వైసీపీ నేత, ప్రముఖ నటుడు పోసాని కృష్ణమురళి అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసులపై పోసానికి స్వల్ప ఉపశమనం లభించింది. ఐదు కేసులను కొట్టివేయాలంటూ పోసాని దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై గురువారంనాడు కోర్టు విచారణ జరిపింది. చంద్రబాబు, నారా లోకేశ్, పవన్ కల్యాణ్ తో పాటు వారి కుటుంబాలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పోసానిపై ఆదోని పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
పోసానిపై విశాఖ, చిత్తూరు జిల్లాల్లో నమోదైన కేసులకు సంబంధించి తొందరపాటు చర్యలు తీసుకోవద్దంటూ పోలీసులను ఏపీ హైకోర్టు ఆదేశించింది. ఈమేరకు తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. అదేవిధంగా పోసానిపై ఆదోని పోలీసుల పీటీ వారెంట్ అమలైనందున పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. పాతపట్నం, అనంతపురం పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల్లో విచారణను కోర్టు మధ్యాహ్నానికి వాయిదా వేసింది.
పోసాని కృష్ణ మురళిపై రాష్ట్రవ్యాప్తంగా వివిధ పోలీసు స్టేషన్లలో 17కు పైగా కేసులు నమోదయ్యాయి. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీసు స్టేషన్లో నమోదైన కేసుకు సంబంధించి పోలీసులు పోసానిని ఫిబ్రవరి 26న అరెస్ట్ చేశారు. అనంతరం రైల్వే కొడూరు మేజిస్ట్రేట్ రిమాండ్ విధించడంతో రాజంపేట సబ్ జైలుకు తరలించారు.