గోదావరి-కావేరీ నదుల అనుసంధానం అంశంలో మళ్లీ కదలిక వచ్చింది. దీనిపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు లేవనెత్తిన అభ్యంతరాలపై వచ్చేనెల 24వ తేదీ ఉదయం 11:30 గంటలకు హైదరాబాద్లోని ఎర్రమంజిల్లోని జల సౌధలో సమావేశం జరుగనున్నది. కేంద్ర జల వనరుల సంఘం (సీడబ్ల్యూసీ) చైర్మన్ ఆధ్వర్యంలో జరిగే ఈ భేటీలో జాతీయ నీటి అభివృద్ధి సంస్థ (ఎన్డబ్ల్యూడీఏ) నదుల అనుసంధాన టాస్క్ఫోర్స్ కమిటీ కూడా పాల్గొంటుంది. ఇప్పటి వరకూ పోలవరం ప్రాజెక్టు నుంచే గోదావరి-కావేరీ అనుసంధానం చేపట్టాలని పదే పదే పట్టు బట్టిన ఏపీ.. తాజాగా రూట్ మార్చింది. రూ.80,112 కోట్ల అంచనా వ్యయంతో పోలవరం నుంచి 200 టీఎంసీల నీటిని తరలించేందుకు కొత్తగా గోదావరి-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టును తెర మీదకు తెచ్చిన ఏపీ.. దీని నిర్మాణానికి 2014- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలోని 46(2), 46(3) సెక్షన్ల కింద వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కింద నిధులు కేటాయించాలని కోరుతోంది. గోదావరి-బనకచర్ల అనుసంధానంలో భాగంగా పల్నాడు జిల్లా బొల్లాపల్లిలో నిర్మించనున్న 200 టీఎంసీల సామర్థ్యం గల రిజర్వాయర్ నుంచి గోదావరి-కావేరీ అనుసంధానం చేపట్టి కావేరీ బేసిన్కు నీటిని తరలించే ప్రతిపాదన పరిశీలించాలని కేంద్రాన్ని ఏపీ కోరింది. ఇప్పటి వరకూ సమ్మక్క సాగర్ నుంచి గోదావరి – కావేరీ అనుసంధానానికి ఎన్డబ్ల్యూడీఏతోపాటు కేంద్ర జలశక్తిశాఖ మొగ్గు చూపుతున్న నేపథ్యంలో ఏపీ ప్రతిపాదన నేపథ్యంలో జూన్ 24న జరిగే సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది.
తెలంగాణ అభ్యంతరం
గోదావరి-కావేరీ అనుసంధానంలో భాగంగా తరలించే 148 టీఎంసీల్లో 74 (50ు) టీఎంసీల నీటిని తమకు కేటాయించాలని తెలంగాణ కోరుతున్నది. ఉమ్మడి నల్లగొండ జిల్లా గొట్టిముక్కల ఎగువన వ్యాలీలపై 2 రిజర్వాయర్లు నిర్మించడంతోపాటు వాటికి సమ్మక్క బ్యారేజీ నుంచి నీటిని వాడుకోవడానికి వెసులుబాటు కల్పించాలని వాదిస్తోంది. మరోవైపు, కృష్ణా జలాల పంపిణీపై ట్రైబ్యునల్ విచారణలో నీటి వాటాలు తేలిన తర్వాతే గోదావరి-కావేరీ లింక్లో నాగార్జున సాగర్ రిజర్వాయర్ను ఆన్లైన్ రిజర్వాయర్ (బ్యాలెన్సింగ్ రిజర్వాయర్)గా వినియోగించుకోవాలని ప్రతిపాదించింది. 83 మీటర్ల ఎత్తులో ఉన్న సమ్మక్క బ్యారేజీలో 83-87 మీటర్ల మధ్య నిల్వ చేసిన నీటిని మాత్రమే గోదావరి-కావేరీ అనుసంధానం కింద తరలించాలని తెలంగాణ సూచించింది. 83 మీటర్ల దిగువన ఉన్న నీటిని ముట్టుకోరాదని కూడా స్పష్టం చేసింది. సమ్మక్క బ్యారేజీ కింద 50 టీఎంసీలు, సీతారామ ఎత్తిపోతల పథకం/ సీతమ్మ సాగర్ బహుళార్ధ సాధక ప్రాజెక్టు కింద 70 టీఎంసీలు, దేవాదులలో 38 టీఎంసీలను కలుపుకుని 158 టీఎంసీల అవసరాలకు అనుగుణంగా నీటి వినియోగానికి తమకు రక్షణ కల్పించాలని తెలంగాణ మరో ప్రతిపాదన చేసింది. ఇక గోదావరి- కావేరీ అనుసంధాన ప్రక్రియలో సమ్మక్క బ్యారేజీ కన్వేయర్ను వినియోగించుకోవాలని సూచించింది.
మా ప్రతిపాదన ఆమోదించాలి
పోలవరం-కృష్ణా-పెన్నార్-కావేరీ లింక్ పేరిట గోదావరి-కావేరీ అనుసంధాన ప్రాజెక్టును చేపట్టాలని ఏపీ ప్రతిపాదించింది. 14 ఏళ్ల క్రితం రూపొందించిన గోదావరి-కావేరీ అనుసంధాన ప్రాజెక్టు డీపీఆర్ను పక్కన బెట్టి తమ ప్రతిపాదనలను ఆమోదించాలని వ్యాఖ్యానించింది. గోదావరి-కావేరీ అనుసంధాన ప్రాజెక్టుపై అధ్యయనం పూర్తయిందని గుర్తు చేసిన ఏపీ.. దాన్ని పల్నాడు జిల్లాలో గోదావరి-బనకచర్ల అనుసంధాన బొల్లాపల్లి రిజర్వాయర్ నుంచి చేపట్టాలని కోరింది.