ఇంజినీరింగ్, ఫార్మా, అగ్రికల్చర్ విభాగాల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఈఏపీసెట్ షెడ్యూల్ ఖరారైంది. సెట్ నిర్వహణపై సమావేశం నిర్వహించిన అనంతరం జేఎన్టీయూ హైదరాబాద్, ఉన్నత విద్యా మండలి సంయుక్తంగా షెడ్యూల్ని ప్రకటించాయి. ఫిబ్రవరి 20వ తేదీన నోటిఫికేషన్ ఇచ్చి 25వ తేదీ నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఆలస్య రుసుము లేకుండా ఏప్రిల్ 4 వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఏప్రిల్ 29, 30 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాలకు, మే 2వ తేదీ నుంచి 5వ తేదీ వరకు ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు.
సెట్ నిర్వహణకు సంబంధించి జేఎన్టీయూ హైదరాబాద్లో తొలి సమావేశం సోమవారం నిర్వహించారు. ఇందులో ఉన్నత విద్యా మండలి ఛైర్మన్, సెట్ కమిటీ ఛైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి, ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి, ఉన్నత విద్యా మండలి సెక్రటరీ శ్రీరాం వెంకటేశ్, కన్వీనర్ డీన్ కుమార్ సహా పలువురు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈఏపీసెట్కి 100శాతం సిలబస్ ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సరాల నుంచి తీసుకోవాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు.
ప్రాక్టికల్ పరీక్షలు షురూ
మార్చి 5వ తేదీ నుంచి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, 6 నుంచి సెకండ్ ఇయర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈరోజు నుంచి సెకండ్ ఇయర్ ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతున్నాయి. ఈసారి హాల్టికెట్లను విద్యార్థుల ఫోన్లకే పంపించారు. విద్యార్థులు ఇచ్చిన ఫోన్ నంబరుకు నేరుగా హాల్టికెట్ లింకును ఇంటర్ బోర్డు పంపిస్తుంది. ఆ లింకు ద్వారా హల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఏవైనా సమస్యలు ఎదురైతే కాలేజీలో తెలియజేయాలని సూచించారు.