్నీ అలా వచ్చినవే.
మీ అప్ కమింగ్ మూవీస్?
-ఒక మంచి ప్రాజెక్ట్ చేస్తున్నాను. దాని గురించి నిర్మాతలు త్వరలో తెలియజేస్తారు. తెలుగు తమిళ్ మలయాళంలో చిత్రాలు చేశాను. త్వరలో కన్నడలో కూడా చేసే అవకాశం వుంది.
ఎవరి ప్రోద్బలంతో శివబాలకృష్ణ ఏసీబీకి సహకరించట్లేదు?
* బాలకృష్ణ కేసులో ముగిసిన సోదాలు
* అక్రమాస్తుల విలువ రూ.75 కోట్లు పైమాటే
* 32 లక్షల వాచ్లు.. 2 కిలోల బంగారం గుర్తింపు
* అనుమతులిచ్చిన ఫైళ్లన్నీ ఏసీబీ పరిశీలన
* ఎవరెవరికి రెరా అనుమతులు వెంటనే జారీ?
హెచ్ఎండీఏ మాజీ ప్లానింగ్ డైరెక్టర్ శివ బాలకృష్ణ ఇంట్లో అవినీతి నిరోధక శాఖ అధికారుల సోదాలు ముగిశాయని ఏసీబీ జాయింట్ డైరెక్టర్ సుధీంద్ర వెల్లడించారు. ప్రస్తుతం మెట్రో రైల్ ప్లానింగ్ ఆఫీసర్, రెరా సెక్రటరీగా శివ బాలక్రిష్ణ పని చేస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లు గుర్తించినట్లు చెప్పారు. ఆయన ఇంట్లో రూ. 84.60 లక్షల నగదు, 2 కేజీలు బంగారం, 5.5 కేజీల వెండి, 32 లక్షలు విలువ చేసే వాచ్ లు, 3 విల్లాలు, 3 ఫ్లాట్స్, 90 ఏకరాల భూమి గుర్తించారు. భూమి ఆయన పేరుతో పాటు బినామీల పేరుపై ఉన్నట్లు గుర్తించారు. మొత్తం ప్రాపర్టీస్ వ్యాల్యు రూ. 75 కోట్ల మార్కెట్ విలువ ఉంటుంది. ఈ సోదాలు ఇంకో నాలుగు చోట్ల కొనసాగుతున్నాయి. శివ బాల కృష్ణపై కేసు నమోదు చేసి, రేపు న్యాయస్థానం ముందు హాజరు పరుస్తం.. తదుపరి కస్టడీకి తీసుకుంటాం.. కొన్ని విషయాలు ఆయన చెప్పలేదని.. విచారణకు సహకరించ లేదని ఏసీబీ అధికారులు అంటున్నారు. ఆయన్ని కస్టడీకి తీసుకుంటే మరిన్ని విషయాలు తెలిసే అవకాశముంది.
శివ బాలకృష్ణ అరెస్ట్ తో HMDA లో పని చేస్తున్న మిగతా అధికారుల్లో టెన్షన్ నెలకొంది. హెచ్ఎండీఏ పరిధి ఏడు జిల్లాల్లో విస్తరించి ఉండగా.. గతంలో అనుమతుల ఇచ్చిన ఫైల్స్ అన్నింటిని పరిశీలించే యోచనలో ఏసీబీ ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో హైరేజ్ అపార్ట్మెంట్స్ కి అనుమతుల్లో వారు భారీగా లంచాలు పొందినట్లుగా ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు. ఎన్నికల కోడ్ రెండు రోజుల ముందు భారీ ఎత్తున లాండ్ కన్జర్వేషన్ జరిగిందని తెలుస్తోంది. ఉప్పల్ లో శివ బాలకృష్ణ సోదరి ఇంట్లో కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. శివ బాలకృష్ణ సోదరి, ఇద్దరు కొడుకులు హెచ్ఎండీఏలో శివ బాలక్రిష్ణ దగ్గరే పని చేశారు. శివ బాలకృష్ణ బినామీ లుగా ఉన్నట్లుగా గుర్తించారు. హైరైస్ బిల్డింగ్ జోన్ పరిధిలోకి భూముల మార్పు జరిగిందని భావిస్తున్నారు. ఉస్మాన్ సాగర్ పరిధిలో సైతం భారీగా భూ మార్పిడి జరిగిందని సమాచారం.. ఆ రెండు రోజుల్లో రూ. 200 కోట్ల భూములు చేతులు మారినట్టు ఏసీబీ గుర్తించింది. కొన్ని నిర్మాణాలకు ఆయన ఒకట్రెండు రోజుల్లోనే రెరా క్లియరెన్స్ ఇచ్చినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.
