తెలంగాణతో పాటు పలు రాష్ట్రాలు వెనుకంజ
ఏప్రిల్, మే నెలలో వచ్చిన జీఎస్టీ రాబడులు జాతీయస్థాయి సగటు 11 శాతానికి మించకపోగా తెలంగాణతో పాటు పలు రాష్ట్రాలు ఆశించిన స్థాయిలో రాబడులు సాధించలేకపోయాయి. తెలంగాణలో జీఎస్టీ ఆదాయం భారీగా తగ్గిందని కేంద్రం విడుదల చేసిన గణాంకాల్లో తెలిపింది. ఈ ఏడాది ఏప్రిల్లో మధ్యప్రదేశ్ అత్యధికంగా 30 శాతం పెరుగుదలతో తొలి స్థానంలో ఉండగా, ఒడిశా 27 శాతం వృద్ధితో రెండో స్థానంలో నిలిచింది. ఢిల్లీ 24,బీహార్, జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్లు 15 శాతం, ఉత్తరప్రదేశ్, హరియాణలు 12, తెలంగాణలో 9 శాతం మాత్రమే పెరుగుదల నమోదు చేసింది. కేంద్ర ఆర్ధిక శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం గతేడాది ఏప్రిల్తో పోల్చితే తెలంగాణలో రూ.322 కోట్లు మాత్రమే ఎక్కువ ఆదాయం వచ్చింది. మే నెలలో మాత్రం రాష్ట్రం కేవలం రూ.215 కోట్లు అదనంగా ఆర్జించింది.
చాలా రాష్ట్రాల్లో జాతీయ సగటు కంటే తక్కువ ఆదాయం
దేశవ్యాప్తంగా ప్రతిసంవత్సరం జీఎస్టీ రాబడులు క్రమంగా పెరుగుతున్నాయి. 2024-,25 ఆర్థిక సంవత్సరం మొదటి నెల ఏప్రిల్లో వస్తు, సేవల పన్ను వసూళ్లు మరోసారి భారీగా నమోదయ్యాయి. రూ.2.10 లక్షల కోట్లు రాబడి రాగా రీఫండ్లు ఇచ్చిన తర్వాత నికర ఆదాయం రూ.1.92లక్షల కోట్లతో 15.5 శాతం పెరుగుదలను నమోదు చేసింది. గతేడాదితో పోలిస్తే 7 శాతం మాత్రమే పెరిగింది. జాతీయ సగటు వృద్ధి 11 శాతానికి మించలేదు. ఇక ఈ ఏడాది మే నెలలో చాలా రాష్ట్రాల్లో జాతీయ సగటు కంటే తక్కువ ఆదాయం వచ్చినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.