ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు పోలీసులు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించారు. అన్నదాతలను మోసగిస్తున్న 34 మంది దళారుల ఆటకట్టించారు. బ్యాంకుల్లో రైతులకున్న అప్పులను చెల్లించి, వారి నుంచి రూ.5-10 వేల వరకు దండుకుంటున్న తీరును పోలీసులు బహిర్గతం చేశారు. పోలీసుల కథనం ప్రకారం, రైతులకు ఏటా బ్యాంకులు 7% వడ్డీతో పంట రుణాలు అందజేస్తుంటాయి. ఒకవేళ ఏడాదిలోపు అప్పును తిరిగి చెల్లిస్తే వడ్డీలో 3% బోనస్ లభిస్తుంది. పైగా తర్వాత సంవత్సరం 20-30% రుణాన్ని పెంచి బ్యాంకులు కొత్త అప్పులిస్తాయి. అయితే కొందరు దళారులు రైతుల పాత అప్పులను చెల్లించి, కొత్త రుణం ఇప్పించి, వారి నుంచి వేల రూపాయలు కాజేస్తున్నారు. ఈ తీరుపై ఆదిలాబాద్ జిల్లా ఎస్పీకి సమాచారం అందింది. ఈ నేపథ్యంలో ఎస్పీ ఆదేశాల మేరకు బుధవారం పోలీసులు 16 బృందాలుగా విడిపోయారు. తొమ్మిది మండలాల్లో రైతుల వేషాలతో రంగంలోనికి దిగారు. వారిని రైతులుగానే భావించిన దళారులు బేరసారాలకు దిగారు. తర్వాత పోలీసులు గుడిహత్నూర్, ఉట్నూర్, నార్నూర్, బేల, మావల, ఇంద్రవెల్లి మండలాల్లో 34 మంది దళారులను అదుపులోకి తీసుకొని కేసులు నమోదు చేశారు.