జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన భీకర ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఈ నేపథ్యంలోనే టర్కీ పాకిస్తాన్కు ఆయుధాలు, మందుగుండు సామగ్రిని సరఫరా చేస్తోందని కొన్ని నివేదికలు వెలువడ్డాయి. టర్కిష్ ఎయిర్ ఫోర్స్కు చెందిన C-130E హెర్క్యులస్ కార్గో విమానం ఏప్రిల్ 27న కరాచీలో ల్యాండ్ అయినట్లు, ఇస్లామాబాద్లోని ఒక సైనిక స్థావరంలో ఆరు C-130E విమానాలు దిగినట్లు వార్తలు వచ్చాయి. ఈ విమానాలు సైనిక సామగ్రి, మందుగుండు సామగ్రిని రవాణా చేస్తున్నాయని పేర్కొన్నాయి. ఈ నివేదికలు భారత్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ క్రమంలోనే వీటిని టర్కీ ప్రభుత్వం ఖండించింది.
టర్కీ ప్రెసిడెన్సీ కమ్యూనికేషన్స్ డైరెక్టరేట్ ఈ వార్తలను తిరస్కరిస్తూ, కార్గో విమానం కేవలం ఇంధనం నింపే ప్రయోజనాల కోసం పాకిస్తాన్లో దిగినట్లు స్పష్టం చేసింది. పాకిస్తాన్కు ఆయుధాలతో నిండిన ఆరు విమానాలను టర్కీ పంపుతోందని’ కొన్ని మీడియా సంస్థలు, సోషల్ మీడియా పోస్టులు ప్రచారం చేసిన వాదనలు అబద్ధమని టర్కిష్ రక్షణ శాఖ సోషల్ మీడియా పోస్ట్లో తెలిపింది. ఈ స్పష్టీకరణ తర్వాత, ఈ వార్తలపై వివాదం కొంత తగ్గినప్పటికీ, భారత్-టర్కీ సంబంధాలపై ఈ ఆరోపణలు ప్రభావం చూపుతాయని అనిపిస్తుంది. కానీ టర్కీ, పాకిస్తాన్ మధ్య దీర్ఘకాల స్నేహం ఉంది. ఇది సైనిక, ఆర్థిక, రాజకీయ సహకారంపై ఆధారపడి ఉంది. గతంలో, టర్కీ పాకిస్తాన్కు సైనిక సామగ్రి, ఆయుధాలను సరఫరా చేసిన సందర్భాలు ఉన్నాయి.
కఠిన చర్యలు
ఈ దాడి తర్వాత, భారత ప్రభుత్వం కఠిన చర్యలకు దిగింది. సింధు జల ఒప్పందం (1960)ను నిలిపివేసింది, అట్టారీ-వాఘా సరిహద్దును మూసివేసింది. పాకిస్తాన్ దౌత్యవేత్తలను బహిష్కరించింది. అన్ని రకాల పాకిస్తాన్ వీసాలను రద్దు చేసి, పాకిస్తాన్ పౌరులను 72 గంటల్లో దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది. పాకిస్తాన్ కూడా తన వైమానిక స్థలాన్ని భారత విమానయాన సంస్థలకు మూసివేయడం, వాణిజ్యాన్ని నిలిపివేయడం, సిమ్లా ఒప్పందాన్ని పునఃపరిశీలించడం వంటి ప్రతిఘటన చర్యలకు దిగింది.