యాదాద్రి భువనగిరి జిల్లాలోని మోటకొండూరు మండలంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ప్రీమియర్ ఎక్స్ ఫ్లోజివ్ కంపెనీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మోటకొండూరు మండలంలోని ప్రీమియర్ ఎక్స్ ఫ్లోజివ్ కంపెనీలో పేలుడు సంభవించింది. పేలుడు ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పేలుడు ధాటికి భవనం కుప్పకూలిపోయింది. ప్రీమియర్ ఎక్స్ ఫ్లోజివ్ కంపెనీలో మందుగుండు తయారీకి ఉపయోగించే పౌడర్ను తయారు చేస్తారు. తయారీ సమయంలో ఒత్తిడికి గురైనా, షార్ట్ సర్క్యూట్, ఎండల తదితర కారణాల వల్ల పేలుడు సంభవించే అవకాశాలుంటాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగిన పేలుడుకు కారణాలు తెలియరాలేదు. కాగా ప్రమాదంలో ఫ్యాక్టరీలో పనిచేస్తున్న నలుగురు కార్మికులు గాయపడ్డారు. మరో ముగ్గురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు.
కాగా ఘటన సమయంలో ఇద్దరు అక్కడక్కడే మరణించగా, మరొకరిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరొకరు మరణించారు.ప్రమాద సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. అయితే శిథిలాల కింద మరికొన్ని మృతదేహాలు ఉన్నట్టు కార్మికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో జేసీబీ సహాయంతో శిథిలాల్లో చిక్కుకున్న వారికోసం గాలింపు చేపట్టారు. కార్మికుల మృతితో గ్రామస్తులు కంపెనీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కంపెనీ లోపలికి చొచ్చుకెళ్లేందుకు యత్నించారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో గ్రామస్తుల వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకున్నాయి.