-
కులగణనతోనే రాష్ట్రంలో బలహీన వర్గాలకు పదవులు
-
బలహీన వర్గాల గురించి సిఎం రేవంత్ రెడ్డి ఆలోచించాలి
-
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపి వి.హనుమంత రావు
కులగణనతోనే రాష్ట్రంలో బలహీన వర్గాలకు పదవులు వస్తాయని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపి వి.హనుమంత రావు అన్నారు. సోమవారం ఆయన గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడుతూ బలహీన వర్గాల గురించి సిఎం రేవంత్ రెడ్డి ఆలోచించాలని ఆయన కోరారు. రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి అయితేనే దేశంలో బలహీన వర్గాలకు నిజమైన న్యాయం జరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సచివాలయం ఎదుట ఏర్పాటు చేసిన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని కూలుస్తామని కొందరు బిఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారని, అలాంటి పిచ్చి ఆలోచనలు ఉంటే ఇప్పుడే మానుకోవాలని విహెచ్ వార్నింగ్ ఇచ్చారు.అధికారం కోల్పోయేసరికి బిఆర్ఎస్ నేతల్లో ఎవరికీ మైండ్ పనిచేయడం లేదని సీరియస్ అయ్యారు.
ప్రతిపక్ష పార్టీ ఏదైనా ఉంటే ప్రజా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని కానీ, ఇక్కడ అందుకు విరుద్ధంగా బిఆర్ఎస్ పార్టీ తీరు ఉందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు తరిమేసినా ఆ పార్టీ నేతలకు బుద్ధి రావడం లేదని ఆయన మండిపడ్డారు. అసలు రాష్ట్రంలో ఫిరాయింపులు మొదలు పెట్టిందే బిఆర్ఎస్ అని ఆయన గుర్తుచేశారు. కెసిఆర్ హయాంలో కాంగ్రెస్, టిడిపి ఎమ్మెల్యేలను బిఆర్ఎస్లో చేర్చుకున్నారని ఆయన అన్నారు. అప్పుడు కౌశిక్ రెడ్డి ఎక్కడ ఉన్నారు, ఏం చేశారని విహెచ్ ప్రశ్నించారు. అనంతరం కోఠి మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు పెట్టాలని సిఎం నిర్ణయం తీసుకోవడాన్ని స్వాగతిస్తున్నట్లు ఆయన చెప్పారు.