దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, శ్రవణ్ కుమార్ లను భారత్ కు రప్పించేందుకు లైన్ క్లియర్ అయింది. ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసినట్లు ఇంటర్ పోల్ బుధవారం కీలక ప్రకటన చేసింది. దీనికి సంబంధించి ఇంటర్ పోల్ ద్వారా సీబీఐ నుంచి తెలంగాణ సీఐడీకి సమాచారం అందింది. ఇంటర్ పోల్ చొరవతో ప్రభాకర్ రావు, శ్రవణ్ కుమార్ లను వీలైనంత త్వరగా భారత్ కు ఇద్దరిని రప్పించేందుకు హైదరాబాద్ పోలీసులు కేంద్ర హోం శాఖతో పాటు విదేశీ వ్యవహారాల శాఖతో సంప్రదింపులు ముమ్మరం చేశారు. ప్రభాకర్ రావు, శ్రవణ్ రావుల గురించి అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్) కు సమాచారం అందగానే అమెరికాలో ప్రొవిజనల్ అరెస్ట్ చేసే అవకాశం ఉంది. అమెరికా నుంచి నిందితులు డిపోర్టేషన్ ప్రక్రియ ద్వారా భారత్ కు పంపించే అవకాశం ఉంది. అయితే, గతేడాది మార్చి 10వ తేదీన పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైన వెంటనే వీరిద్దరూ విదేశాలకు పారిపోయారు. ఈ కేసు విచారణ ముందుకు సాగాలన్నా.. ఈ కేసులో రాజకీయ నేతల ప్రమేయంపై ఆధారాలు బహిర్గతం కావాలన్నా వారిని విచారించాల్సిన అవసరం ఉందని పోలీసులు తెలిపారు. వారిని ఎప్పటిలోగా అరెస్ట్ చేస్తారంటూ ఇటీవల కోర్టు ప్రశ్నించడంతో అందుబాటులో ఉన్న అన్ని మార్గాలపై పోలీసులు ప్రత్యేకంగా నిఘా పెట్టారు.