ఆపరేషన్ ఆరోగ్య శ్రీ
* ప్రైవేట్ ఆస్పత్రులపై రేవంత్ మాస్టర్ ప్లాన్
(టీఎస్ న్యూస్, హైదరాబాద్)
వేల కోట్లను బిల్లుల రూపంలో తీసుకుంటున్న ప్రైవేట్ ఆస్పత్రులపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. ప్రస్తుతం ఆరోగ్య శ్రీకి సంబంధించిన బిల్లులు విడుదల చేయడంలో ప్రభుత్వ ఆస్పత్రులకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రైవేట్ నుంచి వచ్చే బిల్లులను పెండింగ్లో పెడుతున్నారు. దీనికి తోడుగా ఎల్ఓసీలను సైతం నిమ్స్కు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంటే ప్రైవేట్ ఆస్పత్రుల నుంచి వచ్చే ఎల్ఓసీలను అక్కడి ఆస్పత్రులు అనుమతించడం లేదు. దీంతో మంత్రుల నుంచి ఎల్ఓసీ లేఖలు ఆగిపోయాయి. అయితే, ఆరోగ్య శ్రీ సేవలపై రేవంత్ సర్కారు ఎందుకింత నిర్ణయం తీసుకున్నదనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. దీనిలో కీలక కోణం సచివాలయ వర్గాల ద్వారా ప్రచారం జరుగుతున్నది.
అందుకేనా..?
రాష్ట్రంలోని కార్పొరేట్ స్థాయిలో ఉన్న ప్రైవేట్ ఆస్పత్రులన్నీ బీఆర్ఎస్కు అనుకూలంగా ఉండే వారి చేతుల్లోనే ఉన్నాయి. ఓ మాజీ ఎంపీకి చెందిన ఆస్పత్రులకే వందల కోట్ల బిల్లులు వెళ్తున్నాయి. ఇలా జిల్లాల్లో కూడా బీఆర్ఎస్ నేతలకు సంబంధించిన ఆస్పత్రులున్నాయి. దీంతో రేవంత్ సర్కారు కీలక నిర్ణయం తీసుకున్నది. ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆరోగ్య శ్రీ సేవలను తగ్గించేందుకు ప్లాన్ వేసింది. ఎందుకంటే వందల కోట్లు బిల్లులు తీసుకుంటున్న బీఆర్ఎస్ నేతలకు ఆర్థిక ఆదాయానికి బ్రేక్ వేసినట్లు అవుతుందని భావిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వ ఆస్పత్రులకు వెను వెంటనే బిల్లులు ఇస్తే.. ఇక్కడ వైద్య సేవలు పెరుగుతాయని, తద్వారా ఇచ్చే బిల్లులు కూడా మళ్లీ ప్రభుత్వ ఖజానాకే వస్తాయని అంచనా వేస్తున్నారు. దీంతో ఒకే బుల్లెట్.. రెండు ప్రాణాలు అన్నట్టుగా ఆరోగ్య శ్రీ రూపంలో కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ నేతల ఆదాయానికి కూడా వ్రేక్ వేస్తున్నట్లుగా మారింది.
ఉపాసనకే ఈర్ష్య… ఎందుకబ్బా?
