- సీనియార్టీ కోల్పోయిన ఫర్వాలేదు మేము తెలంగాణలో పనిచేస్తాం
- ఎపిలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగుల అభ్యర్థన
రెండు తెలుగు రాష్ట్రాల (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్) విభజన పూర్తి అయి పదేళ్లు అవుతున్న తెలంగాణ ఉద్యోగులు ఇంకా ఎపిలోనే పని చేయాల్సి వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎపి నుంచి తమను రిలీవ్ చేయాలని తెలంగాణ ఉద్యోగులు తాజాగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఎపిలో 712 మంది తెలంగాణకు చెందిన ఉద్యోగులు ప్రస్తుతం పనిచేస్తున్నట్టుగా తెలిసింది. అలాగే సచివాలయం, వివిధ హెచ్ఓడిల కార్యాలయాలు, 9, 10 వ షెడ్యూల్ సంస్థల్లో పని చేస్తున్న 224 మంది రాష్ట్ర కేడర్ ఉద్యోగులను కూడా రిలీవ్ చేయాలని వారు కోరుతున్నారు.
ఈ క్రమంలోనే ఉద్యోగులు తమ సీనియార్టీ కోల్పోయిన ఫర్వాలేదని, తమను తెలంగాణకు పంపాలని ఎపిలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులు ప్రాధేయ పడుతున్నారు. రాష్ట్ర విభజన జరిగి పదేళ్లయినా తమను స్వరాష్ట్రానికి పంపకపోవడంపై వారు ఆవేదన చెందుతున్నారు. ఈ క్రమంలో తమ విజ్ఞప్తులను పరిష్కారించాలని రెండు రాష్ట్రాల సిఎంలను (ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి)ని తెలంగాణ ఉద్యోగులు అభ్యర్థిస్తున్నారు.