Saturday, April 12, 2025

మీడియాకు లీకు చేస్తున్నారు – ప్రణీత్​రావు

  • మీడియాకు లీకు చేస్తున్నారు
  • దర్యాప్తు అంశాలకు బయటకు ఇస్తున్నారు
  • నా కస్టడీ నిబంధనలకు విరుద్ధం
  • నిద్ర పోవడానికి కూడా సౌకర్యం లేదు
  • హైకోర్టులో ఫోన్​ ట్యాపింగ్​ నిందితుడు ప్రణీత్​రావు పిటిషన్​
  • విచారణ చేపట్టిన హైకోర్టు
  • గురువారం తీర్పు

టీఎస్​, న్యూస్​ :ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు, ఎస్‌ఐబీ మాజీ డీఎస్‌పీ ప్రణీత్‌రావు రావు వేసిన పిటిషన్‌పై హైకోర్టులో బుధవారం వాదనలు ముగిశాయి. పోలీస్ కస్టడీకి ఇస్తూ కిందిస్థాయి కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ ప్రణీత్ రావు హైకోర్టులో పిటిషన్‌ వేయగా.. బుధవారం మధ్యాహ్నం విచారణకు వచ్చింది. ఇరువురి వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. హైకోర్టు ధర్మాసనం దీనిపై గురువారం తీర్పును ప్రకటించనుంది. పోలీసులు చాలా నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారని, తాను పడుకోవడానికి కూడా సరైన సౌకర్యాలు కల్పించడం లేదంటూ ప్రణీత్​రావు కోర్టులో పిటిషన్​ దాఖలు చేశారు.

మీడియాకు లీకులు ఇస్తున్నారు

తనను రహస్యంగా విచారణ చేస్తున్నామని పోలీసులు చెప్తున్నారని, కానీ, దర్యాప్తులోని ప్రతి అంశాలను మీడియాకు లీక్ చేస్తున్నారని ప్రణీత్​రావు మంగళవారం దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఎందుకు లీక్ చేస్తున్నారో అందరికీ తెలిసిన విషయమేనని అన్నారు. రహస్యం పేరుతో బంజారాహిల్స్ పీఎస్‌లో విచారిస్తున్నారని, బంధువులు, న్యాయవాదిని కూడా అనుమతించడం లేదని కోర్టుకు విన్నవించారు. వాస్తవాంశాలను పరిగణలోకి తీసుకోకుండా కిందికోర్టు కస్టడీకి ఇచ్చిందని ప్రణీత్‌ రావు తన పిటిషన్‌లో వెల్లడించారు. కస్టడీ సమయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించలేదని, పోలీస్ స్టేషన్‌లో నిద్రపోవడానికి సరైన సౌకర్యాలు కూడా లేవని వెల్లడించారు. విచారణ పూర్తైన తర్వాత తిరిగి జైలుకు తరలించేలా ఆదేశాలివ్వాలన్నారు. ఇంటరాగేషన్‌లో ఏఎస్పీ డి.రమేశ్ పాల్గొనకుండా నియంత్రించాలని కోరారు. ఇప్పటికే సమాచారం అందించినందున కస్టడీ రద్దు చేయాలని ప్రణీత్ రావు పిటిషన్‌లో పేర్కొన్నారు.

ప్రణీత్‌ రావు న్యాయవాది గండ్ర మోహన్ రావు వాదనలు

ఎలాంటి ఆధారాలు లేకుండా ప్రణీత్ రావును అక్రమంగా అరెస్ట్ చేశారని న్యాయవాది మోహన్​రావు వాదించారు. నాంపల్లి కోర్టు వాస్తవ అంశాలను పరిగణలోకి తీసుకోకుండా పోలీస్ కస్టడీకి అనుమతి ఇచ్చిందని, నిబంధనలకు విరుద్ధంగా పోలీసులు కస్టడీ లోకి తీసుకుని విచారిస్తున్నారని, ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 వరకు విచారిస్తున్నారని, ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారణ జరుగాలని నిబంధనలు ఉన్నాయని, కానీ అలా జరగడం లేదని న్యాయవాది మోహన్​రావు కోర్టుకు తెలిపారు. ప్రణీత్ రావుకు ప్రతి రోజు మెడికల్ చెక్ అప్ చేయించాలని, కస్టడీలో దర్యాప్తు విషయాలు మీడియాకు చెపుతున్నారని, కస్టడీ ఇప్పటికే నాలుగు రోజులు అయ్యిందని, పోలీస్ స్టేషన్‌లో నిద్ర పోవడానికి ఎలాంటి సౌకర్యాలు లేవు అని లాయర్ గండ్ర మోహన్‌రావు కోర్టుకు తెలిపారు. వీటిని పరిగణలోకి తీసుకుని కస్టడీని రద్దు చేయాలని కోరారు.