మెగా కోడలు, రామ్చరణ్ భార్య అంతేకాక కామినేని వారి ఇంటి ఆడబిడ్డ ఉపాసన. ఎప్పుడూ ఏ లోటు లేకుండా పెరిగింది. ఆమె కోరుకోవడమే తరువాయి క్షణాల్లో ఆమె ముందు.అలాంటి ఉపాసన ఒక విషయాన్ని చూసి ఈర్ష్య పడుతుందట. ఎందుకబ్బా అని ఆలోచిస్తున్నారా.. అదేమిటంటే ఈ విషయం వింటే అందరూ ఆశ్చర్యపోవాల్సిందే మరి. తాజాగా ఒక చిట్ చాట్ లో ఉపాసన తన భర్త రామ్ చరణ్ మరియు కూతురు క్లీంకార మధ్య ఉండే అనుబంధం గురించి మాట్లాడింది. వారిద్దరి మధ్య ఉండే బంధాన్ని చూస్తుంటే నాకు ఎంతో ఈర్ష్యగా ఉంటుంది.
క్లీంకార తన తండ్రి చరణ్ ను చూడగానే నవ్వుతూ ఉంటుంది. చరణ్ ను చూడగానే క్లీంకార కళ్లు మెరిసి పోతాయి అంటూ ఉపాసన చెప్పుకొచ్చింది. రామ్ చరణ్, ఉపాసన పెళ్లి అయిన తర్వాత పదేళ్లకు క్లీంకార కి జన్మనిచ్చిన విషయం తెల్సిందే. ఈ మెగా వారసురాలు రాకతో చిరంజీవి ఫ్యామిలీ లో ఆనందం వెల్లివిరిసింది. క్లీంకార పుట్టిన తర్వాత ఉపాసన మరియు రామ్ చరణ్ ల జీవన శైలి చాలా మారిందట. మొత్తానికి మెగా ఫ్యామిలీ లో క్లీంకార చాలా స్పెషల్. ఇప్పటి వరకు క్లీంకార ఫేస్ ను అధికారికంగా రివీల్ చేయకుండా ఉంచారు. మెగా ఫ్యాన్స్ తో పాటు తెలుగు ప్రేక్షకులు అంతా కూడా క్లీంకార ఫేస్ ను ఎప్పుడెప్పుడు చూస్తామా అన్నట్లుగా ఎదురు చూస్తున్నారు.
అప్పుడు స్మిత.. ఇప్పుడు అమ్రపాలి.. సర్కారులో కీ రోల్
టీఎస్ న్యూస్: ప్రభుత్వంలో మహిళా ఐఏఎస్లు ఏదో ఓ సందర్భంలో కీలక పాత్రను పోషిస్తున్నారు. ఒక్కో గవర్నమెంట్లో ఒక్కొక్కరిది స్పెషల్ గా మారింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఓ ఐఏఎస్ అధికారిణి సెంటర్ పాయింట్గా వ్యవహరిస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వంలో మరో అధికారిణి అదే స్థానంలో కూర్చున్నారు. అప్పుడు కూడా తమకు అనుకూల అధికారులకు పెద్దపీట వేయగా.. ఇప్పుడూ అదే జరుగుతున్నది. ఈ పరిణామాలు ప్రభుత్వ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి.
స్మితా సబర్వాల్ స్పెషల్
బీఆర్ఎస్ప్రభుత్వ హయాంలో ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్సీఎంఓలో కీలక స్థానంలో కొనసాగారు. కీలకమైన శాఖలకు ముఖ్య కార్యదర్శిగా వ్యవహరించారు. గతంలో స్మితా సబర్వాల్పై ఓ ఇంగ్లీష్ పత్రికలో ఒక కార్జున్ వస్తే.. దానిపై లీగల్ పోరాటం చేసిన స్మితా సబర్వాల్కు అప్పటి ప్రభుత్వం సపోర్ట్గా నిలిచింది. అంతేకాదు.. కోర్టు ఖర్చులన్నీ కూడా ప్రభుత్వమే భరించింది. అంతేకాకుండా కీలకమైన పోస్టింగ్ల్లో కూడా స్మితా సబర్వాలు చెప్పిందే ఫైనల్ అన్నట్టుగా మారింది. కిందిస్థాయి ఉద్యోగుల పోస్టింగ్ల్లో కూడా ఈ ఐఏఎస్ అధికారిణి ఇష్టానుసారంగా వ్యవహరించారనే విమర్శలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఓ డిప్యూటీ తహసీల్దార్.. రాత్రి సమయంలో స్మితా సబర్వాల్ ఇంటికి వెళ్లాడంటూ గతంలో కేసు కూడా నమోదైంది. ఇలా ప్రభుత్వంలో కీ రోల్ పోషించిన ఆమెను ప్రస్తుతం ఫైనాన్స్ కమిషన్ మెంబర్ సెక్రెటరీగా నియమించిన విషయం తెలిసిందే.
