దీటుగా బదులిచ్చిన భారత్
పహల్గాంలో జరిగిన ఉగ్ర దాడితో భారత్, పాకిస్థాన్ల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ సరిహద్దుల్లో దాయాది సైన్యం కవ్వింపు చర్యలకు దిగింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి మరి జమ్ముకశ్మీర్లోని నియంత్రణ రేఖ వెంబడి, పలు ప్రాంతాల్లో పాక్ సైన్యం కాల్పులకు తెగబడ్డాయి. ఈ దాడిని భారత్ ఆర్మీ దీటుగా బదులిచ్చినట్లు సైనిక వర్గాలు తెలిపాయి. గురువారం అర్ధరాత్రి నుంచి ఈ కాల్పులు జరుగుతున్నట్లు పేర్కొన్నాయి. అయితే ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని, ఎవరికీ గాయాలు కాలేదని ఆర్మీ అధికారి ఒకరు వెల్లడించారు. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
బందిపొరాలో ఎన్కౌంటర్
మరోవైపు, జమ్ముకశ్మీర్లోని బందిపొరాలో ఎన్కౌంటర్ జరిగింది. శుక్రవారం ఉగ్రవాదులతో జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు భద్రతా సిబ్బంది గాయపడ్డారు. ఈ జిల్లాలోని కుల్నార్ బజిపొరా ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కినట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం రావడం వల్ల భద్రతా సిబ్బంది సెర్చ్ ఆపరేషన్ను చేపట్టారు. ఈక్రమంలో జవాన్లుపై ముష్కరులు కాల్పులు జరిపారు. దీంతో భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులకు దిగారు. ప్రస్తుతం ఇక్కడ
జమ్ముకశ్మీర్ పర్యటనకు భారత్ ఆర్మీ చీఫ్
ఇదిలా ఉండగా, ఉద్రిక్తతల నేపథ్యంలో భారత సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది శుక్రవారం శ్రీనగర్, ఉదమ్పూర్లో పర్యటించనున్నారు. కశ్మీర్ లోయలోని ఆర్మీ కమాండర్లు, ఇతర భద్రతా ఏజెన్సీల ప్రతినిధులతో భేటీ కానున్నారు. ప్రస్తుతం నియంత్రణ రేఖ వెంబడి ఉన్న పరిస్థితులపై సమీక్షించనున్నారు. సరిహద్దుల వద్ద కాల్పుల విరమణ, పహల్గాం దాడి నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. పహల్గాంలో ఏప్రిల్ 22న పర్యటకులపై జరిపిన ఉగ్రవాదులు దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. పాక్తో దౌత్య సంబంధాలకు సంబంధించి భారత్ కీలక నిర్ణయాలు తీసుకుంది. పాక్దౌత్యవేత్తకు సమన్లు జారీ చేయడం, సింధూ జలాల ఒప్పందం అమలును నిలిపివేయడం, పాకిస్థాన్కు సంబంధించి అన్నీ వీసాలపై వేటు, అంతేకాకుండా దాయాది పౌరులను తక్షణమే భారత్ విడిచివెళ్లాలని ఆదేశించింది.