రాజ్యాంగంలో అలాంటి ప్రొవిజన్ ఉందా?
రాష్ట్రపతి,గవర్నర్లను ఎలా ఆదేశిస్తారు
తమిళనాడు గవర్నర్ కేసులో తీర్పుపై అభ్యంతరం
సుప్రీం తీర్పుపై ప్రశ్నలు సంధించిన రాష్ట్రపతి
రాజ్యాంగ ధర్మాసం సమాధానం ఇస్తుందా అన్న ఉత్కంఠ
తమిళనాడు గవర్నర్ విషయంలో తీర్పుసందర్భంగా రాష్ట్రపతిని కూడా ప్రశ్నించిన సుప్రీం ధర్మాసనం తీరుపై రాష్ట్రపతి ముర్ము ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అధికారం కెవరు ఇచ్చారో చెప్పాలని స్పష్టం చేశారు. ఈ మేరకు పలు ప్రశ్నలను సంధించారు. శాసనసభలో ఆమోదించిన బిల్లులను పరిశీలన పేరుతో గవర్నర్లు, రాష్ట్రపతి నెలల తరబడి జాప్యం చేస్తుండటంపై ఇటీవల సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. తమిళనాడు ప్రభుత్వం వర్సెస్ గవర్నర్ కేసులో ఏప్రిల్ 8న రాష్ట్రపతి, గవర్నర్లు గడువులోగా బిల్లులు ఆమోదించాల్సిదేనని ధర్మాసనం ఆదేశించింది. అయితే, తాజాగా అత్యున్నత న్యాయస్థానం నిర్ణయాన్ని భారత ప్రథమ పౌరురాలు ద్రౌపదీ ముర్ము తీవ్రంగా ఖండించారు. ఈ ఆదేశాలు రాజ్యాంగం ప్రకారం ఎలా చెల్లుబాటు అవుతాయని సుప్రీంకోర్టును ప్రశ్నిస్తూ 14 ప్రశ్నలను సంధించారు. తమిళనాడు ప్రభుత్వం వర్సెస్ గవర్నర్ కేసులో ఏప్రిల్ 8న సుప్రీంకోర్టు రాష్ట్ర బిల్లులపై రాష్ట్రపతి, గవర్నర్ 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాల్సిందేనని తీర్పు వెలువరించింది. గడువులోగా ఆమోదించడమో, వెనక్కి తిప్పిపంపడమో ఏదొకటి చేయాలని స్పష్టం చేసింది. బిల్లులు ఆమోదించకపోతే ఎందుకనే కారణాలు కచ్చితంగా చెప్పాలని తెలిపింది. ఈ తీర్పు తర్వాత కూడా ఇలాగే చేస్తుంటే సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చని, రాజ్యాంగ అధికరణం 142 ప్రకారం గవర్నర్ల నిష్క్రియాపరత్వాన్ని న్యాయ సక్ష చేసేందుకు సంపూర్ణ అధికారం సుప్రీంకోర్టుకు ఉందని జస్టిస్ జేబి పార్దివాలా, ఆర్ మహదేవన్ ధర్మాసనం వెల్లడించింది. అయితే, సుప్రీం ఇలా కాలపరిమితి విధించడంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తీవ్రంగా స్పందించారు.
రాజ్యాంగంలో అలాంటి నిబంధనేది లేనప్పుడు ఈ తీర్పు ఎలా ఇవ్వగలరని రాష్ట్రపతి ముర్ము అత్యున్నత న్యాయస్థానాన్ని ప్రశ్నించారు. జస్టిస్ జేబి పార్దివాలా, జస్టిస్ ఆర్ మహదేవన్ ఇచ్చిన 415 పేజీల తీర్పును సక్షించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 143(1) కింద రాష్ట్రపతికి ఉన్న అరుదైన అధికారాలను ఉపయోగించి 14 ప్రశ్నలపై సుప్రీంకోర్టు అభిప్రాయాన్ని కోరారు. నూతన సీజేఐగా జస్టిస్ బి.ఆర్.గవాయ్ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రాష్ట్రపతి ముర్ము ఈ తీర్పుపై స్పందించడం గమనార్హం. ఆర్టికల్ 200 కింద బిల్లును ప్రవేశపెట్టినప్పుడు గవర్నర్కు అందుబాటులో ఉన్న రాజ్యాంగ ఎంపికలు ఏమిటి? ఈ ఎంపికలను అమలు చేయడంలో గవర్నర్ మంత్రి మండలి సలహాకు కట్టుబడి ఉంటారా? ఆర్టికల్ 200 కింద గవర్నర్ విచక్షణాధికారం వినియోగించడం న్యాయ సక్షకు లోబడి ఉంటుందా? ఆర్టికల్ 200 కింద గవర్నర్ చర్యలను న్యాయపరంగా పరిశీలించడానికి ఆర్టికల్ 361 పై సంపూర్ణ నిషేధాన్ని విధిస్తారా? రాజ్యాంగం ప్రకారం కాలపరిమితి లేకపోయినప్పటికీ ఆర్టికల్ 200 కింద గవర్నర్లు తమ అధికారాలను వినియోగించు కునేటప్పుడు కోర్టులు గడువులు విధించవచ్చా, విధానాలను సూచించవచ్చా? ఆర్టికల్ 201 కింద రాష్ట్రపతి విచక్షణాధికారం న్యాయ సక్షకు లోబడి ఉంటుందా? ఆర్టికల్ 201 ప్రకారం రాష్ట్రపతి విచక్షణాధికారం వినియోగించడానికి కోర్టులు కాలపరిమితిని, విధానపరమైన అవసరాలను నిర్ణయించగలవా?
