ఏపీ నుంచి హైదరాబాద్కు కోట్ల రూపాయల్లో డ్రగ్స్ సరఫరా చేసి విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర గ్యాంగ్ ఆట కట్టించారు సైబరాబాద్ పోలీసులు. ఏపీలోనని బాపట్ల జిల్లా అద్దంకి నుంచి హైదరాబాద్కు రెండు కోట్ల విలువైన డ్రగ్స్ తరలించి, విక్రయిస్తుండగా సైబరాబాద్ SOT పోలీసులకు నిందితులు చిక్కారు. ఐదుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు వారి వద్ద నుంచి 2 కోట్ల రూపాయల విలువైన 840 గ్రాముల కొకైన్, ఎఫిడ్రిన్, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్స్ దందాను నడిపిస్తున్నది కానిస్టేబుల్ అని తెలుసుకున్న పోలీసులు షాక్ అయ్యారు. ప్రస్తుతం కానిస్టేబుల్ పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు.
డ్రగ్స్ దందా నడిపిస్తున్న కానిస్టేబుల్
తిరుపతికి చెందిన గుణశేఖర్ ఏపీలో కానిస్టేబుల్ గా చేస్తున్నాడు. బాపట్ల జిల్లా కర్లపాలెం మండలానికి చెందిన కాంట్రాక్టర్ దొంతి రెడ్డి హరిబాబు రెడ్డి, తిరుపతి రూరల్ ప్రాంతానికి చెందిన పున్నం సురేంద్ర, అద్దంకి చెందిన ఫాస్ట్ ఫుడ్ నిర్వాహకురాలు చేగుడు మెర్సీ మార్గరెట్, దేవరాజు ఏసుబాబు, షేక్ మస్తాన్ వలీలతో కానిస్టేబుల్ గుణశేఖర్ కలిసి ఓ గ్యాంగ్ గా ఏర్పడ్డారు. ఎప్పట్లాగే కొందరు వ్యక్తుల ద్వారా డ్రగ్స్ కొనుగోలు చేశాడు. ఆ డ్రగ్స్ను ఏపీ నుంచి హైదరాబాదుకు తరలించి విక్రయించాలనుకున్నారు. 840 గ్రాముల కొకైన్, ఎఫెక్ట్ డ్రీమ్ బాపట్ల జిల్లా అద్దంకి నుంచి కూకట్పల్లికి తరలించారు. అల్విన్ కాలనీలోని ఓ హోటల్ దగ్గర డ్రగ్స్ విక్రయించడానికి నిందితులు ప్లాన్ చేశారు. సమాచారం అందుకున్న సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు అక్కడికి చేరుకొని వారిని అదుపులోకి తీసుకున్నారు. తనిఖీ చేయగా వారి వద్ద రూ.2 కోట్ల విలువ చేసే కొకైన్, ఎఫిడ్రిన్ ఉన్నట్లు గుర్తించారు. ఐదుగురు నిందితులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ డ్రగ్స్ గ్యాంగ్ లీడర్ అయిన కానిస్టేబుల్ గుణశేఖర్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. త్వరలోనే అతన్ని అరెస్ట్ చేస్తామని చెప్పారు.