ఇప్పుడు అమ్రపాలి
ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో అమ్రపాలి హవా మొదలైందని ఉన్నతాధికారుల్లో చర్చ సాగుతున్నది. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో అధికారుల మార్పుల నేపథ్యంలో కొంతమందికి కీలక పోస్టులను అప్పగిస్తున్నారు. అయితే, ఢిల్లీలోని ప్రధాన మంత్రి కార్యాలయంలో పీఎంవో సెక్రటరీగా పని చేస్తున్న అమ్రపాలికి రేవంత్ సర్కార్ హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్ గా కీలక బాధ్యతలు అప్పగించింది. దాంతో పాటు మూసీ డెవలప్మెంట్ సంస్థ ఇన్ చార్జి ఎండీ గా కూడా అమ్రపాలికి అదనపు బాధ్యతలను అప్పగించింది. ఈ కీలక బాధ్యతలు చేపట్టిన అమ్రపాలి ఆంధ్రప్రదేశ్ ఆడపడుచు కావడం విశేషం.
* ఏపీలోని ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలు నగర శివారులోని నరసాపురం అగ్రహాంకు చెందిన అమ్రపాలి ఇప్పుడు రేవంత్ సర్కారులో సెంటర్ పాయింట్. గతంలో అమ్రపాలి వికారాబాద్ సబ్ కలెక్టర్ గా, రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ గా, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ గా పని చేశారు. అమ్రపాలి తండ్రి కాటా వెంకట రెడ్డి ఆంధ్రా యూనివర్శిటీలో ఎకనమిక్స్ ప్రొఫెసర్ గా పని చేశారు. అమ్రపాలి కుటుంబంలో అందరూ ఉన్నతాధికారులే. ఆమె సోదరి మానస గంగోత్రి ఐఆర్ఎస్ అధికారిణి. ప్రస్తుతం ఆమె కర్ణాటక కేడర్ లో ఇన్ కంట్యాక్స్ విభాగంలో పని చేస్తున్నారు. ఆమె భర్త ప్రవీణ్ కుమార్ తమిళనాడుకు కేడర్ కు చెందిన 2010 ఐపీఎస్ అధికారి. ప్రస్తుతం ఉమెన్ వెల్ఫేర్ లో డైరెక్టర్ గా పని చేస్తున్నారు.
* అమ్రపాలి భర్త జమ్మూ పట్టణానికి చెందిన షమీర్ శర్మ 2011 ఐపీఎస్ బ్యాచ్ అధికారి. ప్రస్తుతం ఆయన డామన్ డయ్యూ కేంద్ర పాలిత ప్రాంతంలో ఎస్పీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తాజాగా ఐఏఎస్ అమ్రపాలికి ప్రభుత్వం మరో కీలక బాధ్యతలు కట్టబెట్టింది. ప్రస్తుతం హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్గా.. ఐటీ అండ్ ఎస్టేట్తో పాటు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ఎండీగా అమ్రపాలి ఉన్నారు. రెండు రోజుల కిందట హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ (హెచ్జీసీఎల్) మేనేజింగ్ డైరెక్టర్, అవుటర్ రింగ్రోడ్డు ప్రాజెక్టు డైరెక్టర్గా అదనపు బాధ్యతలను అప్పగించారు.