గవర్నర్ రిజర్వ్ చేసిన బిల్లులపై నిర్ణయం తీసుకునేటప్పుడు రాష్ట్రపతి ఆర్టికల్ 143 కింద సుప్రీంకోర్టు అభిప్రాయాన్ని కోరాలా? ఒక చట్టం అధికారికంగా అమల్లోకి రాకముందు గవర్నర్, రాష్ట్రపతి ఆర్టికల్ 200, 201 ప్రకారం తీసుకునే నిర్ణయాలు న్యాయబద్ధమైనవేనా? ఆర్టికల్ 142 ద్వారా రాష్ట్రపతి లేదా గవర్నర్ వినియోగించే రాజ్యాంగ అధికారాలను న్యాయవ్యవస్థ సవరించగలదా లేదా అధిగమించగలదా?
ఆర్టికల్ 200 కింద గవర్నర్ అనుమతి లేకుండా రాష్ట్ర చట్టం అమలులోకి వస్తుందా? సుప్రీంకోర్టులోని ఏదైనా బెంచ్ ముందుగా ఒక కేసుకు గణనీయమైన రాజ్యాంగ వివరణ అవసరమా అని నిర్ణయించి దానిని ఆర్టికల్ 145(3) ప్రకారం ఐదుగురు న్యాయమూర్తుల బెంచ్కు నివేదించాలా? ఆర్టికల్ 142 కింద సుప్రీంకోర్టు రాజ్యాంగ లేదా చట్టబద్ధమైన నిబంధనలకు విరుద్ధంగా ఆదేశాలు జారీ చేయడం సబబేనా? ఆర్టికల్ 131 కింద దావా వేయడం ద్వారా కాకుండా వేరే మార్గాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదాలను పరిష్కరించడానికి సుప్రీంకోర్టును రాజ్యాంగం అనుమతిస్తుందా? అంటూ ప్రశ్నలు సంధించారు.
కాగా, రాజ్యాంగం ప్రకారం కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థలకు గల అధికారాల పరిమితిపై రాష్ట్రపతి ముర్ము సంధించిన ప్రశ్నలకు సర్వోన్నత న్యాయస్థానం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. రాజ్యాంగంలో అలాంటి నిబంధనేదీ లేనప్పుడు.. సుప్రీంకోర్టు తీర్పు ఎలా ఇచ్చిందని ముర్ము ప్రశ్నించినట్లు సమాచారం. ఈ మేరకు పలు ఆంగ్ల డియా కథనాలు వెల్లడించాయి. రాజ్యాంగంలోని 143 ఆర్టికల్ కింద ఉన్న ప్రత్యేక అధికారాలను వినియోగించుకొని సుప్రీంకోర్టు తీర్పుపై రాష్ట్రపతి పలు ప్రశ్నలు సంధించినట్లు ఆ కథనాలు పేర్కొన్నాయి. ఈ ప్రశ్నలపై న్యాయస్థానం తమ అభిప్రాయాలను తెలియజేయాలని అడిగినట్లు తెలుస్తోంది. ఈ అంశంపై స్పందించేందుకు భారత ప్రధాన న్యాయమూర్తిగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్ బీఆర్ గవాయ్ త్వరలోనే రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.
తమిళనాడు శాసనసభ ఆమోదించిన 10 బిల్లులను ఆ రాష్ట్ర గవర్నరు ఆర్.ఎన్.రవి ఆమోదించకుండా తన వద్దే ఉంచుకోవడం సరికాదని ఈ ఏడాది ఏప్రిల్లో సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. దీనికి సంబంధించి 415 పేజీల తీర్పు వెలువరించింది. వర్నర్ గరిష్ఠంగా మూడు నెలల్లోగా ఆమోదించడమో, తిప్పి పంపించడమో చేయాలని నిర్దేశిరచింది. బిల్లులను రాష్ట్ర ప్రభుత్వానికి వెనక్కి పంపిస్తున్నట్లయితే అందుకు గల కారణాలనూ జత చేయాలని తెలిపింది. ఈ తీర్పు తర్వాత కూడా గవర్నర్లు బిల్లులపై జాప్యం చేస్తుంటే సర్వోన్నత న్యాయస్థానాన్ని నేరుగా ఆశ్రయించవచ్చని, గవర్నర్ల నిష్క్రియాపరత్వం న్యాయసక్ష పరిధిలోకి వస్తుందని స్పష్టంచేసింది. రాజ్యాంగ అధికరణం 142 ద్వారా అటువంటి సంపూర్ణ అధికారం సుప్రీంకోర్టుకు ఉందని జస్టిస్ జె.బి.పార్దీవాలా, జస్టిస్ ఆర్.మహాదేవన్ ధర్మాసనం తేల్చి చెప్పింది.