రాహూల్ స్థానంలో పోటీ చేయనున్న ప్రియాంక గాంధీ
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీ మొన్న జరిగిన లోక్ సభ ఎన్నికల్లో రెండ పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసి గెలిచిన సంగతి తెలిసిందే. కేరళలోని వయనాడ్, ఉత్తర్ ప్రదేశ్ లోని రాయ్బరేలీ లోక్ సభ స్థానాల నుంచి రాహుల్ విజయం సాధించారు. ఇప్పుడు ఈ రెండు స్థానాల్లో ఏదో ఒక స్థానానికి రాజీనామా చేయాల్సిన పరిస్తితి వచ్చింది. దీంతో రాహూల్ గాంధీ ఏ లోక్ స్భ స్థానాన్ని వదులుకుంటారన్న చర్చ దేశవ్యాప్తంగా జరుగుతోంది. ఇదిగో ఇటువంటి సమయంలో తాజాగా రాహుల్ గాంధీ ఈ అంశంపై నిర్ణయం తీసుకున్నారు.
కొన్ని రోజుల తర్జనభర్జన తరువాత వయనాడ్ ఎంపీ సీటును వదులుకోవాలని రాహూల్ గాంధీ నిర్ణయించుకున్నారు. రాయ్బరేలీ ఎంపీగా కొనసాగాలని డిసైడ్ అయ్యారు. ఈ మేరకు సోమవారం ఢిల్లీలో జరిగిన ఏఐసీసీ సమావేశంలో ఈ అంశంపై సుధీర్గంగా చర్చ జరిగింది. రాహుల్ గాంధీ వయనాడ్ ను వదులుకుంటారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఈ బేటీలో ప్రకటించారు. దీంతో వయనాడ్ లో జరగనున్న ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు ఆయన సోదరి, కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ రంగంలోకి దిగనున్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయడం ప్రియాంక గాంధీకి ఇదే తొలిసారి కావడం గమనాహ్రం.
రాయ్ బరేలీ కాంగ్రెస్ కంచుకోటగా పేరొందిందని చెప్పిన మల్లిఖార్జున ఖర్గే.. అక్కడి ప్రజలు గాంధీ కుటుంబంపై ఎంతో అభిమానం చూపుతున్నారని ఈ సందర్బంగా చెప్పారు. అందుకే ఆ స్థానాన్నే రాహుల్ గాంధీ ఎంచుకోవాలని పార్టీ నిర్ణయించిందని తెలిపారాయన. ఇది కాంగ్రెస్ పార్టీకి మేలు చేస్తుందని భావిస్తున్నామన్న ఖర్గే.. వయనాడ్ ప్రజలకు కూడా కాంగ్రెస్పై ఎనలేని అభిమానం చూపుతున్నారని చెప్పుకొచ్చారు. వారి కోసం ప్రియాంక గాంధీని బరిలోకి దింపుతున్నామని ప్రకటించారు. వయనాడ్ లోక్ సభ స్థానానికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్న సందర్భంగా రాహుల్ గాంధీ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.
తన పోరాటానికి వయనాడ్ ప్రజలు ఎంతో మద్దతిచ్చారని చెప్పిన రాహూల్.. ఆ స్థానాన్ని వదులుకోవడానికి ఎంతో మదనపడ్డానని అన్నారు. అక్కడి ప్రజలతో తన బంధం ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుందన్న ఆయన.. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటామని స్పష్టం చేషారు. ప్రియాంక వయనాడ్ ఉత్తమ ప్రతినిధి కాబోతుందని నమ్ముతున్నానని చెప్పారు. ఇక తాను మహిళనైనా వయనాడ్ నుంచి పోరాడగలనన్న ధీమా వ్యక్తం చేసిన ప్రియాంక గాంధీ.. రాహుల్ అక్కడ లేరనే భావనను వయనాడ్ ప్రజలకు కలగనివ్వని వ్యాఖ్యానించారు.