భారత్-పాక్ సరిహద్దుల్లో పంజాబ్లోని మూడు జాయింట్ చెక్ పోస్టుల వద్ద రీట్రీట్ సెర్మనీ మంగళవారం నుంచి పునర్ ప్రారంభం కానుంది. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాక్ సైనికులతో నిర్వహించే రీట్రీట్ కార్యక్రమాన్ని నిలిపివేసింది. మళ్లీ రెండు వారాల తర్వాత ఈ కార్యక్రమం తిరిగి ప్రారంభం కానుంది. పంజాబ్లోని మూడు ప్రదేశాల్లో బహిరంగ జెండా అవనతం చేసే వేడుక మంగళవారం సాయంత్రం నుంచి ప్రారంభం అవుతుందని సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) తెలిపింది. అయితే, రీట్రీట్ సెర్మనీపై పలు ఆంక్షలు విధించారు. తొలిరోజు మీడియా ప్రతినిధులకు మాత్రమే అనుమతి ఇస్తున్నామని అధికారులు వెల్లడించారు. బుధవారం నుంచి నుంచి సాధారణ పౌరులందరికీ అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ రీట్రీట్ సెర్మనీ మంగళవారం సాయంత్రం ఆరు గంటలకు ప్రారంభమవుతుందని ప్రకటించారు. రీట్రీట్ సమయంలో పాక్ బార్డర్ గేట్లను తెరవమని తెలిపారు. అయితే, ఇకపై పాక్ సిబ్బందితో కరచాలనం ఉండదన్నారు. ప్రజల రాకతో సంబంధం లేకుండా బీఎస్ఎఫ్ దళాలు ప్రతిరోజూ జెండాను అవనతం చేస్తున్నాయని వెల్లడించారు.
పాకిస్థాన్తో సరిహద్దు పంచుకుంటున్న అట్టారీ-వాఘా, హుస్సేనివాలా, ఫజిల్కా వద్ద రిట్రీట్ జరుగుతుంది. ప్రతి రోజు సాయంత్రం బీఎస్ఎఫ్ దళాలు జాతీయ జెండాను అవతనం చేస్తాయి. అయితే భారత్- పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడడం వల్ల మే 8నుంచి ఈ రీట్రీట్ సెర్మనీకి ప్రజలను అనుమతించలేదు. తాజాగా మళ్లీ బుధవారం నుంచి ప్రజలను అనుమతిస్తున్నట్లు బీఎస్ఎఫ్ ప్రకటించింది.
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకార చర్య
ఏప్రిల్ 22న పహల్గాం ఉగ్రవాద దాడిలో 26 మంది అమాయక పర్యటకులు మరణించారు. అందుకు ప్రతీకార చర్యగా మే 7న భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టింది. ఈ ఆపరేషన్ కింద పాక్, పీఓకే లోని ఉగ్రవాద సైనిక స్థావరాలపై మెరుపుదాడులు చేసింది. ఈ దాడుల్లో టెర్రర్ గ్రూపులు జైషే మహ్మద్, లష్కరే తోయిబా ప్రధాన కార్యాలయాలు నేలమట్టం అయ్యాయి. అలాగే వందలాది ముష్కరులు మరణించారు. ఈ క్రమంలో ఇరుదేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో మే8న పంజాబ్ లోని మూడు చెక్ పోస్టుల వద్ద జరిగే రీట్రీట్ కార్యక్రమానికి ప్రజలను అనుమతించలేదు.