మహానగరం చుట్టూ వివిధ ప్రాంతాల్లో హైదరాబాద్ మెట్రో పాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) అభివృద్ధి చేసిన లేఅవుట్లలో ప్లాట్ల విక్రయానికి మొత్తం రంగం సిద్ధమైంది. ప్రభుత్వం నుంచి అనుమతి కోసం అధికారులు ఎదురు చూస్తున్నారు. గ్రీన్సిగ్నల్ రాగానే దానికి సంబంధించిన కార్యాచరణ మొదలుపెట్టనున్నారు. ఔటర్ రింగ్ రోడ్డుకు అటు ఇటు పలు ప్రాంతాల్లో కూడా హెచ్ఎండీఏ పలు లేఅవుట్లను డెవలప్ చేసింది. ఆవాసాలు మానవ సమూహం ఉండటానికి కనీస మౌలిక వసతులను సైతం కల్పించింది. తొర్రూరు, ప్రతాప్సింగారం, ఇమ్ముల్నర్వ, లేమూరు ప్రాంతాల్లో ల్యాండ్ పూలింగ్ కింద రైతుల నుంచి భూములను సేకరించి వాటిని లేఅవుట్లుగా మహానగర అభివృద్ధి సంస్థ తీర్చిదిద్దింది.
117 ఎకరాల్లో అతిపెద్ద లేఅవుట్
60-40 నిష్పత్తిలో అభివృద్ధి చేసిన ప్లాట్లను అక్కడి రైతులకే కేటాయించారు. లేమూరులో మొత్తం ల్యాండ్ పూలింగ్లో భాగంగా 83 ఎకరాలను రైతుల నుంచి సేకరించారు. రోడ్లు, ప్రజా అవసరాలకు కొంత భూమి వదిలివేయగా మొత్తం 497 ప్లాట్లను అభివృద్ధి చేశారు. ఇందులో 333 ప్లాట్లను భూములు ఇచ్చిన స్థానిక రైతులకు ఇచ్చారు. మిగతా 164 ప్లాట్లు హెచ్ఎండీఏ పరిధిలో ఉన్నాయి. ప్రస్తుతం వీటిని వేలం నిర్వహించి విక్రయించనున్నారు. తొర్రూరులో 117 ఎకరాల్లో అతిపెద్ద లేఅవుట్ను హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ తీర్చిదిద్దింది. పెద్ద మొత్తంలో ఇక్కడ 985 ప్లాట్లు అందుబాటులోకి ఉన్నాయి. ఇప్పటికే కొన్నింటిని విక్రయించారు. ప్రస్తుతం విక్రయానికి ఇంకా 493 ప్లాట్లు సిద్ధంగా ఉన్నాయి. ప్రతాప్సింగారంలో 165 ఎకరాల్లో మరో అతిపెద్ద లేఅవుట్ను ఇప్పటికే హెచ్ఎండీఏ అభివృద్ధి చేసింది. మొత్తం 1093 ప్లాట్లలో రైతులకు, విక్రయాలకు పోగా 793 ప్లాట్లు హెచ్ఎండీఏ దగ్గర ఉన్నాయి. చాలా ప్రాంతాల్లో ఈ ప్లాట్ల కనీస ధర గజానికి రూ.20 నుంచి 30 వేలపైనే ఉండనుంది. ఎక్కువకు కోట్ చేసిన వారికే ప్లాట్లను హెచ్ఎండీఏ విక్రయించనుంది.
ప్రస్తుతం అన్ని ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ రంగంలో కొంత స్తబ్దత నెలకొన్నట్లు మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. మిగతా ప్రాంతాలతో పోల్చితే హైదరాబాద్ రియల్ రంగంలో మార్కెట్కు ఇబ్బంది ఉండదని, గతంలో మాదిరే భారీగా స్పందన ఉంటుందనే అంచనాకు అధికారులు వస్తున్నారు. ప్లాట్లను విక్రయించేందుకు ప్రభుత్వానికి ఇప్పటికే ప్రతిపాదనలు పంపినట్లు హెచ్ఎండీఏ వర్గాలు వెల్లడించాయి. సానుకూలత వస్తే వేలం ప్రక్రియ ప్రారంభించనున్నారు. వేలం ద్వారా వచ్చే సమకూరే నిధులు హెచ్ఎండీఏ అభివృద్ధి పనులను చేపట్టేందుకు ఆస్కారం ఉంటుందని ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు.