తెలంగాణ పీపుల్స్ జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ హరగోపాల్
రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఫార్మా సిటీ, ఫ్యూచర్ సిటీని రద్దు చేయాలని ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు. తెలంగాణ పీపుల్స్ జేఏసీ ఆధ్వర్యంలో ప్రజా సంఘాల ప్రతినిధులు ఫార్మా సిటీ గ్రామాల్లో నిజ నిర్ధారణ కమిటీ ప్రతినిధులు పర్యటించి ఇక్కడ జరుగుతున్న విషయాలు తెలుసుకునేందుకు వొచ్చారు. ఇక్కడి పొలాలు, ఊర్లు, వ్యవసాయం తీరును పరిశీలించి రైతులతో, రైతు కూలీలతో మాట్లాడి ఇక్కడి పరిస్థితులు తెలుసుకున్నారు. అనంతరం కోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా ఫెన్సింగ్ వేసిన ప్రాంతాలు సందర్శించారు. ఈసందర్భంగా మీడియాతో ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ.. ఇంత సుభిక్షమైన ప్రాంతంలో ఏదో పేరు చెప్పి కంపెనీలు తెస్తామంటూ ప్రజల భూములు లాక్కుని వారిని రోడ్డున పడేయటం అన్యాయమని అన్నారు.
డాక్టర్ వనమాల మాట్లాడుతూ పటాన్ చెరు ప్రాంతం కాన్సర్ మయమైందని, ఇక్కడ ఇంత స్వచ్ఛమైన వాతావరణంలో బతుకుతున్న వారి మధ్య కాలుష్య కంపెనీలు పెట్టడం దారుణమని అన్నారు. అడ్వకేట్ సాదిక్ అలీ మాట్లాడుతూ ఒక పక్క రాజ్యాంగాన్ని రక్షిస్తామని రాహుల్ గాంధీ అంటున్నారని, మరి వారి ముఖ్య మంత్రి మాత్రం రాజ్యాంగ విరుద్ధంగా కోర్టు ఆర్డర్లని ధిక్కరిస్తూ భూములకి ఫెన్సింగ్ వేయిస్తున్నారని . ఇది ఎంత వరకు సమంజసం? అని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలిమిటి ? ఇప్పుడు చేస్తున్నాదేమిటి? అని రవి కన్నెగంటి ప్రశ్నించారు. 2013 చట్టం తెస్తాం.. ఫార్మా సిటీ రద్దు చేస్తామన్నారు.. కానీ అవేమీ చేయకుండా ప్రజలని మోసం చేస్తున్నారని విమర్శించారు.
మీరా సంఘ మిత్ర మాట్లాడుతూ 2013 భూసేకరణ చట్టం తెచ్చింది కాంగ్రెస్ పార్టీనే. మరి ఇప్పుడు అధికారంలోకి వొచ్చాక తిరిగి ఆ చట్టం తేవటం చాలా తేలిక, అది వారి చేతిలో పని. కానీ ఆలా చేయకుండా, ఇది వరకు ఫార్మా కోసం తీసుకున్న భూములు ఫ్యూచర్ సిటీకి మార్చటం చట్ట వ్యతిరేకమని అన్నారు. ప్రజలకి పూర్తి వివరాలు ఇవ్వకుండా, భయపెట్టి భూములు లాక్కుని, భూసేకరణ జరిగిపోయిందనటం కరెక్ట్ కాదన్నారు. ఇది అసలు నిజమైన భూసేకరణ కాదని అన్నారు. ఏపీసీఆర్ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ ఉస్మాన్ మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రజలని ఇలా మోసం చేయటం తగదని, వారు ప్రజలకి న్యాయం చేయాలని, వెంటనే ఫ్యూచర్ సిటీ ప్రతిపాదన విరమించుకుని, భూసేకరణ రద్దు చేయాలని కోరారు.
కార్యక్రమంలో ప్రొఫెసర్ హరగోపాల్ (కన్వీనర్, తెలంగాణ పీపుల్స్ జేఏసీ) రవి కన్నెగంటి (కో కన్వీనర్ (తెలంగాణ పీపుల్స్ జేఏసీ ) డాక్టర్. వనమాల (విశ్రాంత ప్రొఫెసర్ ) మీరా సంఘ మిత్ర (ప్రజా ఉద్యమాల జాతీయ వేదిక ), అడ్వకేట్ సాదిక్ అలీ , వై.అశోక్ కుమార్, బి.కొండల్ రెడ్డి, రవిచంద్ర, (తెలంగాణ పీపుల్స్ జేఏసీ ), డాక్టర్. ఉస్మాన్ (అసోసియేషన్ ఫర్ ప్రొటెక్షన్ అఫ్ సివిల్ రైట్స్ ), నర్సింహ (మానవ హక్కుల వేదిక ), జ్యోతి, శ్రీదేవి (చైతన్య మహిళా సంఘం). ప్రొఫెసర్ విజయ్ (సెంట్రల్ యూనివర్సిటీ )తదితరులు పాల్గొన్నారు.