-
సీబీఐ ఎస్పీ రామ్సింగ్కు కూడా హైకోర్టులో రిలీఫ్ దక్కింది
-
తదుపరి చర్యల్ని నిలిపివేయాలని న్యాయమూర్తి ఆదేశం
-
మెజిస్ట్రేట్ ఆదేశాలపై హైకోర్టును ఆశ్రయించిన సునీత
-
ఈ కేసులో తదుపరి చర్యలు 4 వారాల పాటు నిలిపివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు
ముద్ర ఏపీః మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీతా రెడ్డి, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర్రెడ్డిలకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. పులివెందుల పోలీసులు నమోదు చేసిన కేసులో సునీత, రాజశేఖరరెడ్డి, సీబీఐ ఎస్పీ రామ్సింగ్లకు హైకోర్టులో రిలీఫ్ దక్కింది. ఈ కేసులో తదుపరి చర్యలన్నింటిని నాలుగు వారాలు నిలుపుదల చేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. వివేకానందరెడ్డి పీఏ కృష్ణారెడ్డి దాఖలు చేసిన ప్రైవేట్ ఫిర్యాదును పులివెందుల కోర్టు మెజిస్ట్రేట్ యాంత్రిక ధోరణిలో పోలీసులకు పంపించారని ఆక్షేపించింది. ఈ వ్యవహారంపై లోతైన విచారణ అవసరమని పేర్కొంది. తదుపరి విచారణను ఈనెల 29కి వాయిదా వేసింది.
వివేకా హత్య కేసులో కొందరు తనను బెదిరిస్తున్నారని ఆయన దగ్గర పీఏగా పనిచేసిన కృష్ణారెడ్డి 2021 డిసెంబర్లో పులివెందుల కోర్టులో ప్రైవేట్ ఫిర్యాదు దాఖలు చేశారు. పులివెందులకు చెందిన కొందరు నాయకుల ప్రమేయం ఉన్నట్లుగా సాక్ష్యం చెప్పాలని సీబీఐ ఎస్పీ రామ్సింగ్ ఒత్తిడి చేస్తున్నారని.. సీబీఐ అధికారులకు అనుకూలంగా సాక్ష్యం చెప్పాలని వివేకా కుమార్తె సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డి ఒత్తిడి చేశారని ఆరోపించారు.
ఈ పిటిషన్లపై తాజాగా విచారణ జరిపిన హైకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. వివేకా పీఏ ప్రైవేటు ఫిర్యాదును పులివెందుల కోర్టు మెజిస్ట్రేట్ యాంత్రిక ధోరణిలో పోలీసులకు పంపించారని అభిప్రాయపడింది. ఈ వ్యవహారంపై లోతైన విచారణ అవసరమని పేర్కొంది. తదుపరి విచారణను 29కి వాయిదా వేస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.శ్రీనివాసరెడ్డి మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.
2023 డిసెంబరు 8న కృష్ణారెడ్డి ఫిర్యాదుపై పులివెందుల కోర్టు విచారణ జరిపింది. కేసు నమోదు చేసి తుది నివేదిక ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది. దీంతో పోలీసులు సునీత, నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, సీబీఐ ఎస్పీ రామ్సింగ్పై కేసు నమోదు చేశారు. దీనిపై సునీత, రాజశేఖర్రెడ్డి, ఎస్పీ రామ్సింగ్ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేయగా.. ఊరట లభించింది.
వివేకా దగ్గర పీఏగా పని చేసిన నేపథ్యంలో హత్య గురించి కృష్ణారెడ్డికి తెలిసి ఉంటుంది కాబట్టి వాంగ్మూలం ఇవ్వాలని మాత్రమే ఎస్పీ కోరారని తెలిపారు. అంతేకాదు ప్రభుత్వ ఉద్యోగిపై కేసు నమోదు చేయాలంటే ప్రభుత్వం నుంచి అనుమతి తప్పనిసరి అని రామ్సింగ్ తరఫు లాయర్ అన్నారు. రామ్సింగ్ విషయంలో అనుమతి తీసుకోలేదన్నారు. పిటిషనర్ల కారణంగా కృష్ణారెడ్డి కుమారుడి పెళ్లి కూడా నిలిచిపోయిందని తప్పు చేయకపోయినా ఆయన 90 రోజులు జ్యుడీషియల్ రిమాండ్లో ఉండాల్సి వచ్చిందని పోలీసుల తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపించారు.