ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, సినీ నటుడు పవన్ కళ్యాణ్ హైదరాబాద్ శివారు సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ హైదరాబాద్ ను సందర్శించారు. తన చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ అడ్మిషన్ కోసమే ఆయన స్కూలును సందర్శించినట్లు తెలిసింది. మార్క్ శంకర్ గతంలో సింగపూర్లోని ఒక స్కూల్లో చదివేవాడు. అయితే ఇటీవల అక్కడ జరిగిన అగ్నిప్రమాదంలో మార్క్ గాయపడిన విషయం తెలిసిందే.
ఈ ఘటన తర్వాత మార్క్ శంకర్ను హైదరాబాద్కు తీసుకువచ్చి ఇక్కడే చదివించాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ తన కుమార్తె అంజనాతో కలిసి ఐఎస్హెచ్ స్కూల్ను సందర్శించారు. అక్కడ పాఠశాల సౌకర్యాలు, సిలబస్, విద్యార్థులకు అందించే వసతుల గురించి టీచర్లతో మాట్లాడి ఆరా తీసినట్లు సమాచారం. అడ్మిషన్ విషయమై స్కూలును సందర్శించినప్పటికీ మార్క్ శంకర్ను ఇదే పాఠశాలలో చేర్చనున్నారని పవన్ కళ్యాణ్ అధికారికంగా ప్రకటించలేదు. పవన్ పర్యటన సందర్భంగా తెలంగాణ పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇక్రిశాట్ స్కూల్ ప్రత్యేకతలు..
ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ హైదరాబాద్ విషయానికొస్తే. ఇది పటాన్చెరువులోని ఇక్రిశాట్ క్యాంపస్లో ఉంది. ఈ పాఠశాల 1981లో స్థాపించబడింది. ఇక్రిశాట్ ట్రస్ట్ దీనిని నిర్వహిస్తుంది. విశాలమైన ఇక్రిశాట్ క్యాంపస్లోని 10 ఎకరాల విస్తీర్ణంలో ఈ స్కూల్ ఉంది. ఇందులో మ్యూజియం, వెదర్ స్టేషన్ వంటివి కూడా ఉన్నాయి. కౌన్సిల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ , న్యూ ఇంగ్లాండ్ అసోసియేషన్ ఆఫ్ స్కూల్స్ అండ్ కాలేజెస్ ద్వారా ఈ స్కూల్ అంతర్జాతీయంగా గుర్తింపు పొందింది. ప్రీ- ప్రైమరీ నుంచి 12వ తరగతి వరకు బోధన అందిస్తున్నారు. ప్రస్తుతం 22కి పైగా దేశాల నుంచి 400 మందికి పైగా విద్యార్థులు ఈ స్కూల్లో ఉన్నారు. ఇందులో ఎక్కువ మంది విదేశీయులే ఉంటారు.
ఆధునిక బోధనా సామాగ్రి, డిజిటల్ క్లాస్రూంలు, సైన్స్, కంప్యూటర్ ల్యాబ్లు, అతిపెద్ద గ్రంథాలయం, కళలు, సంగీత స్టూడియోలు, స్విమ్మింగ్ పూల్, టెన్నిస్ కోర్టులు, ఫుట్బాల్ మైదానాలు, క్రికెట్ పిచ్, క్రాస్ కంట్రీ రన్నింగ్, సైక్లింగ్ ప్రాంతం వంటి క్రీడా సౌకర్యాలు అందిస్తున్నారు. ఇక్రిశాట్ క్యాంపస్కు ప్రత్యేక భద్రతా సిబ్బంది, సీసీటీవీ పర్యవేక్షణ, సొంత అగ్నిమాపక కేంద్రం, పూర్తిస్థాయి వైద్యులు ఉన్న వైద్య యూనిట్ ఉన్నాయి. టాలీవుడ్ హీరోలు మహేష్ బాబు, అల్లు అర్జున్ వంటి ఇతర సినీ ప్రముఖుల పిల్లలు కూడా ఈ పాఠశాలలోనే చదువుకున్నట్లు తెలిసింది.