గతంలో రాజకీయ ఒత్తిళ్లు.. ఇప్పుడు దిద్దుబాటు చర్యలు
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసం దగ్గర అక్రమ కట్టడాలను కూల్చేసిన ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లోను చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే కదా. హైదరాబాద్ లోని లోటస్ పాండ్లో ఉన్న వైఎస్ జగన్ నివాసం ముందు ఉన్న అక్రమ కట్టడాలను కూల్చేసిన ఘటనపై సీరియస్ అయిన అప్పటి జీహెచ్ఎంసీ ఇంఛార్జ్ కమిషనర్ ఆమ్రపాలి.. సంబంధిత అధికారి అయిన ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ హేమంత్ బోర్కడే పై సీరియస్ యాక్షన్ తీసుకున్నారు. సదరు అధికారిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఆమ్రపాలి.
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ ఇంటి ముందు నిర్మాణాల కూల్చివేతపై ఉన్నతాధికారులకు ముందస్తుగా సమాచారం ఇవ్వలేదన్న కారణంతో ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ హేమంత్ బోర్కడేపై ఆమ్రపాలి చర్యలు తీసుసోవడం చర్చనీయాంశమైంది. హేమంత్ బోర్కడేపై బదిలీ వేటు వేసి, జీఐడీకి రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ బాధ్యతల నుంచి హేమంత్ ను తొలగిస్తూ నిన్నటి వరకు జీహెచ్ఎంసీ ఇంచార్జ్ కమిషనర్ గా ఉన్న ఆమ్రపాలి ఆదేశాలు జారీ చేశారు.
ఐతే ఇప్పుడు హేమంత్ బోర్కడే కు ప్రమోషన్ వచ్చింది. హేమంత్ కు తెలంగాణ స్టేట్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీగా పోస్టింగ్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఆమ్రపాలి సస్పెండ్ చేసిన అధికారికి ప్రస్తుతం ప్రమోషన్ ఇవ్వటం ఆసక్తికరంగా మారింది. జగన్ ఇంటి దగ్గర అక్రమ కట్టడాల కూల్చివేత టైంలో వచ్చిన రాజకీయంగా ఒత్తిడి కారణంగానే హేమంత్ పై చర్యలు తీసుకున్నారని, ఇప్పుడు పరిస్థితులు సర్దుకోవడంతో మళ్లీ దిద్దుబాటు చర్యల్లో భాగంగా ప్రమోషన్ ఇచ్చారన్న చర్చ జరుగుతోంది.