-
రాజీవ్గాంధీపై కెటిఆర్ వ్యాఖ్యలు ఆయన అవివేకానికి నిదర్శనం
-
పిసిసి అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్
మాజీ ప్రధాని రాజీవ్గాంధీ గురించి కెటిఆర్ చేసిన వ్యాఖ్యలు ఆయన అవివేకానికి నిదర్శనమని పిసిసి అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. సోమవారం టిపిసిసి చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కెటిఆర్ చేసిన వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు. రాజీవ్ గాంధీ ఈ దేశం కోసం అహర్నిశలు పాటు పడటమే కాకుండా ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన వ్యక్తి అని ఆయన గుర్తుచేశారు. గాంధీ కుటుంబం త్యాగాలపై కెటిఆర్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. పదేళ్లు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ తెలంగాణ తల్లి పేరు మీద ఏ రకమైన పనులు చేసిందో అర్థం చేసుకోవాలన్నారు. తెలంగాణ వాదులను అవమానించేలా వారి పరిపాలన సాగిందన్నారు. తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు విషయంలో తమకు ఓ స్పష్టమైన అవగాహన ఉందన్నారు. విగ్రహ ఏర్పాటును రాద్ధాంతం చేయడం, రాజీవ్ను కించపరిచేలా మాట్లాడటం చదువుకున్నానని చెప్పుకునే కెటిఆర్కు ఇది తగదని ఆయన హితవు పలికారు.
బిఆర్ఎస్ హయాంలో అమరవీరుల స్థూపం కడితే అక్కడ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రాణత్యాగం చేసిన ఏ ఒక్క అమరవీరుడి పేరైనా దానిపై ఉందా? అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ సెంటిమెంట్ను అడుగడుగునా కాలరాసిందే కెసిఆర్ కుటుంబమని ఆయన ఆరోపించారు. నిజంగా మీరు తెలంగాణ సెంటిమెంట్ను కాపాడి ఉంటే, అమరుల ఆకాంక్షలను నెరవేర్చి ఉంటే ప్రజలు మిమ్మల్ని ఎందుకు గద్దె దించుతారని ఆయన ప్రశ్నించారు. బిఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ నేతలు కలలు కంటుంటే ఆశ్చర్యం వేస్తోందని ఆయన ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో బిఆర్ఎస్ పని అయిపోయిందన్నారు. బిజెపితో లోపాయికారి ఒప్పందంలో ఉన్న బిఆర్ఎస్ గురించి ప్రజలకు తెలిసిపోయిందని మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.