- మూడేళ్ల పాటు పదవిలో కొనసాగనున్న కొత్త ఎస్ఇసి
- విజిలెన్స్ కమిషనర్గా ఎంజీ గోపాల్ను నియమిస్తూ ఉత్తర్వులు
రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా విశ్రాంత ఐఎఎస్ అధికారి రాణి కుమిదిని నియమితులయ్యారు. 1988 బ్యాచ్కు చెందిన రాణి కుమిదిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. కేంద్ర సర్వీసుల అనంతరం రాష్ట్ర కార్మిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా విధులు చేపట్టారు. ఆమె 2023 ఎన్నికలకు ముందు పదవీ విరమణ చేశారు. అప్పటి బిఆర్ఎస్ ప్రభుత్వం తిరిగి అదే హోదాలో కొనసాగించింది. తాజాగా రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా రాణి కుమిదినిని నియమించింది. ఎస్ఇసిగా ఉన్న పార్థసారధి పదవీ కాలం ఈ నెల 8వ తేదీతో ముగిసింది. దీంతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా రాణి కుమిదినిని నియమించారు. ఈ మేరకు రాణి కుముదినిని ఎస్ఇసిగా నియమిస్తూ గవర్నర్ జిష్టుదేవ్ వర్మ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. మూడేళ్ల పాటు రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నూతన ఎస్ఇసి నియామకం ప్రాధాన్యం సంతరించుకుంది.
పూర్తయిన పార్థసారథి పదవీ కాలం
రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా ఉన్న పార్థసారధి పదవీ కాలం ఈనెల 8వ తేదీతో పూర్తయ్యింది. 2020 సెప్టెంబర్ 9న ఆయన ఎస్ఇసిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. మూడేళ్ల పాటు రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా కొనసాగుతారని ఆ సమయంలో ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అందుకు అనుగుణంగా 2023 సెప్టెంబర్ 8తో పదవీ కాలం పూర్తయ్యింది. అయితే బిఆర్ఎస్ ప్రభుత్వం పార్థసారధి పదవీ కాలాన్ని ఏడాది పాటు పొడిగించింది. పొడిగించిన పదవీకాలం ఈ నెల 8తో ముగిసింది. దీంతో ప్రభుత్వం తాజాగా కొత్త ఎస్ఇసి నియామకాన్ని చేపట్టింది.
రాష్ట్ర విజిలెన్స్ కమిషనర్గా ఎంజీ గోపాల్
రాష్ట్ర విజిలెన్స్ కమిషనర్గా విశ్రాంత ఐఎఎస్ అధికారి ఎంజీ గోపాల్ను నియమితులయ్యారు. 1983 బ్యాచ్కు చెందిన ఎంజీ గోపాల్ ఉమ్మడి రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. ఎంజి గోపాల్ను రాష్ట్ర విజిలెన్స్ కమిషనర్గా మూడేళ్ల పాటు నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.