భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరాయి. పాకిస్థాన్ వాయుసేనకు (పీఏఎఫ్) చెందిన అత్యాధునిక F-16 సుపర్సోనిక్ యుద్ధ విమానాన్ని భారత ఉపరితలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే క్షిపణి (SAM) రక్షణ వ్యవస్థ సాయంతో కూల్చివేసినట్లు ఎన్డీటీవీ వర్గాలు వెల్లడించాయి.
పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో ఉన్న కీలకమైన, అత్యంత పటిష్ఠమైన భద్రత కలిగిన సర్ఘోదా వైమానిక స్థావరం నుంచి ఈ F-16 విమానం గాల్లోకి లేచిన కొద్దిసేపటికే, స్థావరం సమీపంలోనే భారత క్షిపణి దానిని కూల్చివేసినట్లు సమాచారం. 1971 యుద్ధం తర్వాత ఇరు దేశాల మధ్య ఇంత పెద్ద ఎత్తున ఉద్రిక్తతలు తలెత్తడం ఇదే తొలిసారని రక్షణ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో అంతర్జాతీయ సరిహద్దు వెంబడి రాజస్థాన్లోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేసి, బ్లాక్అవుట్ విధించారు.
జమ్మూను డ్రోన్లు, క్షిపణులతో లక్ష్యంగా చేసుకోవాలన్న పాకిస్థాన్ కుట్ర విఫలమైన నేపథ్యంలో ఈ ప్రధాన ఘటన జరిగింది. జమ్మూలోని ఆర్ఎస్ పురా, అర్నియా, సాంబా, హీరానగర్ సెక్టార్లలో పాకిస్థాన్ దళాలు భారీగా ఫిరంగి దాడులకు తెగబడ్డాయి. అలాగే, అంతర్జాతీయ సరిహద్దుకు సమీపంలో ఉన్న పంజాబ్లోని పఠాన్కోట్పైనా పాక్ నుంచి తీవ్రస్థాయిలో కాల్పులు జరిగాయి. పఠాన్కోట్ వ్యూహాత్మకంగా భారత్కు కీలకమైన ప్రాంతం కావడం గమనార్హం. సరిహద్దు వెంబడి పాకిస్థాన్ డ్రోన్ల చొరబాట్లను భారత వాయు రక్షణ వ్యవస్థలు విజయవంతంగా అడ్డుకున్నాయి.