-
అక్టోబర్లో కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ
-
స్మార్ట్ కార్డుల రూపంలో కొత్త కార్డులు
-
రేషన్కు , హెల్త్కు వేర్వేరు కార్డులు
-
అర్హతకు వార్షిక ఆదాయంపై పరిశీలన
-
గ్రామాల్లో రూ.1.50లక్షలు ..పట్టణాల్లో రూ.2లక్షలు
-
మంత్రివర్గ ఉపసంఘంలో నిర్ణయం
-
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న నిరుపేద కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అక్టోబర్లో రేషన్ కార్డుల ప్రక్రియను ప్రారంభించాలని నిర్ణయించింది. రాష్ట్రంలో దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న అర్హులైన కుటుంబాలకు రేషన్ కార్డు నిత్యావసర సరకులకు, హెల్త్ కార్డు ఆరోగ్యానికి ఉపయోగపడేలా విడివిడిగా అందజేయబోతున్నామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్ ఎర్రమంజిల్ జలసౌధలో సోమవారం మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి అధ్యక్షతన కొత్త రేషన్ కార్డులు, హెల్త్ కార్డుల జారీపై మంత్రివర్గ ఉపసంఘం నాలుగవ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపసంఘం సభ్యులుగా ఉన్నా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, పౌర సరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్, సంయుక్త సంచాలకులు ప్రియాంక ఆల, ఇతర అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న దరఖాస్తుల సంఖ్య, కొత్త రేషన్ కార్డులు, హెల్త్ కార్డుల పంపిణీ, ఇతర మార్గదర్శకాలపై విస్తృతంగా చర్చించారు.
ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీ నేపథ్యంలో కొత్త రేషన్ కార్డులు, హెల్త్ కార్డులు జారీపై విధి విధానాలు, ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, నిబంధనలు, ఏ విధంగా సాఫీగా ముందుకు వెళ్లాలన్న అంశాలపై ఉపసంఘం సమావేశంలో చర్చించామని మంత్రి ఉత్తమ్ తెలిపారు. కొత్త రేషన్ కార్డులకు సంబంధించి అక్టోబర్ మాసంలో లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని ప్రకటించారు. రేషన్ కార్డుల జారీకి సంబంధించి తుది పక్రియ, ఖరారు ఈ నెలాఖరులో పూర్తి చేస్తామని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో 89.96 లక్షల రేషన్ కార్డులు ఉండగా, లబ్ధిదారులు 2 కోట్ల 81 లక్షల 70 వేల మంది ఉన్నారని వివరించారు. అర్హులైన ప్రతి కుటుంబానికీ రేషన్ కార్డులు, హెల్త్ కార్డులు జారీ చేస్తామని మంత్రి ఉత్తమ్ భరోసా ఇచ్చారు.ఈ నెల 21న మరో సారి మంత్రివర్గ ఉపసంఘం సమావేశం కానుందని తెలిపారు. రేషన్ కార్డులు పొందేందుకు అర్హతలు వార్షిక ఆదాయం గ్రామాల్లో రూ.1.50లక్షలు , పట్టణాల్లో రూ.2లక్షలు లోపు ఉండాలని ,అదే విధంగా పొలం నీటిపారుదల కింద అయితే 3.5ఎకరాలు , వర్షాధారంగా అయితే 7.5ఎకరాలు లోపు ఉండాలని , ఈ నిబంధనలను పరిశీలన చేస్తున్నట్టు మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి తెలిపారు.
స్మార్ట్ కార్డుగా రేషన్ కార్డు, హెల్త్ కార్డు :మంత్రి పొంగులేటి
తెల్ల రేషన్ కార్డులకు ఎవరు అర్హులు అనే విషయంపై త్వరలో మరో మారు జరగబోయే మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో నిర్ణయిస్తామని రాష్ట్ర రెవెన్యూ, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలో అర్హులైన ప్రతి కుటుంబానికి పారదర్శకంగా రేషన్ కార్డులు జారీ చేస్తామని తెలిపారు. రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ఎలా ఉండాలన్న అంశంపై అభిప్రాయాలు తెలపాలని కోరుతూ రాజకీయ పార్టీలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఇప్పటికే లేఖలు రాశామని తెలిపారు. ఇప్పటి వరకు 16 మంది ప్రజాప్రనిధులు తమ విలువైన సూచనలు, సలహాలు ఇచ్చారని మంత్రి పొంగులేటి వివరించారు. వారి నుంచి వచ్చిన సహేతుకమైన సూచనలు, సలహాలపై కూడా ఈ భేటీలో చర్చించామని అన్నారు. ప్రధాన విపక్ష బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఇచ్చే సూచనల విషయంలో తాము ఎలాంటి భేషజాలకు పోకుండా వాటని కూడా పరిగణలోకి తీసుకుంటామని స్పష్టం చేశారు. రేషన్ కార్డు, హెల్త్ కార్డు రెండూ కూడా స్మార్ట్ కార్డులు జారీ చేయాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం అని పొంగులేటి పేర్కొన్నారు.