కర్ణాటకలో సంచలనం రేపుతున్న జేడీఎస్ వ్యవహారం
కర్ణాటకలో మహిళలు, యువతులపై జేడీఎస్ నాయకుడు ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక వేధింపుల వ్యవహారం సంచలనం రేపుతుండగా.. ఇప్పుడు మరో ఆసక్తికరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రజ్వల్ రేవణ్ణ తమ్ముడు ఎమ్మెల్సీ సూరజ్ రేవణ్ణపై అత్యాచారం ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఐతే ఈ ఆరోపణలు చేసింది ఓ యువకుడు కావడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తనపై జేడీఎస్ నేత, ఎమ్మెల్సీ సూరజ్ రేవణ్ణ అత్యారానికి పాల్పడినట్టు హసనకు చెందిన అదే పార్టీకి చెందిన కార్యకర్త పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనం రేపుతోంది.
తాను ఒప్పుకోకపోయినా బలవంతంగా తనపై సూరజ్ రేవణ్ణ అసహజ లైంగిక ప్రక్రియలో పాల్గొన్నాడని ఆరోపించాడా 25 ఏళ్ల చేతన్ అనే యువకుడు. అంతే కాకుండా తనను హత్య చేయడానికి ప్రయత్నిస్తున్నాడని, తనను సూరజ్ నుంచి కాపాడాలని డీజీపీ, హోం మంత్రి తో పాటు జిల్లా ఎస్పీకి లేఖలు రాశాడు. తనకు ఉద్యోగం ఇప్పిస్తానని, డబ్బు సాయం చేస్తామని నమ్మించి తనపై సూరజ్ రేవణ్ణ అత్యాచారం చేశాడని చేతన్ లేఖలో పేర్కొన్నాడు. ఈ మేరకు కేసు నమోదుచేసిన కర్ణాటక పోలీసులు, వైద్య పరీక్షల కోసం చేతన్ ను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. వైద్య పరీక్షల్లో అతడి ఒంటిపై గాయాలు ఉన్నట్లు గుర్తించారు.
మరోవైపు జేడీఎస్ నేతలు ఈ ఆరోపణలను కొట్టిపారేశారు. ఇదే సమయంలో ఎమ్మెల్సీ సూరజ్ రేవణ్ణ అనుచరుడు శివకుమార్ ఆ యువకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనకు 5 కోట్ల రూపాయలు ఇవ్వాలని డిమాండు చేశాడని, డబ్బులు ఇవ్వకపోతే అత్యాచారం చేసినట్టు కేసు పెడతానని బ్లాక్ మెయిల్ చేశాడని హోళినరిసిపురం పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాడు. పోలీసులు దీనిపై విచారణ చేపట్టారు. మొత్తానికి ప్రజ్వల్ రేవణ్ణ, సూరజ్ రేవణ్ణలు మాజీ ప్రధాని దేవేగౌడ మనుమలు కావడంతో ఇప్పుడీ వ్యవహారం కర్ణాటక రాజకీయాల్లో దుమారం రేపుతోంది.