సోమవారం ప్రెస్మీట్లో దిల్ రాజు మాట్లాడుతూ .. ‘‘కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సి ఉంది కాబట్టి, ఈ ప్రెస్మీట్ ఏర్పాటు చేశా. అసలైన విషయం పక్కదారి పట్టకుండా వివాదాస్పద ప్రశ్నలకు తావులేకుండా దీన్ని కొనసాగిద్దాం. పర్సంటేజ్ల విషయంలో ఎగ్జిబిటర్లకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఏప్రిల్లో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కొందరు ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఈ అంశాన్ని మా దృష్టికి తీసుకొచ్చారు. వాళ్ల కష్టాలు మాకు తెలుసు. గత ఆరు నెలలుగా వస్తున్న రెవెన్యూ గురించి ఈ సందర్భంగా వారిని అడిగాం. పర్సంటేజ్ విధానం ఉంటే బాగుంటుందని వారు చెప్పారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో రెంట్ ఆర్ పర్సంటేజ్ విధానం నడుస్తోంది. మొదటి వారం బాగా రెవెన్యూ వస్తే, రెంట్ ఇస్తున్నాం. సెకండ్ వీక్ కలెక్షన్లు తగ్గగానే పర్సంటేజ్ ఇస్తున్నా. అది వాళ్లకు కష్టమైనదే. అది మా అందరికీ తెలుసు. దీనిపై చర్చిస్తున్నాం. కానీ, ఓ కొలిక్కి రాలేదు’’ అని అన్నారు. సరిగ్గా అదే సమయంలో ‘హరి హర వీరమల్లు’ విడుదల తేదీని ప్రకటించారని, ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల అది వాయిదా పడిందని, తర్వాత డేట్ను వాళ్లు లాక్ చేయలేదని దిల్ రాజు అన్నారు. పర్సంటేజ్ సమస్య ఈస్ట్ గోదావరి నుంచి మొదలై నైజాంకు కూడా వచ్చిందని, నైజాంలో 370 సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఉంటే, ఎస్వీసీఎస్ సహా మా వద్ద ఉన్న థియేటర్లు 30 మాత్రమే అని, ఏషియన్, సురేశ్ కంపెనీలో 90 ఉన్నాయని, 250 థియేటర్లు ఓనర్లు, వాళ్లకు సంబంధించిన వాళ్లు మాత్రమే నడుపుతున్నారని సెటైర్ వేశారు. ‘ఆ నలుగురు’ అంటూ మీడియా ఇష్టం వచ్చినట్లు రాస్తోందని ఈ విషయంలో క్లారిటీ ఇస్తున్నానని, వ్యక్తిగతంగా దాడి చేస్తున్నారని అని దిల్ రాజు అగ్రహం వ్యక్తం చేశారు.
అంత దమ్ము ఎవరికీ లేదు
‘‘పర్సంటేజ్ అంశం తెలంగాణకు వచ్చినప్పుడు ఇక్కడి ఎగ్జిబిటర్లు దానిని శిరీష్ దృష్టికి తీసుకొచ్చారని, 20 ఏళ్ల నుంచి ఆ ఎగ్జిబిటర్లతో వ్యాపారం అనుబంధం ఉందని దిల్ రాజు వెల్లడించారు. ఎగ్జిబిటర్లకు ఏం కావాలో అడగటం తప్పు లేదని, మే 18న జరిగిన ఛాంబర్ మీటింగ్లో ఏం జరిగిందో తెలియకుండానే మీడియా వార్తలను ప్రచురించిందన్నారు. జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ చేస్తామని ఎగ్జిబిటర్లు చెబితే వద్దని వారించానని, ఛాంబర్కు వాళ్లు పర్సంటేజీ విషయంలో లేఖ రాశారని, వాళ్లు అనుకున్నది జరగపోతే బంద్ చేస్తామనేది కేవలం ఆలోచన మాత్రమే అని అన్నారు. ఎగ్జిబిటర్ల నిర్ణయంపై వచ్చిన వార్తలను ఖండించడం తప్పే అని, కొవిడ్ సమయంలో తప్ప ఎప్పుడు థియేటర్లు మూతపడలేదన్నారు. 56 రోజులు పరిశ్రమలో షూటింగ్ ఆపేసి ఏం సాధించలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. నిర్మాతలందరం ఎగ్జిబిటర్ల సమస్యలపై చర్చించామని, ‘హరిహర వీరమల్లు’ విషయంలో తప్పుగా వెళ్లిందని దిల్ రాజు వివరించారు. పవన్కల్యాణ్ సినిమాలను ఆపే దమ్ము, ధైర్యం ఎవరికీ లేదని, మంత్రి దుర్గేష్ ఫోన్ చేస్తే థియేటర్లు మూసివేయరని స్పష్టంగా చెప్పా అని పేర్కొన్నారు. తప్పుడుగా సమాచారం వచ్చిందని ఆయనకు వివరించానని, జూన్ నెలంతా పెద్ద సినిమాలున్నాయని, ఈ సమయంలో సినీ పరిశ్రమను ఎలా కాపాడుకోవాలనేదే అందరి తపన అని దిల్ రాజు సూచించారు.