- సంతాపం తెలిపిన ప్రపంచ నేతలు
- ప్రధాని మోదీ, తెలుగు రాష్ట్రాల సిఎంల సంతాపం
వాటికన్ సిటీలో పోప్ ఫ్రాన్సిస్ సోమవారం ఉదయం మృతి చెందారు. కేథలిక్ల అత్యున్నత మత గురువు పోప్ ఫ్రాన్సిస్ (88) ఇటలీ కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 7.35కు కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా శ్వాసకోశ సమస్యలు, డబుల్ న్యూమోనియా, కిడ్నీ సమస్యలతో తీవ్రంగా బాధపడ్డారు. ఫిబ్రవరి 14 నుంచి ఆయన 38 రోజుల పాటు హాస్పిటల్లో చికిత్స పొందిన అనంతరం గత నెల డిశ్చార్జి అయ్యారు. ఆయన మృతి విషయాన్ని వాటికన్ వర్గాలు ధ్రువీకరించాయి. 2013లో పోప్ బెనిడెక్ట్ తర్వాత ఫ్రాన్సిస్ ఈ బాధ్యతలు చేపట్టారు. ఫ్రాన్సిస్ 1938లో అర్జెంటీనాలో జన్మించారు. దక్షిణ అమెరికా నుంచి ఈ పదవిని అందుకొన్న తొలి వ్యక్తి ఆయనే. తరచూ సామాజిక అంశాలపై కూడా పోప్ వ్యాఖ్యలు చేస్తుంటారు.
2016లో రోమ్ బయట ఇతర మతానికి చెందిన శరణార్థుల పాదాలు కడిగారు. దీనిని ఆయన వినయం, సేవాతత్పరతకు చిహ్నంగా భావిస్తారు. పోప్ ఫ్రాన్సిస్ తన మరణానికి కొన్ని గంటల ముందు కూడా ఈస్టర్ పర్వదినాన భక్తులకు సందేశం ఇచ్చారు. సంక్షోభాలతో రగులుతున్న గాజా, ఉక్రెయిన్, కాంగో, మయన్మార్లలో శాంతి నెలకొనాలని ఆకాంక్షించారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తన భార్య ఉషతో కలిసి ఈస్టర్ సందర్భంగా పోప్ను కలిశారు.
ఆదివారం జరిగిన ఈస్టర్ వేడుకల్లో సైతం ఆయన పాల్గొన్నారు పోప్ ఫ్రాన్సిస్ తన 12 ఏళ్ల వయస్సు నుంచే చర్చి, సమాజం, అట్టడుగు వర్గాల కోసం అంకితభావంతో పని చేశారు. 1936,డిసెంబర్ 17వ తేదీన అర్జెరటీనాలో పోప్ ఫ్రాన్సిస్ జన్మించారు. 2013 మార్చి 13న 266వ పోప్గా ఫ్రాన్సిస్ ఎంపికయ్యారు. ఆయన మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పోప్ ఫ్రాన్సిస్ మృతికి ఆయన సంతాపాన్ని తెలిపారు. ఆయన మరణం తనను తీవ్రంగా కలత పెట్టిందన్నారు. భారత ప్రజలపై పోప్ ఫ్రాన్సిస్ ప్రేమాభిమానాలు నిత్యం నిలిచి ఉంటాయని ఆయన వ్యాఖ్యానించారు.
కాగా పోప్ ఫ్రాన్సిస్ మృతి నన్ను ఎంతో బాధించిందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. . ఆధ్యాత్మిక నాయకుడిగా కోట్ల మందిలో స్ఫూర్తి నింపారు. శాంతి సందేశంగా నిలిచారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున ప్రపంచ క్యాథలిక్ కమ్యూనిటీకి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.