తన తమ్ముళ్ల మీద అంత ఏడుపు ఎందుకంటూ బీఆర్ఎస్ నేతలను ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. తన తమ్ముళ్లకి ప్రభుత్వంలో ఎలాంటి పదవులు ఇవ్వలేదని.. ఎవరు ప్రభుత్వ ప్రోటోకాల్ వాడుకోవడం లేదని చెప్పుకొచ్చారు. ఢిల్లీలో మీడియాతో సీఎం చిట్ చాట్ నిర్వహించారు. తన తమ్ముడు కొండల్ రెడ్డి తన సొంత డబ్బులతో విదేశాలకు వెళ్తే కొందరు కావాలనే రాజకీయం చేస్తున్నారని అన్నారు సీఎం.
అమెరికాలో తన కుటుంబ సభ్యులు ఎన్నో ఏళ్లుగా ఉంటున్నారని రేవంత్ చెప్పుకొచ్చారు. తనకు ఏడుగురు సోదరులన్న రేవంత్ ..తాను సీఎం అయ్యానని వాళ్లంతా ఇంట్లోనే ఖాళీగా కూర్చుంటారా అని ప్రశ్నించారు. వారు వ్యక్తిగతంగా విదేశీ పర్యటనకు వెళ్లిన రాజకీయం చేస్తున్నారని సీఎం చెప్పుకొచ్చారు.
మరోవైపు బీజేపీలో బీఆర్ఎస్ విలీనం జరుగుతుందన్నారు సీఎం రేవంత్. కేసీఆర్ కు గవర్నర్, కేటీఆర్ కు సెంట్రల్ మినిస్టర్ పోస్ట్ ఇస్తారని.. హరీష్ రావు అసెంబ్లీలో అపోజిషన్ లీడర్ అవుతారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. వీరి విలీనంతో కవితకు బెయిల్ కూడా వస్తుందన్నారు సీఎం రేవంత్. అంతేకాకుండా ప్రస్తుతం బీఆర్ఎస్కు నలుగురు రాజ్యసభ సభ్యులు ఉన్నారని.. వాళ్ల విలీనంతో కవిత రాజ్యసభ సభ్యురాలు కూడా అవుతారని రేవంత్ చెప్పారు. సీఎం చేసిన ఈ కామెంట్స్ చర్చనీయాంశంగా మారింది. కాగా ఇప్పటికే బీజేపీలో బీఆర్ఎస్ విలీనం వార్తలను ట్విట్టర్ వేదికగా కేటీఆర్ ఖండించారు. తప్పుడు వార్తలు ప్రసారం చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.