ప్రభుత్వం తరపు న్యాయవాది వాదనలు

24 గంటలు ప్రణీత్ రావును పోలీస్ కస్టడీలోకి నాంపల్లి కోర్టు అనుమతి ఇచ్చిందని ప్రభుత్వ తరపు న్యాయవాది వాదించారు. పోలీస్ స్టేషన్‌లో అన్ని సౌకర్యాలు ఉన్నాయని, మీడియాకు ఎలాంటి లీకులు ఇవ్వడం లేదని, ప్రణీత్ రావు అరెస్ట్ 13 మార్చి రోజున మాత్రమే డీసీపీ ప్రెస్ నోట్ ఇచ్చాడని, పోలీస్ అధికారులు మీడియాకు లీక్‌లు ఇస్తారని చెప్పడం సరైంది కాదని వివరించారు. జూబ్లీహిల్స్ ఏసీపీ ఈ కేసులో ఐవో అధికారిగా ఉన్నారని, బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో విచారణ చేస్తున్నామని, అడిషనల్ ఎస్పీ రమేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు అయ్యిందని, అడిషనల్ ఎస్పీ రమేష్ ఎక్కడ కూడా ఈ కేసులో జోక్యం చేసుకోలేదని కోర్టు ముందు తెలిపారు. ప్రణీత్ రావు బంధువులు అనుదీప్ అతని కౌన్సిల్ వాసుదేవన్ రోజు కలుస్తున్నారని, ఇంకా మూడు రోజులు ప్రణీత్ రావు పోలీస్ కస్టడీ ఉందని కోర్టుకు వెల్లడించారు. దర్యాప్తు దశలో ఉన్న కేసులో ఇప్పుడు పిటిషన్ వేయ్యడం కరెక్ట్ కాదు అని, ప్రణీత్ రావు వేసిన పిటిషన్‌ను కొట్టివేయాలని, మీడియాకు ప్రణీత్ వ్యవహారంలో ఎలాంటి లీకులు ఇవ్వ్వడం లేదని స్పష్టం చేశారు. ప్రణీత్ అరెస్ట్ తరువాత డీసీపీ ప్రెస్ రిలీజ్ ఇచ్చారని, మీడియా రాస్తున్న వాటికి తాము బాధ్యులం కాదు అని కోర్టుకు తెలిపారు. ఈ కేస్ తీవ్రత దృష్ట్యా స్పెషల్ టీంను ఏర్పాటు చేశామని, బంజారాహిల్స్ సీఐ కూడా టీంలో ఉన్నారని, అందుకే బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ప్రణీత్‌ను విచారిస్తున్నామని, అడిషనల్ ఎస్పీ రమేష్ దర్యాప్తులో పాల్గొనడం లేదని, రమేష్ అసలు బంజారాహిల్స్ పీఎస్‌కు రానే లేదన్నారు. రాత్రి 8 తరువాత ప్రణీత్‌ను విచారించడం లేదని, ప్రతి రోజు వారి తలిదండ్రులతోను ప్రణీత్ మాట్లాడుతున్నాడు అని ప్రభుత్వ న్యాయవాది కోర్టు తెలిపారు.
కాగా, ఇరువురి వాదనలు విన్న హైకోర్టు తీర్పును గురువారానికి వాయిదా వేసింది. ఈ పిటిషన్ విచారణలో భాగంగా వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్, పంజాగుట్ట ఇన్స్‌పెక్టర్ శోభన్ కోర్టుకు హాజరయ్యారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com