పహల్గాం ఉగ్రదాడితో భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇరు దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్న వేళ పాకిస్థాన్ ప్రధానికి సంబంధించిన ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. భారత్లో పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్, ఆ దేశ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుటుంబానికి ఇండియాలో ఇష్టమైన గ్రామం ఒకటి ఉంది. పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ కుటుంబానికి భారత్లోని పంజాబ్తో ప్రత్యేక సంబంధం ఉంది. వాళ్ల పూర్వీకుల గ్రామం అమృత్సర్లోని జాతి ఉమ్రా. మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్, ప్రస్తుత ప్రధాని షెహబాజ్ షరీఫ్ల పూర్వీకుల మూలాలు జాతి ఉమ్రా గ్రామంలో ఉన్నాయి. అది అమృత్సర్ నుంచి 35-40కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆ విలేజ్ అంటే షరీఫ్ కుటుంబానికి అమితమైన ఇష్టమని స్థానికులు అంటున్నారు. కానీ, ప్రస్తుత ఉద్రిక్తల వేళ తాము సంతోషంగా లేమని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
షరీఫ్ కుంటుంబ సభ్యులు జాతి ఉమ్రాలో ఉండేవారని, వారిని అందరూ చాలా గౌరవించేవారని స్థానికులు చెబుతున్నారు. జాతి ఉమ్రా గ్రామంలో ఉన్న షరీఫ్ పూర్వీకుల ఇల్లు ఇప్పుడు ఒక గురుద్వార్గా మారిందని, అందులో ఒక లంగర్ హాల్ కూడా నిర్మిస్తున్నట్లు స్థానికుడు హర్దీప్ సింగ్ తెలిపారు. ‘తొలుత అక్కడ షరీఫ్ కుటుంబానికి చెందిన ఓ పెద్ద హవేలీ(భవనం) ఉండేది. దీనిని 1976లో నవాజ్ షరీఫ్ సోదరుడు అబ్బాస్ షరీఫ్ మా గ్రామానికి విరాళంగా ఇచ్చారు. ఆయన ఒక వ్యాపారవేత్త. తరచూ ఈ ప్రాంతానికి వచ్చేవారు. 2013లోనే ఆయన మరణించారు. అప్పట్లో హవేలీ పక్కనే చిన్న గురుద్వార్ ఉండేది. గ్రామస్థుల విరాళాలతో దీనిని అభివృద్ధి చేసుకున్నాం’ అని హర్దీప్ సింగ్ అన్నారు.
ఈ పేరుతోనే పాక్లో మరో గ్రామం
షరీఫ్ కుటుంబానికి ఈ గ్రామం మీద ప్రేమ ఇంకా ఉందని స్థానికులు అంటున్నారు. పాకిస్థాన్లో కూడా ఇదే పేరుతో జాతీఉమ్రా అనే గ్రామాన్ని ఏర్పాటు చేేశారు. ఇక నవాజ్ షరీఫ్ పూర్వీకుల సమాధులు కూడా అమృత్సర్లోని జాతీఉమ్రాలో ఇంకా అలాగే ఉన్నాయని స్థానికులు తెలిపారు. ఈ గ్రామంలో షరీఫ్ కుటుంబానికి చెందిన భవనాలు, ఆస్తులు ఉన్నాయి. నవాజ్ షరీఫ్ మనవడు జైద్ హుస్సేన్ నవాజ్ వివాహం కూడా ఇక్కడే జరిగింది. చాలా కాలం పాటు గ్రామస్థులు వారి కుటుంబంతో సంబంధాలు కొనసాగించారు. కాలక్రమేణా ఇరు దేశాల మధ్య కఠినమైన పరిస్థితులు ఎదురుకావడం వల్ల సంబంధాలు నిలిచిపోయాయి. అయితే ఇప్పటికీ ఆ కుటుంబానికి చెందిన ఎవరో ఒకరు వస్తూ పోతూనే ఉంటారు స్థానికులు చెబుతున్నారు.
‘అలా చేస్తే మాకు సిగ్గుగా అనిపిస్తోంది’
రెండు దేశాల మధ్య మంచి సంబంధాలు ఉండాలని హర్దీప్ సింగ్ అశాభావం వ్యక్తం చేశారు. ‘ భారత్-పాక్ మధ్య వ్యాపార సంబంధాలు మెరుగవ్వాలి. షరీఫ్ కుటుంబం గ్రామానికి చాలా చేసింది. గ్రామస్థుల అభ్యర్థనపై 2013లో స్టేడియం నిర్మించారు. షరీఫ్ కుటుంబ నుంచి ఎవరైనా ప్రధాని, సీఎం ఇలా ముఖ్యమైన పదవులు చేపడితే మాకు చాలా గర్వంగా ఉంటుంది. కానీ ఏదైనా తప్పు జరిగినప్పుడు ‘మీ గ్రామానికి చెందిన ప్రధాని ఎందుకు అలా చేస్తున్నారు’ అని అన్నప్పుడు మాకు సిగ్గుగా అనిపిస్తుంది. భారత్పై ఇలా మిసైల్స్, బాంబులు వేస్తే, నష్టం మాత్రమే కాదు పాకిస్థాన్ను ఆ దేశమే దెబ్బ తీసుకోవడమే అవుతుంది, ఎందుకంటే వారి గ్రామం ఇక్కడే ఉంది. షరీఫ్ కుటుంబానికి కూడా నష్టం జరుగుతుంది. అందుకే రెండు దేశాల మధ్య శాంతి అవసరం. యుద్ధం ఎప్పటికీ సమస్యలకు పరిష్కారం కాదు’ అని హార్దిప్ సింగ్ అన్నారు.