రూ.లక్ష నుంచి రూ.1.50 లక్షల వరకు మాఫీ –
అసెంబ్లీ వద్ద నిధులు విడుదల చేయనున్న సీఎం
ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నఅధికారులు
వ్యవసాయరంగానికి సంబంధించి మంగళవారం నాడు రెండో విడత రుణమాఫీ నిధులు విడుదల కానున్నాయి. ఈ నిధులను అసెంబ్లీ ప్రాంగణం నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేయనున్నారు. రెండో విడత రుణమాఫీ నిధుల విడుదలను ప్రారంభించేందుకు అసెంబ్లీ ప్రాంగణంలో ముఖ్యమంత్రి ప్రవేశద్వారం వద్ద ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా భారీ టెంటు ఏర్పాటు చేస్తున్నారు. లక్షన్నర రుపాయల వరకు రుణాల మాఫీని అసెంబ్లీ ఆవరణలో మధ్యాహ్నం రెండు గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరుకానున్నారు.
రెండో విడతలో సుమారు 7 లక్షల మంది రైతులకు దాదాపు రూ.7 వేల కోట్ల రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధం చేసింది. మూడు విడతల్లో రుణమాఫీ పూర్తి చేసేలా ప్రభుత్వం ప్రణాళిక చేసింది. ఈనెల 19న మొదటి విడత ప్రారంభించింది. మొదటి విడతలో సుమారు 10.83 లక్షల కుటుంబాలకు చెందిన పదకొండున్నర లక్షల ఖాతాల్లో రూ.6 వేల కోట్లు జమ చేసే కార్యక్రమం తుదిదశకు చేరుకుంది.ఇప్పటికే ఇందుకు సంబంధించిన నిధులు అధికశాతం రైతుల ఖాతాలకు జమ అయ్యాయి. ఆధార్ నంబరు, ఇతర వివరాలు సరిగ్గా లేకపోవడం వంటి కారణాలతో సుమారు 17 వేల మందికి రుణమాఫీ డబ్బులు జమ కాలేదు. మూడో విడతలో లక్షన్నర నుంచి రెండు లక్షల రూపాయల వరకు రుణాలను ఆగస్టు 15లోగా ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది.
మూడు విడతల్లో రూ.31 వేల కోట్లు మాఫీ :
లోక్సభ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రూ.2 లక్షల్లోపు పంట రుణాలన్నీ మాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఓ సభలో తెలిపారు. హరీశ్ రావు ఆగస్టు లోపు రుణమాఫీ చేయాలన్న సవాల్ను స్వీకరించి మాఫీ చేస్తున్నామని తెలిపారు. మొదటి విడతగా రైతుల ఖాతాల్లో రూ.6,093 కోట్లను జమ చేశామన్నారు. రెండో విడతలో రూ.లక్షన్నర వరకు రుణాలు మాఫీ చేస్తామని తెలిపారు. మూడో విడతలో రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేసి మూడు విడతల్లో రూ.31 వేల కోట్లును రైతుల ఖాతాల్లో జమ చేస్తామని అన్నారు. కేవలం పాస్బుక్ ఆధారంగానే రుణమాఫీ చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
రుణమాఫీ డబ్బులపై సైబర్గాళ్ల కన్ను :
అయితే రుణమాఫీ డబ్బులను కొట్టేసేందుకు సైబర్ కేటుగాళ్లు పన్నాగం పన్నుతున్నారు. దీంతో సైబర్ పోలీసులు రైతులు ఎవరూ వారి ఫోన్లకు వచ్చిన సందేశాలపై క్లిక్ చేయవద్దని విజ్ఞప్తి చేశారు. అలా చేస్తే మీ రైతు రుణమాఫీ డబ్బులను కేటుగాళ్లు కొట్టేసే అవకాశం ఉందని, అపరిచిత వ్యక్తులకు మీ బ్యాంక్ అకౌంట్ వివరాలు ఇవ్వవద్దని హెచ్చరించారు.వ్యవసాయశాఖ సిబ్బంది కూడా సైబర్ మోసాలపట్ల రైతులను అప్రమత్తం చేస్తున్నారు.